Malla reddy Vs Mynampally | మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో విభేదాలు బయటపడ్డాయి. తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. మంత్రి మల్లారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, జిల్లా పదవులన్నీ ఆయన వర్గానికే తీసుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. ఈ మేరకు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నివాసంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్, ఉప్పల్ ఎమ్మెల్యే బి సుభాష్ రెడ్డిలు భేటీ అయ్యారు.
మేడ్చల్ ఎమ్మెల్యే, మంత్రి మల్లారెడ్డిపై అసమ్మతితోనే భేటీ నిర్వహించినట్లు తెలుస్తోంది. మేడ్చల్ మార్కెంటింగ్ కమిటీ పోస్టు విషయం వీరి ఆగ్రహానికి కారణమైనట్లు తెలుస్తోంది. మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్న మల్లారెడ్డి జిల్లాలోని అన్ని పోస్టులను ఆ నియోజకవర్గానికి సంబంధించిన అనుచరులకే ఇప్పిస్తున్నారని ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు.
వివాదానికి కారణమిదేనా?
ఆదివారం నాడు ఓ వివాహ వేడుకలో మైనంపల్లి హన్మంతరావు, మంత్రి మల్లారెడ్డి మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఇతర ఎమ్మెల్యేల పనులు చేయొద్దంటూ కలెక్టర్కు మంత్రి మల్లారెడ్డి ఆదేశాలిచ్చినట్లు సమాచారం. దీనిపై మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ప్రొటోకాల్ పాటించడం లేదని, రాత్రికి రాత్రే మార్కెట్ కమిటీ చైర్మన్ను మార్చేశారని మైనంపల్లి అన్నారు. తమ నియోజవర్గాల్లోని కార్యకర్తలకు ఏం చేయలేకపోతున్నామని, కనీసం కార్పొరేషన్ ఎన్నికల్లోనూ అవకాశాలు ఇవ్వలేకపోయినట్లు చెప్పారు. జిల్లా మొత్తంలో ఒకే నియోజకర్గానికి చెందిన వాళ్లకే పదవులు ఇస్తే ఎట్లా అని మంత్రి మల్లారెడ్డిని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలంతా ఒకే మాట మీద ఉన్నామని, ఇదేమీ రహస్య సమావేశం కాదంటూ మైనంపల్లి వ్యాఖ్యానించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి అంశాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లినా.. తొందరపడి జీవో ఇచ్చారని మల్లారెడ్డిపై అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో తనను పట్టించుకోవడం లేదని మాధవరం కృష్ణారావు ఆరోపించారు. జిల్లా పదవులన్నీ ఒకే నియోజకర్గానికి వెళ్తున్నాయని, మంత్రి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. నామినేటెడ్ పదవులు తమ కార్యకర్తలకు ఇవ్వట్లేదంటూ అరికపూడి గాంధీ పేర్కొన్నారు.
మంత్రి పదవికి ఎసరు పెట్టారా?
మల్లారెడ్డి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలు ఆయనను పదవి నుంచి తప్పించేలా అధిష్ఠానానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ స్థానంలో మైనంపల్లికి పదవి ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా సమావేశంలో వచ్చినట్లు సమాచారం. మరోవైపు ఎమ్మెల్యేల సమావేశంపై కూడా అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
మల్లారెడ్డి అలా చేసుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు
మరోవైపు సమావేశం అనంతరం మాట్లాడిన మైనంపల్లి.. ఈ సమావేశం అంతర్గత విషయమని అన్నారు. ఎవరో ఒకరు చెప్పకుంటే సమస్యలు ఎట్లా తెలుస్తాయంటూ వ్యాఖ్యానించారు. మంత్రి మల్లారెడ్డి అందరినీ కలిసి మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుంటే ఇప్పుడిలా సమావేశం పెట్టే అవసరం వచ్చి ఉండేది కాదంటూ ఇండైరెక్ట్గా చెప్పారు. ఒక్కొక్కరికీ ఏడేళ్లుగా నామినేటెడ్ పదవులు ఇస్తున్నారని, తమ కార్యకర్తలకు కూడా పదవులు రావాలనే అడుగుతున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లేందుకే మాట్లాడుతున్నామని చెప్పారు. ఇప్పటికే పదవులు ఉన్నవాళ్లు 3,4 పదవులు తీసుకున్నారని ఆరోపించారు. ఎవరో ఒక్కరు చేసినదానికి పార్టీ డ్యామేజ్ అవుతుందన్నారు. రాష్ట్రంలో గెలవాలంటే పథకాలు ఒక్కటే కాదని, కేడర్ కూడా ముఖ్యమని మైనంపల్లి స్పష్టం చేశారు. కేటీఆర్తో చర్చించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. తన కొడుకు కోసం మీటింగ్ పెట్టలేదని మైనంపల్లి స్ఫష్టం చేశారు.
Read More Articles |
Telangana Inter exams schedule| తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. మార్చి 15 నుంచి పరీక్షలు..
Dammaiguda | దమ్మాయిగూడ బాలిక మృతి కేసులో వీడిన మిస్టరీ
Bigg Boss Telugu season 6 | బిగ్బాస్ సీజన్ 6 విజేత రేవంత్.. టైటిల్ విజేతకంటే రన్నరప్కే ప్రైజ్మనీ ఎక్కువ.. ఎందుకో తెలుసా?
Rythu bandhu | తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతుబంధు పడేది అప్పట్నుంచే !!