Rishabh Pant | టైమ్ 2 న్యూస్, న్యూఢిల్లీ: భారత స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ కోలుకుంటున్నాడు. గతేడాది ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన పంత్.. ప్రస్తుతం ఊత కర్ర సాయంతో నడుస్తున్నాడు. దీనికి సంబంధించిన పలు వీడియోలను ఇప్పటికే అభిమానులతో పంచుకున్న రిషబ్.. తాజాగా స్విమ్మింగ్ పూల్లో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. చిన్న చిన్న విషయాలకే సంబరపడి పోతున్నా అని గతంలో పేర్కొన్న పంత్.. తాజాగా చిన్నా, పెద్ద అన్ని విషయాలను పరిశీలిస్తున్నా అనే అర్థం వచ్చే విధంగా కామెంట్ పెట్టాడు. నడుములోతు కన్నా ఎక్కువ నీళ్లు ఉన్న స్విమ్మింగ్పూల్లో చేతి కర్ర సాయంతో పంత్ నడక ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ వీడియో వైరల్గా మారగా.. దీనిపై అభిమానులతో పాటు పలువురు క్రికెటర్లు కూడా కామెంట్ చేస్తున్నారు.
గతేడాది డిసెంబర్లో పంత్ ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. నూతన సంవత్సర వేడుకలను కుటుంబంతో కలిసి జరుపుకునేందుకు ఢిల్లీ నుంచి ఉత్తరఖండ్కు కారులో బయల్దేరిన పంత్ మార్గమధ్యలో ప్రమాదానికి గురయ్యాడు. హైవేపై డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడ్డ కారులో నుంచి పంత్ను కొందరు యువకులు రక్షించి ఆసుపత్రికి తరలించగా.. అనంతరం కారు పూర్తిగా దగ్ధమైంది. అనంతరం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి సైతం కలుగజేసుకొని పంత్కు మెరుగైన చికిత్స లభించే విధంగా ఏర్పాటు చేయగా.. బీసీసీఐ అతడిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా ముంబైకి తరలించి ప్రత్యేక చికిత్స చేయించింది. ఇందులో భాగంగా ప్లాస్టిక్ సర్జరీతో పాటు పంత్ కాలికి కూడా శస్త్రచికిత్స జరిగింది. ఇక అప్పటి నుంచి మంచానికే పరిమితమైన పంత్.. చిన్న చిన్నగా నడక ప్రారంభించాడు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి ఉత్తరాఖండ్లో కోలుకుంటున్న పంత్.. తన ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్లను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నాడు. తాజాగా పంత్ స్విమ్మింగ్పూల్లో వాకింగ్ స్టిక్ సాయంతో నడుస్తున్న వీడియో షేర్ చేయగా.. దాన్ని బీసీసీఐ రీట్వీట్ చేసింది. ‘నీకు మరింత బలం కలగాలి చాంప్’ అని కామెంట్ చేసింది.
మూడు ఫార్మాట్లలో టీమిండియా కీలక ప్లేయర్ అయిన రిషబ్ పంత్ అందుబాటులో లేకపోవడంతో ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ సిరీస్లో వికెట్కీపర్గా తెలుగు ఆటగాడు కోన శ్రీకర్ భరత్ను ఎంపిక చేశారు. నాలుగు మ్యాచ్లాడిన భరత్.. అడపా దడపా భారీ షాట్లు కొట్టడం మినహా నిలకడగా పరుగులు రాబట్టలేకపోయాడు. దీంతో పంత్లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఆసీస్తో సిరీస్ స్వదేశంలో జరగడంతో మిడిలార్డర్లో విధ్వంసక బ్యాటర్ లేకపోయినా.. ఇబ్బంది పడలేదు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్.. బ్యాట్తో కూడా రాణించడంతో ఆ లోటు కనిపించలేదు. కానీ.. జూన్ 7 నుంచి జరుగనున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్లూ్యటీసీ) ఫైనల్లో మాత్రం పంత్ లేని లోటు తీర్చడం కష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై సునీల్ గవాస్కర్ సహా పలువురు మాజీలు వ్యాఖ్యలు చేశారు. టెస్టు ఫార్మాట్లో విదేశీ పిచ్లపై బెదురు లేకుండా బ్యాటింగ్ చేసే పంత్ లేకపోవడం డబ్లూ్యటీసీ ఫైనల్లో భారత్ను ఇబ్బంది పెట్టనుంది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
ICC Rankings | ఐసీసీ ర్యాంకింగ్స్ అగ్రస్థానంలో అశ్విన్.. ఏడు స్థానాలు ఎగబాకిన విరాట్ కోహ్లీ
Mohammed Siraj | గదిలో ఒంటరిగా కూర్చొని ఏడ్చేవాడిని: సిరాజ్