WTC 2023 Final | టైమ్ 2 న్యూస్, క్రైస్ట్చర్చ్: పోరాటానికి మారుపేరైన న్యూజిలాండ్.. మరోసారి విశ్వరూపం కనబర్చింది. సొంతగడ్డపై శ్రీలంకతో జరుగుతున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో కివీస్ అదిరిపోయే బోణీ కొట్టింది. ఐదు రోజుల పాటు ఆధిక్యం చేతులు మారుతూ సాగిన పోరులో చివరకు ఫలితం ఆతిథ్య న్యూజిలాండ్కు అనుకూలంగా వచ్చింది. వర్షం కారణంగా చివరి రోజు ఆట పూర్తిగా సాగకపోయినా.. పరిస్థితులు బౌలర్లకు సహకరిస్తున్నా.. మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టులో తన విలువేంటో చూపిస్తూ అదిరిపోయే సెంచరీ బాదాడు. సుదీర్ఘ ఫార్మాట్ చరిత్రలోనే చిరకాలం గుర్తుండిపోయేలా సాగిన పోరులో చివరకు న్యూజిలాండ్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇటీవల ఇంగ్లండ్తో ఉత్కంఠ పోరులో 1 పరుగు తేడాతో గెలిచిన న్యూజిలాండ్.. తాజా మ్యాచ్లో చివరి బంతికి పరుగుతీసి గట్టెక్కింది. దీంతో లంక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ( డబ్ల్యూటీసీ ) ఫైనల్ ఆశలు గల్లంతు కాగా.. ఆస్ట్రేలియాతో చివరి టెస్టును ‘డ్రా’ చేసుకున్నా.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ దక్కించుకుంది.
పోరాట యోధుడు..
285 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్నైట్ స్కోరు 28/1తో సోమవారం ఐదో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ చివరకు 8 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. వర్షం కారణంగా రెండు సెషన్లు తుడిచిపెట్టుకుపోయినా.. పట్టువదలని కివీస్ విజయతీరాలకు చేరింది. మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (121 నాటౌట్; 11 ఫోర్లు, ఒక సిక్సర్) అజేయ సెంచరీతో ఆపద్బాంధవుడిలా చివరి వరకు క్రీజులో నిలువగా.. డారిల్ మిషెల్ (81; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించాడు. ఏడు పరుగుల ఓవర్నైట్ స్కోరుతో సోమవారం బరిలోకి దిగిన విలియమ్సన్ గొప్ప సంయమనం పాటించాడు. వర్షం కారణంగా పిచ్ పేసర్లకు అనుకూలంగా మారినా.. ఏమాత్రం వెనక్కి తగ్గని విలియమ్సన్ ఆచితూచి ఆడుతూ.. వీలు చిక్కినప్పుడల్లా బౌండ్రీలు రాబట్టాడు. లాథమ్ (24), కాన్వే (5) హెన్రీ నికోల్స్ (20) ఎక్కువసేపు నిలువలేకపోయినా.. డారిల్ మిషెల్ సహకారంతో విలియమ్సన్ జట్టును విజయానికి చేరువ చేశాడు. ఇక కివీస్ విజయం తథ్యం అనుకుంటున్న తరుణంలో మిషెల్ ఔట్ కాగా.. బ్లండెల్ (3), బ్రాస్వెల్ (10), కెప్టెన్ టిమ్ సౌథీ (1) మ్యాట్ హెన్రీ (4) ఒకరి వెంట ఒకరు పెవిలియన్కు క్యూ కట్టారు. దీంతో కివీస్ విజయంపై నీలినీడలు కమ్ముకున్నా.. ఏమాత్రం వెరవని మాజీ కెప్టెన్ తనలోని పోరాట యోధుడిని నిద్రలేపాడు. చివరి ఓవర్ చివరి బంతికి లెగ్ బై రూపంలో సింగిల్ తీయడం ద్వారా ఈ మ్యాచ్లో లంక విజయతీరాలు చేరింది. లంక బౌలర్లలో అసిత 3, ప్రభాత్ జయసూర్య రెండు వికెట్లు పడగొట్టారు. డారిల్ మిషెల్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 355 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ 373 రన్స్ కొట్టింది. అనంతరం లంక రెండో ఇన్నింగ్స్లో 302 పరుగులు చేసింది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Telangana Cabinet | సొంత స్థలం ఉన్న వాళ్లకు రూ.3లక్షల సాయం.. కొత్త పథకం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Telangana Cabinet | రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే..
Influenza | కాన్పూర్లో విపరీతంగా పెరుగుతున్న ఇన్ ఫ్లూ ఎంజా కేసులు.. ఎమర్జెన్సీ వార్డులు ఫుల్!