Home Latest News IND vs AUS | రఫ్ఫాడించిన రోహిత్.. రెండో రోజు టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌కు భారీ...

IND vs AUS | రఫ్ఫాడించిన రోహిత్.. రెండో రోజు టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్‌కు భారీ ఆధిక్యం

IND vs AUS | టైమ్ 2 న్యూస్, నాగ్పూర్: రోహిత్ శర్మ (212 బంతుల్లో 120; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్తో విజృంభించడంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ మంచి స్థితిలో నిలిచింది. నాగ్పూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. దాదాపు రెండేళ్ల తర్వాత రోహిత్ టెస్టు సెంచరీ నమోదు చేసుకోగా.. ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా (170 బంతుల్లో 66 బ్యాటింగ్; 9 ఫోర్లు), అక్షర్ పటేల్ (102 బంతుల్లో 52 నాటౌట్; 8 ఫోర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. నైట్ వాచ్మన్గా క్రీజులో అడుగుపెట్టిన ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (23) కాసేపు సారథికి సహకరించగా.. చేతశ్వర్ పుజారా (7), విరాట్ కోహ్లీ (12) విఫలమయ్యారు. అరంగేట్ర ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్ (8), శ్రీకర్ భరత్ (8) ఎక్కువసేపు నిలువలేకపోయారు. రోహిత్ సేన స్వల్ప ఆధిక్యంతో సరిపెట్టుకోవడం ఖాయమే అనుకుంటున్న తరుణంలో జడేజా, అక్షర్ పోరాడారు. గాయం నుంచి కోలుకొని ఆరు నెలల తర్వాత బరిలోకి దిగిన జడ్డూ చూడచక్కటి బ్యాటింగ్తో అలరించాడు. బంతితో గింగిరాలు తిప్పి 5 వికెట్లు ఖాతాలో వేసుకున్న ఈ ఆల్రౌండర్ అచ్చమైన టెస్టు ఇన్నింగ్స్తో అర్ధశతకం పూర్తి చేసుకొని ‘బ్యాట్ సాము’ చేశాడు. ఇక మరో ఎండ్ నుంచి అక్షర్ కూడా ధాటిగా ఆడటంతో రోహిత్ సేనకు 144 పరుగులు ఆధిక్యం దక్కింది. ఆస్ట్రేలియా బౌలర్లలో టాడ్ మార్ఫే 5 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.

రోహిత్ ఎన్నాళ్లకెన్నాళ్లకు..

మూడు ఫార్మాట్లలో సారథ్య బాధ్యతలు చేపట్టిన అనంతరం.. రోహిత్ ఆటతీరులో మార్పు వచ్చిందని విమర్శిస్తున్న వారికి హిట్మ్యాన్ తన బ్యాట్తో సమాధానమిచ్చాడు. తొలి రోజు ఎదురుదాడి మంత్రంతో పరుగులు రాబట్టిన కెప్టెన్.. శుక్రవారం ఆచితూచి ఆడాడు. కంగారూ బౌలర్లు ఎంత పరీక్షించినా మొండిగా క్రీజులో పాతుకుపోయిన రోహిత్.. నెమ్మదిగా స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. మరో ఎండ్ నుంచి పెద్దగా సహకారం లభించకపోయినా ఒంటరిగా పోరాడాడు. చిన్న చిన్న భాగస్వామ్యాలు నమోదు చేస్తూ.. సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం రోహిత్ ఇచ్చిన సులువైన క్యాచ్ను స్లిప్లో స్టీవ్ స్మిత్ జారవిడవగా.. ఈ అవకాశాన్ని హిట్మ్యాన్ వినియోగించుకోలేకపోయాడు. కాసేపటికే కమిన్స్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ను నడిపించే బాధ్యత భుజానేసుకున్న జడేజా చివరి వరకు క్రీజులో నిలిచి జట్టుకు 144 పరుగుల ఆధిక్యాన్ని అందించాడు. అతడికి అక్షర్ పటేల్ చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ అభేద్యమైన ఎనిమిదో వికెట్కు 81 పరుగులు జోడించారు. భారత ఇన్నింగ్స్లో ఇదే అతి పెద్ద భాగస్వామ్యం కావడం గమనార్హం.

ఒకే ఒక్కడు..

మూడు ఫార్మాట్లలో సెంచరీలు బాదిన భారత తొలి సారథిగా రోహిత్ శర్మ రికార్డుల్లోకెక్కాడు. అంతర్జాతీయ క్రికెట్లో బాబర్ ఆజమ్ (పాకిస్థాన్), ఫాఫ్ డుప్లెసిస్ (దక్షిణాఫ్రికా), తిలకరత్నె దిల్షాన్ (శ్రీలంక) మాత్రమే ఈ ఫీట్ సాధించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Srikar Bharat | ఇది శ్రీకారం మాత్రమే.. అరంగేట్రంపై శ్రీకర్‌ భరత్‌ వ్యాఖ్య

IND vs AUS | తొలి రోజు మనదే.. రోహిత్‌ హాఫ్‌ సెంచరీ.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 177 ఆలౌట్ ‌

World Test Championship | డబ్ల్యూటీసీ ఫైనల్‌ తేదీ ఖరారు.. ఓవల్‌ వేదికగా జూన్‌ 7 నుంచి బిగ్‌ మ్యాచ్‌

Rohit Sharma | మాటల్లో కాదు చేతల్లో పోటీపడండి.. కంగరూలకు రోహిత్‌శర్మ చురక

Border Gavaskar Trophy | బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ.. ఆసీస్‌తో తొలి టెస్టులో అక్షర్‌ పటేల్‌కు షాకిచ్చిన రవిశాస్త్రి

Exit mobile version