Home Latest News Telangana | పెద్దలు ఒప్పుకున్నాక పురుగుల మందు తాగిన ప్రేమ జంట.. మంచిర్యాల జిల్లాలో విషాదం

Telangana | పెద్దలు ఒప్పుకున్నాక పురుగుల మందు తాగిన ప్రేమ జంట.. మంచిర్యాల జిల్లాలో విషాదం

Image by Freepik

Telangana | అబ్బాయి ఆటో డ్రైవర్.. అమ్మాయి డిగ్రీ పూర్తి చేసింది.. ఇద్దరూ ఇష్టపడ్డారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా దగ్గరయ్యారు. ఇంతలోనే వాళ్ల ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలిసింది. వాళ్ల ప్రేమకు పెద్దలు అడ్డుచెప్పలేదు. మన అంతస్తు ఏంటి.. వాళ్ల అంతస్తేంటి? మీ ఇద్దరికీ ప్రేమ ఏంటని సినిమా డైలాగులు చెప్పలేదు. పెద్ద మనసుతో వాళ్ల పెళ్లికి అంగీకరించారు. వాళ్లిద్దరూ కలిసి బతకడానికి పెద్దలు అంగీకరించినా.. విధి వాళ్లను చిన్నచూపు చూసింది. దీంతో పెళ్లికి కొద్దిరోజుల ముందే ఆ ప్రేమ జంట పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. మంచిర్యాల జిల్లాలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది.

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం దొనబండ గ్రామానికి చెందిన నాగవెల్లి శ్రీకాంత్ (25) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన నరెడ్ల సిద్ధయ్య చిన్న కుమార్తె సంఘవి(21) డిగ్రీ పూర్తి చేసి ఇంటి దగ్గరే ఉంటుంది. ఒకే గ్రామం కావడంతో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కొద్దిరోజులకే ఇరు కుటుంబాల పెద్దలకు విషయం తెలిసింది. పిల్లల ప్రేమను కాదంటే వాళ్లు ఏదైనా అఘాయిత్యానికి పాల్పడతారేమోనని వాళ్లు భావించారు. పెద్ద మనస్సుతో పిల్లల ప్రేమను అంగీకరించారు. ఇద్దరికీ ఘనంగా పెళ్లి చేయాలని నిర్ణయించారు. శ్రీకాంత్, సంఘవి ప్రేమకథ సుఖాంతం అవుతుందని అంతా అనుకుంటున్న సమయంలో విధి వాళ్ల జీవితాలతో ఆడుకుంది.

అప్పులు పెరిగిపోవడంతో వాటిని ఎలా తీర్చాలో తెలియక శ్రీకాంత్ చాలా ఆందోళన చెందాడు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రేపు పెళ్లయిన తర్వాత ప్రేమించిన అమ్మాయిని సుఖపెట్టగలనా అని తెగ మదనపడిపోయాడు. మనసారా ప్రేమించిన అమ్మాయిని కష్టపెట్టలేనని భావించాడు. ఇదే విషయం సంఘవితో చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం సంఘవిని తీసుకుని శ్రీకాంత్ ఎల్లంపల్లి జలాశయం వైపు తీసుకెళ్లాడు. అక్కడ తన పరిస్థితి మొత్తాన్ని సంఘవికి వివరించాడు. తనను పెళ్లి చేసుకోలేనని చెప్పేశాడు. ప్రేమించిన అమ్మాయితో జీవితం పంచుకోలేకపోతున్నా అనే బాధతో తన వెంట తెచ్చుకున్న పురుగులమందు తాగేశాడు. తనే సర్వస్వం అనుకున్న వ్యక్తి చర్యతో సంఘవి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. తానే ప్రాణం అనుకున్న వ్యక్తి లేనప్పుడు తాను బతకడం ఎందుకని అనుకుంది. వెంటనే శ్రీకాంత్ చేతిలోని పురుగుల మందు డబ్బాను లాక్కొని తాగేసింది.

ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి తన కోసం ప్రాణాలు తీసుకోవాలని అనుకోవడంతో శ్రీకాంత్ తెగ బాధపడిపోయాడు. ఎలాగైనా సంఘవిని బతికించుకుని కష్టమో నష్టమో ఆమెతో నిండు నూరేళ్లు ఉండాలని అనుకున్నాడు. జరిగిన విషయాన్ని వెంటనే కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. సంఘవిని తన ఆటోలోనే ఎక్కించుకుని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వాళ్ల పరిస్థితి విషమంగా ఉండటంతో ఇద్దరినీ కుటుంబసభ్యులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీకాంత్ శనివారం రాత్రి మృతిచెందాడు. శ్రీకాంత్ మరణించిన కొద్ది గంటల్లోనే పరిస్థితి విషమించడంతో సంఘవి కూడా ప్రాణాలు విడిచింది. దీంతో ఇరు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. ఇలాంటి పరిస్థితి రావద్దనే వాళ్ల ప్రేమకు అంగీకరించామే.. అయినా పిల్లలు ఇలా చేశారే అని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Viral News | పాత మంచం పంపించారని పెళ్లికి డుమ్మా కొట్టిన వరుడు.. షాకిచ్చిన వధువు తండ్రి

Laxmi Parvathi on Taraka Ratna Death | నారా లోకేశ్‌కు చెడ్డపేరు వస్తుందనే.. తారకరత్న మరణవార్తను దాచిపెట్టారు.. చంద్రబాబుపై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

BRS MLA Sayanna | బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత..

Viral News | ఎద్దుతో యువకుడికి ఘనంగా పెళ్లి.. అనకాపల్లిలో వింత ఆచారం

Viral News | గుజరాత్‌లో నోట్ల వర్షం కురిపించిన మాజీ సర్పంచ్‌.. రూ. 500 కాగితాలను ఏరుకునేందుకు ఎగబడ్డ జనం

YS Sharmila | మహబూబాబాద్‌లో టెన్షన్‌.. టెన్షన్‌.. వైఎస్‌ షర్మిల అరెస్టు.. పాదయాత్రకు అనుమతి కూడా రద్దు

Exit mobile version