Weather Effect | ఉత్తర భారతదేశంలో చలి పంజా విసురుతోంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 1.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. చలికి పొగమంచు కూడా తోడు కావడంతో అడుగు తీసి అడుగుపెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఒక్క ఢిల్లీనే కాదు పంజాబ్, హరియాణా, రాజస్థాన్, బిహార్లోనూ అదే పరిస్థితి ఏర్పడింది.
దీంతో అప్రమత్తమైన వాతావరణ శాఖ.. పంజాబ్, హరియాణాలో రెడ్ అలర్ట్.. రాజస్థాన్, బిహార్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఢిల్లీలో ప్రయాణీకులను పొగమంచు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. రోడ్ల మీద నాలుగైదు అడుగుల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి ఉంది. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఈనెల 15 వరకు సెలవులు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మరోవైపు ఉత్తర భారతంలో వీస్తున్న చలిగాలుల ప్రభావంతో తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తూర్పు, ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్రలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రంగారెడ్డి, హైదరాబాద్ సహా 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More: