BRS in Andhra Pradesh | బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్పై ఫోకస్ పెట్టారా? సామాజిక సమీకరణాల ప్రభావం ఎక్కువగా ఉండే ఏపీ రాజకీయాల్లో.. అదే ఫార్ములాను అమలు చేయబోతున్నారా ? కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ను బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమించడం చూస్తుంటే కేసీఆర్ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్నాడని అనిపిస్తోంది.
మొన్నటివరకు ఆంధ్రప్రదేశ్పై ఫోకస్ పెట్టని కేసీఆర్ సడెన్గా దూకుడు ఎందుకు పెంచారు ? చంద్రబాబు నాయుడు ఇటీవలే ఖమ్మంలో సభ పెట్టి తెలంగాణలో టీడీపీకి పునర్వైభవాన్ని తీసుకొస్తానని ప్రకటించాడు. తెలంగాణ వ్యాప్తంగా సభలు పెట్టి కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతానని చెప్పుకొచ్చాడు. ఈ ముచ్చట్లే కేసీఆర్కు మంట పుట్టించినట్లు అనిపిస్తోంది. అందుకే కేసీఆర్ టార్గెట్ ఏపీపైకి మళ్లించాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు మొదటి టార్గెట్ బీజేపీకి దగ్గరవడం. అది ఏపీ, తెలంగాణలో రెండింటిలోనూ పనికొస్తుందన్న ఆశ. రెండోది పవన్ కళ్యాణ్తో పొత్తు. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ బీజేపీతో కలిసి వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు. ఇదే అదనుగా చంద్రబాబుతో కలిసి తెలంగాణలో జనసేన రంగంలోకి దిగే ప్రయత్నాలు చేస్తున్నాయని కేసీఆర్కు అర్థమైనట్లుంది. వెంటనే ఏపీపై దృష్టి మరల్చాడు.
వాస్తవంగా కేసీఆర్ తక్షణ లక్ష్యం ఆంధ్రప్రదేశ్ కానేకాదు. తెలంగాణలో అధికారంలోకి రావడంతో పాటు కర్ణాటకలో బీజేపీని దెబ్బకొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అయితే చంద్రబాబు ఇటీవల తెలంగాణలో జనసేనతో కలిసి బీజేపీకి అనుకూలంగా అడుగుపెట్టడంతో ప్లాన్ మార్చేశాడు కేసీఆర్. ముఖ్యంగా జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తే ఏపీలో ఎక్కువగా లాభపడేది ఉభయగోదావరి జిల్లాల్లోనే. గుంటూరు, కృష్ణాతో పాటు ఉత్తరాంధ్రలోనూ కాపు సామాజిక వర్గం ఓట్లు దండిగానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ జనసేనతో పొత్తుతో కాపు ఓట్లు ఆ ప్రాంతాల్లో గంపగుత్తగా తనకే పడతాయన్న భావనలో చంద్రబాబు ఉన్నాడు. దాన్ని పసిగట్టిన కేసీఆర్.. టీడీపీ, జనసేనకు ఊహించని షాకిచ్చాడు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా.. జనసేనలో కీలకంగా వ్యవహరిస్తున్న కాపు సామాజిక వర్గం నేత తోట చంద్రశేఖర్తో పాటు మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థసారథి, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబును బీఆర్ఎస్లో చేర్చుకున్నాడు. చంద్రశేఖర్ ముందు నుంచి మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్కు మద్దతుగానే ఉన్నారు. ప్రజారాజ్యం, జనసేనకు అండగా ఉన్నారు. కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆర్థికంగా బలంగా ఉన్న చంద్రశేఖర్ను బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిని చేశారు. దీంతో అటు పవన్ కళ్యాణ్కు పెద్ద దెబ్బే తగిలినట్టైంది. చంద్రబాబు ఆశలు కూడా ఒకవిధంగా గల్లంతైనట్లే. కలిసి వస్తారనుకున్న కాపులు చంద్రశేఖర్ వల్ల కచ్చితంగా చీలిపోవడం ఖాయంగానే భావన చంద్రబాబులో కనిపిస్తది. సో కేసీఆర్ గురి చూసి మరీ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను దెబ్బకొట్టాడని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.
అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి కేసీఆర్ కారణమని ప్రతి ఒక్కరి మదిలో ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రా ప్రాంతం వారిని నోటికొచ్చినట్లు తిట్టాడు. అందుకే కేసీఆర్పై ఒకింత కోపంగానే ఉన్నారు ఏపీ ప్రజలు. ఇప్పుడా కోపాన్ని కేసీఆర్ తొలగించుకోవాలి. ఇందుకోసం ఏపీ ప్రజలను ప్రసన్నం చేసుకోవడంపై దృష్టి పెట్టాల్సిందే. అలా జరగాలంటే ఏపీ రాజధాని వ్యవహారంపై ముందుగా స్పష్టతనివ్వాల్సిందే. పోలవరం గురించి మాట్లాడాల్సిందే. విభజన హామీల్లో పేర్కొన్న ప్రత్యేక హోదా గురించి పోరాడాల్సిందే. విభజన వల్ల ఏపీకి జరిగిన నష్టాన్ని ఎలా భర్తీ చేస్తాడన్న దానిపై కూడా కేసీఆర్ క్లారిటీ ఇవ్వాల్సిందే. వీటన్నింటికీ సమాధానం కేసీఆర్ చెప్పి ప్రజలను ఒప్పింగచగలిగితే కేసీఆర్ గురించి ఆలోచించగలుగుతారు. అందుకుముందుగా ఏపీలో రాజకీయాలు, రాజకీయ నాయకులపై కూడా ఏపీ వాసులు ఆగ్రహంగానే ఉన్నారు. వారికి ఇప్పుడు వేరే ఆప్షన్ కూడా లేదు. దీన్ని బేస్ చేసుకుని కేసీఆర్ స్పష్టమైన హామీలు ఇవ్వగలిగి ఏపీ ప్రజలను శాంతింప చేస్తే కొంత మేరకు ఫలితం ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Read More Articles:
Kajal Aggarwal | అమ్మో.. రీఎంట్రీలో కూడా కాజల్ అగర్వాల్ అంత డిమాండ్ చేస్తుందా?
Aadi Saikumar | వరుస ఫ్లాప్స్ వచ్చినా కూడా ఆదికి వరుస ఆఫర్లు ఎలా వస్తున్నాయి?