ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాలంటే భయం.. ఇంట్లోకి బయటవాళ్లు ఎవరైనా వస్తున్నారంటే భయం.. జనం అంటే భయం.. వాళ్లేమైనా చేస్తారేమోనని భయం.. చావుకంటే ప్రమాదరకమైన ఈ భయంతోనే మూడేళ్లుగా తల్లీకూతుళ్లు ఇద్దరూ ఒకటే గదికి పరిమితమయ్యారు. ఆ రూంలో నుంచి బయటకు రాకుండా దుప్పటి కప్పుకుని భయం భయంగా కాలం వెల్లదీస్తున్నారు. మీకేం కాదూ బయటకు రండి అంటూ ఇంటి చుట్టుపక్కల వాళ్లు పిలిచినా వినిపించుకోవడం లేదు. ఏపీలోని కాకినాడ జిల్లా కుయ్యేరులోని తల్లీకూతుళ్లదీ పరిస్థితి.
వివరాల్లోకి వెళ్తే.. కుయ్యేరుకు చెందిన కర్నిడి సూరిబాబు ఇంటింటికీ తిరిగి కూరగాయలు అమ్ముతుంటాడు. అతనికి భార్య మణి, కూతురు దుర్గాభవాని ఉన్నారు. ఆనందంగా సాగిపోతున్న వీరి జీవితంలో కరోనా మహమ్మారి కలకలం రేపింది. లాక్డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన మణి, దుర్గా భవానీ మానసికంగా డిస్ట్రబ్ అయ్యారు. అప్పట్నుంచి ఒక గదిలో తలుపులు పెట్టుకుని అందులోనే ఉండిపోయారు. సూరి బాబు ఎంత చెప్పినా వాళ్లు బయటకు రాలేదు. టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నవ్.. ఈరోజుల్లో బాణామతి, చేతబడి వంటివి ఏమీ లేవు.. నిజంగా అవన్నీ ఉంటే జనాలు ఎవరూ బతకరు అంటూ ఎంతో నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ వాళ్లు మాత్రం గదిలో నుంచి బయటకు వచ్చేవాళ్లు కాదు. వీళ్ల విషయం తెలిసి బంధువులు, చుట్టుపక్కల ఇళ్ల వాళ్లు వచ్చి ధైర్యం చెప్పేందుకు ప్రయత్నించారు. అయినా వారు వినిపించుకోలేదు. మాకు చేతబడి చేసేందుకు వచ్చారా? అంటూ వచ్చిన వాళ్లను బూతులు తిట్టిపోసేవారు. దీంతో కొద్దిరోజులకు ఆ కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశారు.
భార్య, కూతురి పరిస్థితిని చూసి సూరిబాబు ఎంతగానో కుమిలిపోయేవాడు. రోజూ పొద్దున్నే కూరగాయలు అమ్మేందుకు వెళ్లి.. వచ్చేటప్పుడు వారికి కావాల్సిన ఆహారం, ఇతరత్రా వస్తువులను తీసుకొచ్చి ఇస్తుండేవాడు. కొద్దిరోజులుగా భార్య మణి ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తీసుకెళ్దామని భావించాడు. కానీ ఆమె ఆ గదిలో నుంచి బయటకు రావడానికి భయపడిపోయేది. దీంతో ఎలాగైనా తన భార్యకు వైద్యం అందించాలని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తన మొర విన్నవించుకున్నాడు. సూరిబాబు పరిస్థితి తెలుసుకుని జాలిపడ్డ వైద్య సిబ్బంది.. ఇంటికొచ్చ వైద్యం చేసేందుకు ట్రై చేశారు. అయినా తలుపులు తీయకపోవడంతో సర్పంచ్, స్థానికుల సాయంతో తలుపులు బద్దలకొట్టి వైద్యం అందించేందుకు ప్రయత్నించారు. కానీ గదిలోపలికి వచ్చిన వారిపై ఆ తల్లీకూతుళ్లు దాడి చేశారు. ఇక లాభం లేదని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస గోపాలకృష్ణకు సర్పంచ్ సమాచారం అందించాడు. మంత్రి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు తల్లీకూతుళ్లను 108 వాహనంలో కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Read More Articles |
China | చైనాలో కరోనా తెచ్చిన కష్టం.. నిమ్మకాయల కోసం ఎగబడుతున్న జనాలు.. కారణమిదే