PM Kisan | రైతులకు గుడ్ న్యూస్. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద డబ్బులు త్వరలోనే విడుదల కానున్నాయి. ఈ నెల 23 ఈ డబ్బులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 12 వాయిదాల్లో రైతులకు ఆర్థిక సాయం అందజేశారు. ఇప్పుడు 13వ విడత డబ్బుల కోసం దేశవ్యాప్తంగా రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని జనవరి 23న రైతుల ఖాతాల్లో రూ.2వేలు జమ చేస్తారని తెలుస్తోంది.
రైతులను ఆర్థికంగా బలోపేతం చేసే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు తీసుకొచ్చినట్టే.. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని తీసుకొచ్చింది. 2019లో ప్రారంభించిన ఈ పథకంలో భాగంగా రైతులకు ఏటా రూ.6వేలు ఆర్థిక సాయం అందిస్తున్నారు. మూడు వాయిదాల్లో రూ.2వేల చొప్పున ఈ డబ్బును అందజేస్తున్నారు. ఇప్పటివరకు 12 వాయిదాల్లో రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించింది. అయితే 12వ విడతలో పలువురు రైతులకు ఆర్థిక సాయం అందలేదు. కేవైసీ పూర్తి చేయకపోవడం వల్లనే వారికి డబ్బులు అందలేదు. వారిలో ఇప్పటికీ కొందరు కేవైసీ పూర్తి చేయలేదు. వారికి ఈసారి కూడా డబ్బులు నిలిచిపోనున్నాయి. ఇప్పటికే అనర్హుల జాబితాను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. దీనిపై మరింత సమాచారం కోసం స్థానిక వ్యవసాయ శాఖ అధికారిని కలవాలని లేదా అగ్రికల్చర్ పోర్టల్ ద్వారా సమాచారం పొందాలని సూచిస్తున్నారు.
6వేల నుంచి 8 వేలకు పెంపు
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అందిస్తున్న ఆర్థిక సాయాన్ని రూ.6వేల నుంచి 8 వేలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ డబ్బును నాలుగు సమాన వాయిదాల్లో రైతులకు అందజేయాలని భావిస్తోంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక సహాయం పెంపుపై ఈసారి బడ్జెట్లో పేర్కొంటారని సమాచారం.
హెల్ప్ లైన్ నంబర్స్
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద డబ్బులు పొందడంలో ఇబ్బందులను ఎదుర్కొంటే సహాయం కోసం కేంద్ర ప్రభుత్వం హెల్ప్ లైన్ నంబర్లను అందుబాటులో ఉంచింది. 155261 లేదా 1800 11 5526 ( ట్రోల్ ఫ్రీ నంబర్ ) లేదా 011- 23381092 నంబర్లలో సంప్రదించి సహాయం పొందవచ్చు. pmkisan-ict@gov.in మెయిల్ ఐడీకి కూడా ఫిర్యాదు చేయవచ్చు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Pallavi Joshi | కశ్మీర్ ఫైల్స్ నటికి యాక్సిడెంట్.. గాయాలతోనే షూటింగ్లో పాల్గొన్న పల్లవి జోషి
vijay antony | మలేసియాలో షూటింగ్ స్పాట్లో తీవ్రంగా గాయపడ్డ బిచ్చగాడు హీరో
Hyderabad tragedy | పండుగపూట హైదరాబాద్లో విషాదం.. భార్యాపిల్లలను, తల్లిని చంపి వ్యక్తి బలవన్మరణం