Harmanpreet Kaur | మహిళల టీ20 వరల్డ్ కప్లో దూకుడుగా బరిలోకి దిగిన టీమిండియా.. సెమీస్లోనే వెనుదిరిగింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఉత్కంఠ పోరులో నువ్వా నేనా అన్నట్లుగా చివరి దాకా పోరాడింది. ఒకానొక దశలో గెలుపు మనదే అనుకుంటున్న తరుణంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఈజీగా రన్నౌట్ అవ్వడంతో మొత్తం మారిపోయింది. 173 పరుగుల లక్ష్యాన్ని చేధించలేక చతికిలబడింది. సెమీస్లోనే ఇంటిబాట పట్టింది. దీంతో హర్మన్ ప్రీత్ స్టేడియంలోనే కన్నీళ్లు పెట్టుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు అందర్నీ భావోద్వేగానికి గురిచేశాయి. అవి చూసిన క్రికెట్ అభిమానులు టీమిండియా మహిళా జట్టుకు బాసటగా నిలిచారు.
కష్టసమయంలో తమకు అండగా నిలబడ్డ క్రికెట్ అభిమానులకు టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా భావోద్వేగ సందేశాన్ని పంచుకుంది. ‘ఈ ప్రపంచకప్లో మాకు మద్దతుగా నిలిచిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా అభిమానులందరికీ కృతజ్ఞతలు. మా ప్రయాణంపై నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు. మీ జట్టు ఓటమిని చూడటం ఎంత బాధగా ఉంటుందో క్రికెట్ అభిమానిగా నాకు తెలుసు. ఇప్పుడు నేను చెప్పేది ఒక్కటే. మేం బలంగా తిరిగి వస్తాం. గొప్ప ప్రదర్శన చేస్తాం’ అని కౌర్ తన ట్విట్టర్లో పేర్కొంది. దీనిపై సానుకూలంగా స్పందించిన నెటిజన్లు ఆమెకు మద్దతు తెలిపారు. హర్మన్ ప్రీత్ ట్వీట్కు ఇటలీ ఫుట్బాల్ ప్లేయర్ అగతా ఇసాబెల్లా సెంటాస్సో కూడా రియాక్ట్ అయ్యింది. ‘మీరు చేయగలరని నేను కచ్చితంగా నమ్ముతున్నా. ఇటలీకి చెందిన నేను మీ కొత్త అభిమానిని’ అంటూ రాసుకొచ్చింది. ‘మీరు చాలా బాగా ఆడారు. ఏదేం జరిగినా ఎప్పటికీ టీమిండియా వెన్నంటే ఉంటాం’ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా.. ‘మీరు అద్భుతంగా ఆడారు. అందులో ఎటువంటి సందేహం లేదు’ అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.
Follow Us : Google News, Facebook, Twitter