Bandi Sanjay | తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలంటూ నేతలకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సూచించారు. ప్రజాసమస్యలపై మరింత దూకుడుగా వెళ్లాలని పిలుపునిచ్చారు.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం కోర్ కమిటీ, పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడిన బండి.. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని, కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని నాయకులకు సూచించారు.
పాతఫోన్లు పక్కన పడేసి.. ఐఫోన్లు తీసుకోండి
ఈ సందర్భంగా మాట్లాడిన బండి.. బీజేపీ నేతలు, పార్టీలో చర్చించుకున్న అంశాలు, పార్టీతో ముడిపడిన విషయాలన్నీ మన పార్టీ కంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసిపోతున్నాయని వ్యాఖ్యానించారు. బీజేపీ నాయకుల ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్ చేపిస్తూ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. బీజేపీ నాయకులంతా ఇప్పుడున్న పాతఫోన్ల స్థానంలో కొత్త ఐ ఫోన్లు తీసుకోవాలని బండి సంజయ్ సూచించారు.
హైదరాబాద్లో ఆరో విడత ప్రజాసంగ్రామ యాత్ర
ఆరో విడత ప్రజా సంగ్రామ యాత్రను హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో కొనసాగించాలని రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కోర్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. పార్టీలో నేతల మధ్య సమన్వయం, కార్యక్రమాల నిర్వహణపై పార్టీ రాష్ట్ర ఇంచార్జి తరుణ్ చుగ్ దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, జనంలోనే ఎక్కువగా ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఈ సందర్భంగా తరుణ్చుగ్ నేతలకు సూచించారు. ఆపరేషన్ ఆకర్ష్పై దృష్టి పెట్టాలని అన్నారు.
రైతు రుణమాఫీ, ధరణి సమస్యలపై ధర్నా..
రైతు రుణమాఫీ, ధరణి సమస్యలపై ఈనెల 27న జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహించాలని కోర్కమిటీ నిర్ణయించింది. పార్లమెంట్ ప్రవాసీ యోజన, జనం గోస.. బీజేపీ భరోసా కార్యక్రమాల నిర్వహణ తీరుపైనా తరుణ్ చుగ్ సమావేశంలో చర్చించారు. కాగా, ఈ సమావేశానికి బీజేపీ కీలక నాయకుడు ఈటల రాజేందర్ హాజరుకాలేదు.
Read More Articles |
Harish Rao | బీజేపీ సర్కారు అవార్డులు రద్దు చేసినా చేస్తది.. బీజేపీ తీరుపై హరీశ్ రావు సెటైర్
BRS Party | ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీసును ప్రారంభించిన కేసీఆర్.. హాజరైన అఖిలేష్ యాదవ్, కుమారస్వామి