Digvijaya singh on TPPC | తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితిపై అధిష్ఠానం ఫోకస్ పెట్టింది. రేవంత్ రెడ్డికి సీనియర్లకు మధ్య పెరుగుతున్న దూరాన్ని తగ్గించేందుకు చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ను రంగంలోకి దించింది.
ఇటీవలే టీపీసీసీ ప్రకటించిన కమిటీలే ఈ వివాదానికి కారణమైంది. కాంగ్రెస్ కమిటీలు సరిగా లేవంటూ సీనియర్లు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి బహిరంగంగానే విమర్శిండం మొదలుపెట్టారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకే పదవులు ఇచ్చారని ఆరోపించారు. సీనియర్లను పక్కకు పెట్టి నిన్న మొన్న వచ్చిన వాళ్లకు పదవులు ఇవ్వడమేంటని రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలైన కాంగ్రెస్ను కాపాడుకుంటామని వ్యాఖ్యానించారు. అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. దీంతో.. 12 మంది నేతలు తమ పదవులకు రాజీనామా చేస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జి మాణిక్కం ఠాగూర్కు లేఖ రాశారు. ఆ పదవులు సీనియర్లకే ఇవ్వాలని ప్రకటించారు. ఈ క్రమంలోనే సీనియర్లు మరోసారి మంగళవారం సాయంత్రం సమావేశం కావాలని నిర్ణయించారు. పరిస్థితి చేజారిపోతుందన్న విషయాన్ని గ్రహించిన అధిష్ఠానం అప్రమత్తమైంది. వెంటనే దిగ్విజయ్ సింగ్ను రంగంలోకి దించింది. టీ కాంగ్రెస్ అడ్వయిజర్గా బాధ్యతలు అప్పగించింది.
బాధ్యతలు తీసుకున్న వెంటనే దిగ్విజయ్ రంగంలోకి దిగారు. నేరుగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు ఫోన్ చేసి స్వయంగా మాట్లాడుతున్నరు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మహేశ్వర్ రెడ్డికి ఫోన్ చేశారు. పార్టీలో జరగుతున్న పరిణామాలపై ఆరా తీశారు. రెండు రోజుల్లో హైదరాబాద్ వస్తానని ఆయనతో చెప్పినట్లు తెలుస్తోంది. వచ్చాక నేతలందరితో కూర్చుని చర్చిస్తానని వివరించినట్లు మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఇవాళ ( మంగళవారం ) జరగాల్సిన సమావేశాన్ని రద్దు చేసుకోవాలని దిగ్విజయ్ సింగ్ సూచించారు. ఆయన సూచన మేరకు ఈరోజు జరగాల్సిన సమావేశాన్ని సీనియర్లు రద్దు చేసుకున్నారు. దిగ్విజయ్ సింగ్ కు ఏపీ, తెలంగాణ రాజకీయాలపై గట్టి పట్టుంది. దీంతో ఆయన్నే రంగంలోకి దించి పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేస్తుంది.
మరోవైపు సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. దిగ్విజయ్ కూడా ఫోన్ చేసి భట్టితో మాట్లాడారని తెలుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, నేతల మధ్య వివాదాలపై హైదరాబాద్ వచ్చాక చర్చిస్తానని చెప్పినట్లు సమాచారం.