Home Latest News IND vs PAK | ఆరంభం అదుర్స్‌.. మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌ ఘనవిజయం

IND vs PAK | ఆరంభం అదుర్స్‌.. మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌ ఘనవిజయం

IND vs PAK | టైమ్‌ 2 న్యూస్‌, కేప్‌టౌన్‌: మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ శుభారంభం చేసింది. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మెగాటోర్నీ తొలి పోరులో టీమ్‌ఇండియా 7 వికెట్ల తేడాతో దాయాది పాకిస్థాన్‌పై విజయం సాధించింది. ఇటీవల దక్షిణాఫ్రికా గడ్డపైనే జరిగిన అండర్‌-19 ప్రపంచకప్‌ను భారత అమ్మాయిలు చేజిక్కించుకోగా.. ఇప్పుడదే బాటలో హర్మన్‌ప్రీత్‌ బృందం తొలి అడుగు వేసింది. గ్రూప్‌-2లో భాగంగా ఆదివారం జరిగిన పోరులో టీమ్‌ఇండియా దుమ్మురేపింది. ఎప్పటి నుంచో అందని ద్రాక్షలా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీ చేజిక్కించుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బృందం తొలి అడ్డంకిని విజయవంతంగా దాటింది.

తొలుత బౌలర్లు సమిష్టిగా రాణించి పాకిస్థాన్‌ను ఓ మాదిరి స్కోరుకు పరిమితం చేయగా.. అనంతరం టాపార్డర్‌ దంచికొట్టడంతో భారత్‌ అలవోకగా విజయతీరాలకు చేరింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. బిస్మా మారూఫ్‌ (55 బంతుల్లో 68 నాటౌట్‌; 7 ఫోర్లు) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో జట్టును ముందుండి నడిపించగా.. అయేషా నసీమ్‌ (25 బంతుల్లో 43 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడింది. భారత బౌలర్లలో రాధా యాదవ్‌ 2, దీప్తి శర్మ, పూజ వస్త్రాకర్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో మన అమ్మాయిలు 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేశారు. జెమీమా రోడ్రిగ్స్‌ (38 బంతుల్లో 53 నాటౌట్‌; 8 ఫోర్లు) అజేయ అర్ధశతకంతో రాణించగా.. షఫాలీ వర్మ (33; 4 ఫోర్లు), రిచా ఘోష్‌ (20 బంతుల్లో 31 నాటౌట్‌; 5 ఫోర్లు) ఆకట్టుకున్నారు. యష్తిక భాటియా (17), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (16) ఎక్కువసేపు నిలువలేకపోయారు.

Womens T20 World Cup
Image Source: Indian Cricket Team Facebook

ఆఖర్లో బౌండ్రీల వర్షం

కెప్టెన్‌గా దేశానికి అండర్‌-19 ప్రపంచకప్‌ అందించిన యువ ఓపెనర్‌ షఫాలీ వర్మ దంచికొట్టడంతో 5 ఓవర్లు ముగిసేసరికి టీమ్‌ఇండియా 33 పరుగులు చేసింది. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలో యష్తిక, షఫాలీ వెనుదిరగగా.. భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ భారీ షాట్లు ఆడే ప్రయత్నంలో ఔటైంది. ఇక విజయం కష్టమే అనుకుంటున్న దశలో జెమీమా రోడ్రిగ్స్‌ రెచ్చిపోయింది. టీమిండియా విజయానికి 36 బంతుల్లో 55 పరుగులు చేయాల్సిన దశలో ఎడాపెడా బౌండ్రీలు బాదుతూ స్కోరు బోర్డును ఉరకలెత్తించింది. ఆమెకు రిచా ఘోష్‌ చక్కటి సహకారం అందించింది. నిదా వేసిన 17వ ఓవర్‌లో జెమీమా, రిచ చెరో ఫోర్‌ కొట్టడంతో 13 పరుగులు రాగా.. 18వ ఓవర్‌లో రిచా హ్యాట్రిక్‌ ఫోర్లతో పాకిస్థాన్‌ను హడలెత్తించింది. చివరి రెండు ఓవర్లలో విజయ సమీకరణం 14 పరుగులకు చేరగా.. జెమీమా ముచ్చటగా మూడు ఫోర్లతో మ్యాచ్‌ను ముగించి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కించుకుంది.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Sachin Tendulkar | జిల్లా స్థాయి టోర్నీలో ఓ ప్లేయర్‌ ప్రతిభకు సచిన్‌ టెండూల్కర్‌ ఫిదా..

Mohammed Shami | రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీని దాటేసిన మహమ్మద్‌ షమీ..

Ravindra Jadeja | జడేజాకి షాక్ ఇచ్చిన ఐసీసీ.. మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత

IND vs AUS | మూడు రోజుల్లోనే ముగిసే.. తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ జయభేరి

Rishabh Pant | ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. కర్రలసాయంతో నడిచేందుకు ట్రై చేస్తున్న రిషబ్ పంత్

Exit mobile version