KTR fires on Bandi Sanjay | తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ( Bandi Sanjay )పై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డ్రగ్స్పై తరచూ విమర్శలు చేస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్ ( KTR ).. డ్రగ్స్ పరీక్ష కోసం తన రక్తం ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే.. నేను చిత్తశుద్ధిగా బయటకు వస్తే కరీంనగర్ చౌరస్తాలో చెప్పు దెబ్బలు తినడానికి బండి సంజయ్ సిద్ధమేనా అంటూ కేటీఆర్ సవాలు విసిరారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ”డ్రగ్స్ పరీక్ష కోసం నా రక్తం, చర్మం, వెంట్రుకలు, గోర్లు అవసరం అయితే కిడ్నీ కూడా ఇస్తా.. నేను క్లీన్చీట్తో బటయకు వస్తే కరీంనగర్ చౌరస్తాలోని కమాన్ దగ్గర ఆయన చెప్పుతో ఆయనే కొట్టుకుంటారా? నేను ఇక్కడే సిద్ధంగా ఉంటాను. ఏ డాక్టరును తీసుకొస్తడో తీసుకురమ్మను. నేను చిత్తశుద్దితో బయటకు వచ్చిన తర్వాత కరీంనగర్ చౌరస్తాలోని కమాన్ దగ్గర చెప్పు దెబ్బలు తినడానికి సిద్ధమేనా? నా చెప్పు దెబ్బలు కాదు.. ఆయన చెప్పుతోనే ఆయన కొట్టుకుంటాడా? కరీంనగర్ కమాన్ వద్ద కొట్టుకోవాలి.. దీనికి సిద్ధమైతే నేను ఇక్కడే ఉంటాను” అంటూ తీవ్రస్థాయిలో బండిపై కేటీఆర్ విరుచుకుపడ్డారు.
” బండి సంజయ్కు ఏమైనా తెలివి ఉందా? ఇదేం రాజకీయం.. మనిషా.. పశువా” అంటూ వ్యాఖ్యానించారు. కరీంనగర్కు ఏం చేసిండో చెప్పడానికి చేత కాదు కానీ అరుపులు, పెడబొబ్బలు పెడుతుండు అంటూ కేటీఆర్ ఘాటుగా బదులిచ్చాడు. బండి సంజయ్ ఫాల్తూ మాటల రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.
గెలిచి నీ నియోజకవర్గానికి ఏం చేశావో చెప్పు
రైతు బంధుకోసం తెలంగాణ ప్రభుత్వం రైతులకు రూ.65వేల కోట్లు ఇచ్చిందని, ఇంత కన్నా మేలు చేసిన ప్రభుత్వాలు ఏవైనా ఉన్నాయా చెప్పాలంటూ సూటిగా ప్రశ్నించారు. కేంద్రం వడ్లు కొనా అన్నా.. కేసీఆర్ ఆధ్వర్యంలోని సర్కారు కొన్నదన్నారు. ఎర్రటి ఎండలో నీటి ప్రవాహం వచ్చింది అంటే కేసీఆర్ ఘనత కాదా అన్నారు. నేతన్న కార్మికులకు , రైతులకు మీరు ఏమైనా చేశారా అంటూ బీజేపీ నేతలనుద్దేశించి ప్రశ్నించారు. బైంసాను దత్తత తీసుకున్నా అంటున్న బండి సంజయ్ నువ్ గెలిచిన నీ నియోజకవర్గంలో ఏం చేశావో చెప్పాలంటూ కేటీఆర్ ప్రశ్నించారు.
బండి.. నీకు ఇదే చివరి అవకాశం
వేములవాడకు వంద కోట్లతో అభివృద్ది చేపించినవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ ఐఐఐటీ అడిగినం కానీ అది కూడా తీసుకురాలేవు. ఈ బడ్జెట్కి బండికి ఇదే చివరి అవకాశం. ఇప్పటికైనా కరీంనగర్ ప్రజలకు ఏమైనా తీసుకురా. బడ్జెట్ సమావేశాలకు వెళ్లు , హిందీ రాకపోతే ఇంగ్లీషులో మాట్లాడు. కానీ కరీంనగర్కు ఏమైనా తీసుకురా’ అంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇద్దరు గుజరాతోళ్లు దేశాన్ని నడపొచ్చు. కానీ మన రాష్ట్రాన్ని నడిపే ముఖ్యమంత్రి దేశాన్ని ఎందుకు నడపొద్దు అని ప్రశ్నించారు.
Read More Articles |
Bandi Sanjay | తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై బండి సంజయ్ కామెంట్స్.. సిద్ధంగా ఉండాలంటూ నేతలకు సూచన