Dammaiguda | మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో అనుమానాస్పద స్థితిలో చెరువులో పడి బాలిక మృతిచెందిన కేసులో మిస్టరీ వీడింది. చెరువులో ప్రమాదవశాత్తూ పడటం వల్లే బాలిక మృతిచెందినట్టు పోలీసులు నిర్ధారించారు. బాలిక మృతిపై అనుమానాలు ఏవీ లేవని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైందని పోలీసులు పేర్కొన్నారు. చెరువులో పడటం వల్ల ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం వల్లనే బాలిక మరణించిందని శవ పరీక్షలో తెలిసిందన్నారు.
అసలేం జరిగింది?
జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్కు చెందిన జీడల నరేశ్ చిన్న కుమార్తె ఇందు (10).. స్థానిక దమ్మాయిగూడ ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. ఈ నెల 15న ఉదయం ఇందూని నరేశ్ ద్విచక్రవాహనంపై పాఠశాలకు బయలుదేరాడు.కానీ నరేశ్కు వేరే పని పడటంతో కుమార్తెను మధ్యలోనే దించి వెళ్లిపోయాడు. స్కూల్కు వెళ్లిన బాలిక.. కాసేపటికి బుక్ మరిచిపోయా తెచ్చుకుంటానని బయటకు వెళ్లిపోయింది. ఆ తర్వాత బాలిక కనిపించకుండా పోయింది. హాజరు తీసుకుంటున్న సమయంలో ఇందూ లేకపోవడం గుర్తించిన ఉపాధ్యాయుడు.. పేరెంట్స్కు సమాచారం అందించారు. కంగారు పడిన తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన పోలీసులు రాత్రి 7:30 గంటల సమయంలో డాగ్ స్క్వాడ్తో గాలింపు చేపట్టారు. అప్పుడు పోలీసు జాగిలాలు దమ్మాయిగూడ చెరువు వరకు వెళ్లి ఆగాయి. పోలీసులు సీసీ టీవీ కెమెరాలు పరిశీలించగా. బాలిక ఉదయం 9:23 గంటల సమయంలో పాఠశాల నుంచి ఒంటరిగా వెళ్తున్నట్టు గుర్తించారు. మరిన్ని ఫుటేజిల్లో దమ్మాయిగూడ చెరువు మార్గంలో బాలిక పరిగెత్తుకుంటూ వెళ్తున్నట్టు గమనించారు. వీటి ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు దమ్మాయిగూడ చెరువులో శుక్రవారం ఉదయం బాలిక మృతదేహాన్ని గుర్తించారు. అయితే బాలిక మృతిపై పలు అనుమానాలు మొదలయ్యాయి.బాలికను ఎవరైనా చెరువు దగ్గరకు తీసుకెళ్లి ఉంటారని సందేహించారు. అయితే తాజాగా పోస్టుమార్టం నివేదికతో మిస్టరీ వీడింది. మూత్ర విసర్జన కోసం బాలిక చెరువు దగ్గరికి వెళ్లిందని.. ఈక్రమంలోనే కాలు జారి చెరువులో పడిపోయిందని పోలీసులు తెలిపారు. చెరువులో పడటం వల్ల ఊపిరితిత్తుల్లోకి నీరు చేరి బాలిక మృతిచెందినట్టు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైందని పేర్కొన్నారు.
Read More Articles |
Rythu bandhu | తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతుబంధు పడేది అప్పట్నుంచే !!