Delhi liquor scam | ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. సమీర్ మహేంద్రుపై దాఖలు చేసిన ఛార్జ్షీటులో కవిత పేరును చేర్చింది. కవిత వాడిన మొబైల్ ఫోన్లను ధ్వంసం చేసినట్లు కూడా ఛార్జిషీటులో ఈడీ పేర్కొంది. మాగుంట శ్రీనివాస్ రెడ్డి, మాగుంట రాఘవ రెడ్డి, గౌతమ్, రామచంద్ర పిళ్లై, అభిషేక్రావు పేర్లు కూడా ఛార్జిషీటులో ఉన్నాయి.
సమీర్ కంపెనీలో కవితకు 32 శాతం వాటా ఉన్నట్లు ఈడీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. అలాగే శరత్ చంద్రారెడ్డి చేతుల్లో ఉన్న ఐదు రిటైల్ జోన్లను అభిషేక్ రావు నడిపిస్తున్నట్లు ఛార్జిషీటులో పేర్కొంది. ఢిల్లీలోని ఒబేరాయ్ హోటల్లో మాగుంట శ్రీనివాస్ రెడ్డి మీటింగ్ను ఏర్పాటు చేసినట్లు సమీర్ చెప్పాడని, ఈ మీటింగ్లో శరత్ చంద్రారెడ్డి, బుచ్చిబాబు, కవిత, అరుణ్ పిళ్లై, దినేశ్ అరోరా పాల్గొన్నట్లు ఛార్జిషీటులో ఈడీ తెలిపింది. సమీర్ మహేంద్రు, కవిత, బుచ్చిబాబు, శరత్ చంద్రారెడ్డి నలుగురు కలసి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చినట్లు అందులో పేర్కొంది.
ఇండో స్పిరిట్స్ కంపెనీ ఛైర్మన్ అయిన సమీర్ మహేంద్రుతో కలిసి ఎక్కడ, ఎప్పుడెప్పుడు ఎవరెవరు సమావేశమయ్యారు ? ఏ చార్టెర్డ్ ఫ్లైట్లో వెళ్లారు? వీళ్లకు సంబంధించిన షేర్లు సంగతి.. లిక్కర్ స్కామ్ బయటకు వచ్చిన తర్వాత ఫోన్లను ఎలా ధ్వంసం చేశారు.. అనే విషయాలను 181 పేజీల ఛార్జిషీట్లో ఈడీ పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా లిక్కర్ స్కామ్లో సమీర్ మహేంద్రు కీలకంగా వ్యవహరించినట్లు ఈడీ పేర్కొంది. సౌత్ లాబీ పేరుతో టీమ్గా ఏర్పడి వంద కోట్లకు పైగా వసూలు చేశారని, వాటితో ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాతో పాటు మరికొందరికి ఇచ్చినట్లుగా చార్జిషీటులో పేర్కొనడం ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఇండో స్పిరిట్ పేరుతో ఎల్1 కింద వచ్చిన షాపుల్లో కవితకు కూడా వాటా ఉందని ఛార్జిషీటులో పేర్కొన్నారు. ఇండో స్పిరిట్స్లో నిజమైన పార్టనర్స్ కవిత, మాగుంట శ్రీనివాస్ రెడ్డి అని ఛార్జిషీట్లో ఈడీ పేర్కొన్నట్లు తెలుస్తోంది.
Read More Articles |
Bandi Sanjay | తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై బండి సంజయ్ కామెంట్స్.. సిద్ధంగా ఉండాలంటూ నేతలకు సూచన