Layoffs | ప్రపంచ దేశాల్లో నెలకొన్న మాంద్యం ఐటీ ఉద్యోగులను భారీగా వణికిస్తోంది. ఖర్చులను తగ్గించుకునేందుకు స్టార్టప్ల నుంచి మొదలు గూగుల్, అమెజాన్, మెటా సహా దిగ్గజ కంపెనీల దాకా లేఆఫ్స్ను ఎంచుకుంటున్నారు. తమ ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇచ్చి బయటకు పంపించేస్తున్నారు. ఇప్పటివరకు ఉద్యోగుల వరకు మాత్రమే పరిమితమైన లేఆఫ్స్ ఇప్పుడు రోబోలను వదలడం లేదు. గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ రోబోలను కూడా పనిలో నుంచి తీసేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. కేఫ్టేరియాలో క్లీనింగ్ కోసం ఎవ్రీడే రోబోస్ పేరిట తీసుకొచ్చిన ప్రాజెక్ట్ను అర్ధంతరంగా నిలిపివేసింది.
చాట్ జీపీటీ ప్రభంజనం చూసిన గూగుల్ తన ఉనికి కాపాడుకోవడానికి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద దృష్టి పెట్టింది. చాట్ జీపీటీ తరహాలో ప్రాజెక్ట్ తీసుకొచ్చి వాటితో పోటీ పడాలని భావిస్తోంది. దీనికోసం ఏఐ సామర్థ్యాలను మెరుగుపరచుకోవడం మీదనే అల్ఫాబెట్ ఫోకస్ ఉంది. ఈ క్రమంలోనే అల్ఫాబెట్ తన అతి చిన్న అనుబంధ సంస్థల్లో ఒకటైన ఎవ్రీడే రోబోలను తొలగించాలని నిర్ణయించుకుంది.
ఎవ్రీడే రోబోస్ ప్రాజెక్ట్ను 2019లో అల్ఫాబెట్ ప్రారంభించింది. ఇందులో భాగంగా 100కిపైగా రోబోలను సిద్ధం చేసి కేఫ్టేరియా పనికోసం వాడుకోవడానికి ట్రైనింగ్ ఇచ్చింది. అంటే టేబుల్స్ సర్దడం, రీసైకిల్ కోసం చెత్తను వేరు చేయడం, తలుపులు తెరవడం వంటి శిక్షణ ఇచ్చింది. శిక్షణ పొందుతున్నప్పుడు, రోబోలు కంపెనీ డైనింగ్ హాల్ను చక్కబెట్టడం, కరోనా సమయంలో సమావేశ గదుల శుభ్రతను చెక్ చేయడం వంటి అనేక పనులను చేపట్టాయి. కానీ ఈ ప్రాజెక్ట్ అంత లాభదాయకం కాదని ఇప్పుడు అల్ఫాబెట్ భావించింది. దీంతో ఈ ప్రాజెక్ట్ను అల్ఫాబెట్ నిలిపివేసింది. ఇకపై ఎవ్రీడే రోబోలు ఆల్ఫాబెట్లో ప్రత్యేక ప్రాజెక్ట్గా ఉండవని ఎవ్రీడే రోబోల మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ డెనిస్ గంబోవా తెలిపారు. ఆ ప్రాజెక్ట్ కోసం ఉపయోగించిన టెక్నాలజీని, టీమ్ను వేరే రొబోటిక్ ప్రాజెక్ట్ల్లో విలీనం చేస్తున్నామని తెలిపారు.
Follow Us : Google News, Facebook, Twitter