Gavaskar | టైమ్ 2 న్యూస్, ఇండోర్: ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో పరాజయం పాలైన భారత జట్టుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సొంతగడ్డపై తమకు అనుకూలంగా ఉండే విధంగా.. స్పిన్ పిచ్ను తయారు చేయించి బొక్క బోర్లా పడ్డ టీమిండియా.. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ అవకాశాలను సంక్లిష్టం చేసుకోగా.. ఇండోర్ టెస్టులో మనవాళ్లు ప్రతిభకు తగ్గ ప్రదర్శన చేయలేకపోయారని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ విమర్శించారు. తొలి రోజు నుంచే అనూహ్య బౌన్స్ లభించిన పిచ్పై భారత బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడగా.. పట్టుదల ప్రదర్శించిన కంగారూలు చక్కటి ఆటతీరుతో మ్యాచ్ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మూడు రోజుల్లోనే (7 సెషన్ల లోపే) ముగిసిన పోరుపై గవాస్కర్ పెదవి విరిచాడు. స్పిన్ను సమర్థవంతంగా ఆడగలిగే ప్లేయర్లు ఉన్న రోహిత్ సేన తొలి ఇన్నింగ్స్లో 109, రెండో ఇన్నింగ్స్లో 163 పరుగులకు ఆలౌట్ కావడం.. వారి పేలవ ఆటతీరుకు నిదర్శనమని అన్నాడు. ఈ విజయంతో ఆస్ట్రేలియా డబ్లూ్యటీసీ ఫైనల్కు అర్హత సాధించగా.. భారత జట్టు చివరి టెస్టుపై ఆశలు పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో సన్నీ మాట్లాడుతూ.. ‘భారత ప్లేయర్లు తమ ప్రతిభకు న్యాయం చేలేకపోయారు. టీమిండియా వికెట్లు కోల్పోయిన తీరు గమనిస్తే.. ఎప్పుడెప్పుడు డగౌట్కు చేరుదామా అన్నట్లు కనిపించింది. కొన్ని షాట్స్ ఆడితే పిచ్ ఎలాంటిదో అర్థమయ్యే అవకాశం ఉన్నా.. మనవాళ్లు ఆ ప్రయత్నమే చేయలేదు. ఈ సిరీస్ మొత్తాన్ని పరిశీలించినా.. రోహిత్ శర్మ మినహా తక్కినవాళ్లెవరూ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు. అలాంటి సమయంలో వికెట్ ఎక్కువ సమయం గడపడం ముఖ్యం. అంతేకాని నిర్లక్ష్యపు షాట్లతో మూల్యం చెల్లించుకోవడం సరైన పద్ధతి కాదు. రోహిత్ నాగ్పూర్లో చక్కటి శతకం సాధించాడు. ఇతర ఆటగాళ్లు పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లోనే సంయమనం ముఖ్యం. పిచ్పై మనం ఆడాలి కానీ.. పిచ్ను మనతో ఆడుకునే అవకాశం ఇవ్వకూడదు. ఇండోర్లో ఇదే జరిగింది. ఆది నుంచి అదే కొనసాగింది. దీంతో ఫలితం బెడిసి కొట్టింది. తొలి ఇన్నింగ్స్లో మరో 60-70 పరుగులు చేసుంటే పరిస్థితి ఇంత ఘోరంగా ఉండేది కాదు. తొలి రోజు నుంచే అనూహ్యంగా స్పందించిన పిచ్పై బ్యాటింగ్ చేయడం కష్టమే అయినా.. టీమిండియా మరిన్ని పరుగులు చేయాల్సింది. తొలి ఇన్నింగ్స్లో భారత ఫిల్డింగ్ తప్పిదాలు కూడా ఆస్ట్రేలియాను కోలుకునే అవకాశాలిచ్చాయి. ముఖ్యంగా జడేజా నోబాల్కు లబుషేన్ ఔట్ కావడం మ్యాచ్ గతిపై ప్రభావం చూపింది’ అని వివరించాడు. ఇరు జట్ల మధ్య ఈ నెల 9 నుంచి అహ్మదాబాద్ వేదికగా నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లో నెగ్గితే ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా టీమిండియా డబ్లూ్యటీసీ ఫైనల్కు చేరనుంది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Manchu Manoj | సైలెంట్గా మంచు మనోజ్, భూమా మౌనిక పెళ్లి.. ఫొటోలు వైరల్
Rashmika Mandanna | ఆప్షన్ లేదు నీకు.. అర్థమైంది మాకు.. రష్మిక గ్లామర్ షో వెనక కారణం ఇదే..!
Sunil | సునీల్ ఇంక హీరోగా పనికిరాడా.. విలన్ గా సెటిల్ అయిపోతాడా..?