Breaking News | ఆ పెద్దాయనకు ముగ్గురు కుమారులు. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. చిన్నోడికి కూడా పెళ్లి చేసి ఓ ఇంటివాడిని చేస్తే తన బాధ్యత తీరిపోతది. ఇక హాయిగా మనవళ్లు, మనవరాళ్లతో హాయిగా ఆడుకోవచ్చు అనుకున్నాడు. కానీ విధి ఆయనతోనే ఆడుకుంది. 24 గంటల్లో ఆ తండ్రి ఆశలను అడియాశలు చేసింది. జీవితంలో మరే తండ్రికి రానంత కష్టం.. ఎవరూ తట్టుకోలేనంత బాధ.. ఆ పెద్దాయనను చుట్టుముట్టేలా చేసేసింది. కళ్లముందే చెట్టంత కొడుకులు 35 ఏళ్లు కూడా నిండకముందే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడం.. అదీ ఒక్కరోజులో ఇద్దరికీ దహనసంస్కారాలు నిర్వహించాల్సి రావడంతో ఆ తండ్రి గుండె పగిలిపోయింది. ఆయన్ను చూస్తున్న వారి కళ్లు జలపాతాలయ్యాయి. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కావట్లేదు.
ఇంట్లో ఒక్కరు దూరమైతేనే ఆ బాధను భరించలేం. అలాంటిది.. 15 నెలల పసిగుడ్డును అనాథను చేసి, ఇద్దరు కోడళ్లను ఒంటరి వాళ్లను చేసి.. కని పెంచిన తల్లిదండ్రుల ముందే గంటల వ్వవధిలో ఇద్దరు కొడుకులు ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబం ఇప్పుడు ఒంటరైపోయింది. జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన భోగ నాగభూషణం దంపతులకు ముగ్గురు కొడుకులు. వారిలో రెండో కుమారుడు భోగ శ్రీనివాస్ (32) హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు.
దీంతో ఆదివారం ఉదయం మృతదేహాన్ని మెట్పల్లిలోని స్వగృహానికి తరలించారు. తండ్రి తల్లడిల్లిపోవడం చూసి తట్టుకోలేకపోయాడు శ్రీనివాస్ అన్న సచిన్ (35). గుండెలో బాధను దిగమింగుకుంటూ తమ్ముడి అంత్యక్రియల ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నాడు. ఇక భౌతిక కాయాన్ని శ్మశానానికి తరలిస్తుండగా ఇంటి గుమ్మం వద్దే గుండెపోటుతో సచిన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. క్షణాల్లో కుటుంబసభ్యులు, బంధువులు ప్రైవేటు ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. కానీ ఆదివారం కావడంతో ఒక్క డాక్టరు అందుబాటులో లేడు. చివరికి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఘోరం జరిగిపోయింది. వైద్యులు పరీక్షించి గుండెపోటుతో మృతి చెందినట్లు ప్రకటించారు. ఈ విషయం తెలియగానే కుటుంబసభ్యుల కాళ్ల కింద భూమి కదిలిపోయింది.
అప్పటివరకు పడుతున్న బాధ రెట్టింపయింది. అన్న సచిన్ భౌతికకాయాన్ని ఇంటికి తీసుకొచ్చేలోపే బంధువులు తమ్ముడు శ్రీనివాస్ అంత్యక్రియలు పూర్తి చేశారు. ఇప్పుడు అన్న అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. 24 గంటల వ్యవధిలో చెట్టంత కొడుకులు గుండెపోటుతో మృతి చెందడంతో ఆ తండ్రి తట్టుకోలేకపోతున్నాడు. పగోడికి కూడా అలాంటి కష్టం రావొద్దంటూ బంధువులు, స్థానికులు ఆ పెద్దాయనను చూసుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.
నాగభూషణం పెద్దకొడుకు సచిన్ కోరుట్లలోనే ఓ బ్యాంకులో పనిచేస్తున్నాడు. అతనికి ఇంకా పిల్లలు కాలేదు. రెండో కుమారుడు భోగ శ్రీనివాస్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. అతనికి 15 నెలల పాప ఉంది. ఇప్పుడీ ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబం ఒంటరైపోయింది. 15 నెలల పాప తండ్రికి దూరం కావడం, కోడళ్లు ఒంటరివాళ్లు కావడంతో పెద్దాయనను ఓదార్చడం ఎవరితరమూ కావట్లేదు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Weather Report | గజగజ వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు.. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ.. మరో 4 రోజులు ఇదే పరిస్థితి!
Breaking News | కూకట్ పల్లిలో కూలిన నిర్మాణంలో ఉన్న భవనం.. పలువురికి గాయాలు
Viral News | నాకు కేన్సర్ అని అమ్మానాన్నలకు చెప్పొద్దు ప్లీజ్.. డాక్టర్ను వేడుకున్న ఆరేళ్ల బాలుడు.. కన్నీరు పెట్టిస్తున్న వైద్యుడి ట్వీట్!