IND vs AUS | టైమ్ 2 న్యూస్, అహ్మదాబాద్: భారత్, ఆస్ట్రేలియా మధ్య మైత్రికి 75 ఏళ్ల సంబురాల్లో భాగంగా.. అహ్మదాబాద్ టెస్టుకు ఇరుదేశాల ప్రధానులు నరేంద్ర మోదీ, ఆంటోని ఆల్బనీస్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్లు ఆడటం ప్రారంభించిన టీమిండియా.. ప్రస్తుతం రెండేండ్లకోసారి ‘బోర్డర్-గవాస్కర్’ పేరిట నాలుగు మ్యాచ్ల సిరీస్ ఆడుతోంది. ఒకసారి భారత్లో, మరోసారి ఆస్ట్రేలియాలో జరిగే ఈ సిరీస్కు విశ్వవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య క్రీడా మైత్రికి చిహ్నంగా ఇరు దేశాల ప్రధానులు నాలుగో టెస్టుకు హాజరయ్యారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా గుర్తింపు తెచ్చుకున్న అహ్మదాబాద్ మైదానంలో అభిమానుల హర్షధ్వానాల మధ్య ప్రధానమంత్రులు స్టేజ్పైకి వచ్చారు. ఈ సందర్భంగా ఇరు దేశాలల ప్రధానులను బీసీసీఐ ప్రత్యేకంగా సత్కరించింది. బోర్డు అధ్యక్షుడు రోజర్ బిన్నీ.. ఆస్ట్రేలియా ప్రధానికి మెమొంటో అందించగా.. ప్రధాని నరేంద్ర మోదీకి బీసీసీఐ కార్యదర్శి జై షా జ్ఞాపిక అందించారు. దీనికి సంబంధించిన వీడియోలను బీసీసీఐ ట్విట్టర్లో పోస్ట్ చేసింది.‘నరేంద్ర మోదీ స్టేడియం’గా నామకరణం చేసిన ఈ మైదానంలో భారత్కు ఇది నాలుగో టెస్టు కాగా.. గత మూడు మ్యాచ్లకూ అభిమానులు భారీగా తరలివచ్చిన విషయం తెలిసిందే.
ప్రత్యేక వాహనంలో చక్కర్లు..
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టేజ్పై ఇరువురు ప్రధానులను సత్కరించిన అనంతరం ఇరు దేశాల కెప్టెన్లకు వారివారి ప్రధానులు టెస్టు క్యాప్లు అందించారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ ప్రధానితో సరదాగా మాట్లాడుతూ కనిపించగా.. ఆ తర్వాత ఇద్దరు ప్రధానులు, ఇద్దరు కెప్టెన్లు కలిసి అభివాదం చేశారు. ఇక అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో నరేంద్ర మోదీ, ఆల్బనీస్ మైదానమంతా కలియతిరిగారు. ప్రేక్షకులకు చేతులు ఊపుతూ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ మ్యాచ్లో టాస్ వేసేందుకు కూడా ప్రత్యేక నాణాన్ని వినియోగించగా.. రోహిత్ శర్మ దాన్ని గాల్లోకి విసిరాడు. స్టీవ్ స్మిత్ ఎంపిక సరైంది కావడంతో అతడు మరో ఆలోచన లేకుండా మొదట బ్యాటింగ్ చేయనున్నట్లు ప్రకటించాడు. జాతీయ గీతాలాపన కోసం ఇరు దేశాల ఆటగాళ్లు మైదానంలో నిల్చున్న సమయంలో ప్రధానులు ఆటగాళ్లను పరిచయం చేసుకున్నారు. రోహిత్ శర్మ ముందు నడుస్తూ.. ఒక్కో ప్లేయర్ను ప్రధానికి పరిచయం చేశారు. జాతీయ గీతాలపన అనంతరం మ్యాచ్ ప్రారంభం కాగా.. ఇరు దేశాల ప్రధానులు కాసేపు ఆటను ఆసక్తిగా తిలకించారు. ప్రధానుల రాక నేపథ్యంలో స్టేడియాన్ని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. అడుగడుగునా ఎస్పీజీ భద్రతా సిబ్బంది కనిపించారు. ఇక ఇప్పటికే మూడు మ్యాచ్లు ముగిసిన ఈ సిరీస్లో టీమిండియా 2-1తో ముందంజలో ఉన్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్ టెస్టులో నెగ్గిన రోహిత్ సేన ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా నేరుగా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ ) ఫైనల్కు అర్హత సాధించనుంది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Influenza | కాన్పూర్లో విపరీతంగా పెరుగుతున్న ఇన్ ఫ్లూ ఎంజా కేసులు.. ఎమర్జెన్సీ వార్డులు ఫుల్!
Kushboo Sundar | ఆ విషయం చెప్పినందుకు నేనేమీ సిగ్గు పడటం లేదు.. ఖుష్బూ కీలక వ్యాఖ్యలు!
Viral News | విమానం గాల్లో ఉండగానే డోర్ తెరిచేందుకు యత్నం.. వద్దంటే ఏం చేశాడో తెలుసా?
Viral News | బైక్ మీద వెళ్తున్న వ్యక్తి నుంచి రూ. 40 లక్షలు చోరీ చేసిన దొంగలు!
H3N2 Influenza Virus | అసలు ఏంటీ హెచ్ 3 ఎన్ 2 ఇన్ ఫ్లూ ఎంజా.. లక్షణాలివేనా ?