Minister Mallareddy | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. ఇది ఇంటి సమస్య అని త్వరలో పరిష్కరించుకుంటామని చెప్పారు. ఈ విషయాన్ని మీడియానే పెద్దదిగా చేసి చూపిస్తోందని వ్యాఖ్యానించారు. పదవులు ఇచ్చేది సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తప్ప నేను కాదంటూ మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. తాను గాంధేయవాదినని, ఎవరితోనూ గొడవ పెట్టుకునే రకం కాదన్నారు. జిల్లాకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలతో స్వయంగా మాట్లాడుతానని అన్నారు. మా మధ్య అంత పెద్ద సమస్య ఏం లేదన్నారు. అవసరమైతే తన ఇంటికే ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తానని అన్నారు . కావాలనే కొందరు దీన్ని పెద్దదిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని మల్లారెడ్డి ఆరోపించారు.
అసలేం జరిగింది…
మంత్రి మల్లారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, జిల్లా పదవులన్నీ ఆయన వర్గానికే తీసుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఈ మేరకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నివాసంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్, ఉప్పల్ ఎమ్మెల్యే బి సుభాష్ రెడ్డిలు భేటీ అయ్యారు.
మేడ్చల్ ఎమ్మెల్యే, మంత్రి మల్లారెడ్డిపై అసమ్మతితోనే భేటీ నిర్వహించారు. మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్న మల్లారెడ్డి జిల్లాలోని అన్ని పోస్టులను ఆ నియోజకవర్గానికి సంబంధించిన అనుచరులకే ఇప్పిస్తున్నారని ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు.
ఆదివారం నాడు ఓ వివాహ వేడుకలో మైనంపల్లి హన్మంతరావు, మంత్రి మల్లారెడ్డి మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఇతర ఎమ్మెల్యేల పనులు చేయొద్దంటూ కలెక్టర్కు మంత్రి మల్లారెడ్డి ఆదేశాలిచ్చినట్లు సమాచారం. దీనిపై మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ప్రొటోకాల్ పాటించడం లేదని, రాత్రికి రాత్రే మార్కెట్ కమిటీ చైర్మన్ను మార్చేశారని మైనంపల్లి అన్నారు. తమ నియోజవర్గాల్లోని కార్యకర్తలకు ఏం చేయలేకపోతున్నామని, కనీసం కార్పొరేషన్ ఎన్నికల్లోనూ అవకాశాలు ఇవ్వలేకపోయినట్లు చెప్పారు. జిల్లా మొత్తంలో ఒకే నియోజకర్గానికి చెందిన వాళ్లకే పదవులు ఇస్తే ఎట్లా అని మంత్రి మల్లారెడ్డిని ప్రశ్నించారు.
Read More Articles |
Vishal | రాజకీయాల్లోకి రావడం పక్కా కానీ.. కుప్పంలో చంద్రబాబు మీద పోటీపై క్లారిటీ ఇచ్చిన విశాల్
elangana Inter exams schedule| తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. మార్చి 15 నుంచి పరీక్షలు..