AP CM Jagan | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా బుధవారం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బాపట్లలోని యడ్లపల్లిలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్.. తలరాతలు మారాలంటే చదువు ఒక్కటే మార్గమన్నారు. ఆర్థిక స్థోమత వల్ల పిల్లలను చదివించుకోలేని తల్లిదండ్రుల బాధను చూశానన్న సీఎం.. అందుకే పిల్లల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దేలా ఏపీ సర్కార్ అడుగులు వేస్తుందన్నారు. ట్యాబ్ల పంపిణీ నా పుట్టిన రోజు గురించే కాదని, పుట్టిన బిడ్డల గురించి అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ప్రతిపక్షాలపై ఇండైరెక్ట్గా విమర్శలు గుప్పించారు. పెత్తందారులు తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తూ.. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తుంటే కోర్టులకు వెళతారు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టామని జగన్ చెప్పారు. సమాజంలో ఉన్న అంతరాలు తొలగిపోవాలన్నదే తన లక్ష్యమన్నారు. పేద విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ విద్య అందకూడదనే పెత్తందారీ భావజాలం చూసి బాధేసిందన్న ఆయన.. విద్యార్థులకు అందించే చదువులో సమానత్వం ఉండాలన్నారు. మంచి విద్యతోనే పిల్లల తలరాతలు మారుతాయని, భావితరాల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలన్నదే తన లక్ష్యమంటూ పేర్కొన్నారు. చదువులో సమానత్వం ఉన్నప్పుడే ప్రతి కుటుంబం అభివృద్ధి సాధిస్తుందని అన్నారు.
ప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్లలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ సహా 8 భాషల్లో పాఠ్యాంశాలు ఉంటాయని జగన్ చెప్పారు. పిల్లలకు మరింత సులువుగా పాఠాలు అర్థమయ్యేలా ట్యాబ్లు అందిస్తున్నామన్న సీఎం.. పిల్లలు చదివి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. పిల్లలకు నష్టం జరిగే కంటెంట్ను తొలగించినట్లు ఈ సందర్బంగా జగన్ తెలిపారు.
Read More Articles |
కరోనా లాక్డౌన్ తెచ్చిన భయం.. మూడేళ్లుగా గదిలో నుంచి బయటకు రాని తల్లీకూతుళ్లు