Covid situation in china | చైనాలో నానాటికి పరిస్థితులు చేయి దాటిపోతున్నాయా? కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయా? మరణాలు కూడా భారీగానే ఉన్నాయా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. అయితే చైనా మాత్రం నిజాన్ని దాచి పెట్టే ప్రయత్నం చేస్తోందని అభిప్రాయపడుతున్నారు. చైనా సర్కార్ జీరో కొవిడ్ పాలసీని సడలించడం కూడా భారీ సంఖ్యలో కరోనా కేసులు పెరగడానికి ఒక కారణమంటున్నారు.
పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో మూడు నెలల్లోనే చైనాలోని 60 శాతం జనాభాకు కొవిడ్ సోకే ప్రమాదముందని అంటువ్యాధుల నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటికే కరోనా కారణంగా చైనాలో లక్షల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయని అంతర్జాతీయ మీడియా గగ్గోలు పెడుతోంది. అయినా చైనా మాత్రం అలాంటిదేంలేదని చెబుతోంది. ప్రధాన పట్టణాల్లో శ్మశాన వాటికలు మృతదేహాలతో నిండిపోతున్నాయని వార్తలు వస్తున్నా చైనా మాత్రం తేలిగ్గా కొట్టి పారేస్తోంది. ఇటీవలి కాలంలో కరోనాతో ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోలేదని చెబుతోంది.
నిండిపోతున్న శ్మశాన వాటికలు..
ఇటీవల కరోనా మరణాలను నమోదు చేసే ప్రక్రియలో చైనా మార్పులు చేసింది. వైరస్ కారణంగా మరణించే జాబితాను తయారుచేసేందుకు ఉపయోగించే ప్రమాణాలను మార్చేసింది. కేవలం వైరస్ వల్ల శ్వాసకోశ ఇబ్బందులతో మరణిస్తేనే కొవిడ్ మరణాలుగా పరిగణిస్తోంది. దీనివల్లే మరణాల సంఖ్య అధికారిక లెక్కల్లోకి రావటం లేదు. కానీ వాస్తవ పరిస్ఙితి వేరుగా ఉంది. బీజింగ్ లాంటి నగరాల్లో సైతం శ్మశాన వాటికలు కొవిడ్ మృతులతో నిండిపోతున్నాయని అంతర్జాతీయ మీడియా వాల్స్ట్రీట్ జర్నల్ తెలిపింది. మరోవైపు ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లోనూ చైనా వ్యవహరిస్తున్న తీరుపై అంతర్జాతీయ నిపుణులు మండిపడుతున్నారు.
ముగింపు దశకు వచ్చేసిందా?
ప్రపంచ ఆరోగ్య సంస్థలోని కొవిడ్ అత్యవసర కమిటీలో సలహాదారుడిగా ఉన్న డచ్ వైరాలజిస్ట్ మేరియన్ కూప్మన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. జీరో కొవిడ్ విధానానికి స్వస్తి పలికిన చైనా.. కరోనా వ్యాప్తిని అడ్డుకోలేకపోతోందని వ్యాఖ్యానించారు. ఫలితంగా ఆస్పత్రులు కరోనా రోగులతో నిండిపోతున్నాయని అన్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి కీలక దశలో ఉందని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా విరుచుకుపడిన కరోనా.. చైనాలో మాత్రం ఇన్నాళ్లు పెండింగ్లో ఉందన్నారు. ఇప్పుడు ఈ మహమ్మారి విజృంభణ చూస్తుంటే తన దృష్టిలో వైరస్ వైల్డ్ కార్డులా కనిపిస్తుందన్నారు. మరోవైపు కరోనా మరికొద్ది రోజుల్లో ముగింపు దశకు చేరుకుంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథోనోమ్ అభిప్రాయపడ్డారు. 2023లో కరోనా కథ ముగిసిపోవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆందోళన వ్యక్తం చేస్తున్న WHO
చైనాలో పెరుగుతున్న కరోనా కేసుల మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కరోనా కేసుల వివరాలను పంచుకోవాలని, తాము సూచించే అధ్యయనాలు చేపట్టాలని చైనాను కోరుతోంది. ఇదే విషయాన్ని గతంలో కూడా చెప్పామని చైనాకు సూచించింది.
Read More Articles |
Omicron BF.7 Symptoms | చైనాను వణికిస్తున్న ఒమిక్రాన్ కొత్త వేరియంట్ BF.7 లక్షణాలివే..
కరోనా లాక్డౌన్ తెచ్చిన భయం.. మూడేళ్లుగా గదిలో నుంచి బయటకు రాని తల్లీకూతుళ్లు