KCR | ఎమ్మెల్యేలు, సర్పంచ్లపై బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ సెటైర్లు వేశారు. ఎమ్మెల్యేలుగా గెలవగానే కొమ్ములు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఏపీకి చెందిన మాజీ మంత్రి రావెల, మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్, మాజీ ఐఆర్ఎస్ చింతల పార్థసారథితో పాటు పలువురు కేసీఆర్ సమక్షంలో సోమవారం బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్.. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకుల్లో భయంకరమైన లోపం ఉందంటూ అందరినీ నవ్వించే ప్రయత్నం చేశారు.
అందరికీ అన్ని రంగాల్లో జ్ఞానం ఉండదని, వివిధ రంగాల్లో పని చేసిన నిష్ణాతులు, గొప్ప విజ్ఞానం సంపాదించిన వారి దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చని ఎమ్మెల్యేలకు కేసీఆర్ సూచించారు. నిపుణులు, వివిధ రంగాల్లో ఉన్న నిష్ణాతులను ఇప్పుడున్న రాజకీయ నాయకులు పిలిచి మాట్లాడే పరిస్థితి లేదని, వారిని గౌరవించే పద్ధతి అసలే లేదంటూ సెటైర్లు వేశారు. కనీసం వారి సలహాలు స్వీకరించలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. జ్ఞానం ఎక్కడ దొరికితే అక్కడ సముపార్జించుకోవాలని సూచించారు. మనకు తెలియనిదాన్ని తెలియదు అని నిర్భయంగా ఒప్పుకోవాలన్నారు. జ్ఞానాన్ని సంపాదించే ప్రయత్నం చేయగలిగితేనే ప్రజలకు మంచి పనులు చేస్తామని అన్నారు.
అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని.. ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో భయంకరమైన ఈ లోపం ఉందంటూ ఎద్దేవా చేశారు. ” ఎమ్మెల్యే కాగానే కొమ్ములు వచ్చేస్తున్నాయి. కడుపులో గ్యాస్ వచ్చేస్తుంది. భాష, వేషం మారిపోతుంది. కళ్లకు రెండు నల్ల కళ్లద్దాలు వచ్చేస్తున్నాయి. మన గ్రామంలో మన మధ్య ఉండే ఒకాయన సర్పంచ్ అయిపోతే.. అక్కర్లేని దీర్ఘాలు వచ్చేస్తున్నాయి. అసహజతను సంతరించుకుని, ఏమో అయిపోయానని నేల విడిచి సాము చేసే నాయకత్వమే ఇప్పుడు కనిపిస్తుంది” అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు.
Read More Articles:
Telangana Congress | టీ కాంగ్రెస్ ఇంఛార్జి బాధ్యతల నుంచి తప్పుకున్న మాణిక్కం ఠాగూర్.. త్వరలో కొత్త ఇంఛార్జి
Metro Station | ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పైనుంచి దూకిన వృద్ధురాలు.. స్పాట్లోనే మృతి
Telangana IPS | తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీలు.. సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్రకు అదనపు బాధ్యతలు
Bandi Sanjay | యువతను బీజేపీకి దూరం చేసేందుకే నోటిఫికేషన్లు: బండి సంజయ్