Sircilla kidnap | సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో యువతి శాలిని కిడ్నాప్ కేసులో ఊహించని ట్విస్ట్ నెలకొంది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని.. కావాలనే వెళ్లానని తెలిపింది. అంతేకాదు.. ప్రియుడు జానీని కొండగట్టు అంజన్న ఆలయంలో పెళ్లి చేసుకుంది. అనంతరం ఆ పెళ్లి ఫొటోలను విడుదల చేశారు. జానీతో కొద్దిరోజులుగా ప్రేమలో ఉన్నానని.. ఇవాళ ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని శాలిని వెల్లడించింది. మాస్క్తో రావడంతో ఫస్ట్ ఎవరో అనుకున్నానని.. కారు ఎక్కిన తర్వాత మాస్క్ తీయడంతో జానీని గుర్తు పట్టానని స్పష్టం చేసింది. ఏడాదిగా పెళ్లి చేసుకుంటామని తమ తల్లిదండ్రులకు చెప్తున్నా కానీ.. దళితుడు కాబట్టే పెళ్లికి ఒప్పుకోలేదని శాలిని వెల్లడించింది. తన తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని.. తమకు భద్రత కల్పించాలని పోలీసులను ఈ సందర్భంగా శాలిని కోరింది.
నాలుగేళ్లుగా ప్రేమ
మూడపల్లికి చెందిన శాలిని అదే గ్రామానికి చెందిన కట్కూరి జానీ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇదే విషయం తల్లిదండ్రులకు చెబితే ఒప్పుకోలేదు. జానీ దళితుడనే కారణంతో పెళ్లికి నిరాకరించారు. దీంతో గత ఏడాది శాలినిని బయటకు తీసుకెళ్లి జానీ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి సమయానికి ఆమె మైనర్ కావడంతో పోలీసులు జానీపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో జానీ జైలుకెళ్లి వచ్చాడు. ఆ తర్వాత శాలిని తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నం చేసినా వాళ్లు మాటవినలేదు. ఈ క్రమంలోనే శాలినిని మానసికంగా వేధించేవారని జానీ వెల్లడించారు. శాలిని తల్లిదండ్రులు ఒప్పుకోలేదు కాబట్టే కిడ్నాప్ డ్రామా ఆడి శాలినిని తీసుకెళ్లినట్టు స్పష్టం చేశాడు.
అసలేమైంది?
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో తండ్రితో కలిసి అంజన్న ఆలయానికి వెళ్లిన శాలిని అనే యువతిని నలుగురు యువకులు బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు. అడ్డుకోబోయిన తండ్రిని నెట్టేసి వేగంగా కారును పోనిచ్చారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు బయటకు రావడంతో ఈ ఘటన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Read More Articles |