Venu Madhav | కమెడియన్లు అంటే బ్రహ్మానందం, అలీ పేరు మాత్రమే చెప్పుకునే రోజుల్లో తెలుగు ఇండస్ట్రీకి అడుగుపెట్టి వాళ్ల తర్వాత స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు వేణుమాధవ్. స్క్రీన్ మీద ఈయన కనబడితే చాలు నవ్వులు పూసేవి. ఒకప్పుడు ఏ సినిమా చూసినా వేణుమాధవ్ ఉండాల్సిందే అన్నట్టుగా క్రేజ్ తెచ్చుకున్నాడు. కానీ అర్ధాంతరంగా అనారోగ్యం బారిన పడి మరణించాడు. చనిపోయేప్పటికీ బక్కగా.. గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. అయితే వేణు మాధవ్ అనారోగ్యంతో మరణించడానికి గల కారణాన్ని వాళ్ల అమ్మ సావిత్రమ్మ బయటపెట్టింది. ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలను వెల్లడించింది.
వేణు మాధవ్ తన ఆరోగ్యాన్ని చేతులారా పాడుచేసుకున్నాడని సావిత్రమ్మ తెలిపింది. ఏ జబ్బు చేసినా సరే వేణు మందులు వేసుకునేవాడు కాదని చెప్పింది. తలనొప్పి వచ్చినా కూడా ట్యాబ్లెట్ వేసుకునే అలవాటు లేదని.. అదే కొంపముంచిందని ఆవేదన వ్యక్తం చేసింది. పచ్చ కామెర్లు, డెంగీ జ్వరం వస్తే కూడా ఇలాగే మందులు వాడకుండా వేణుమాధవ్ నిర్లక్ష్యం చేశాడని తెలిపింది. దానివల్లే పరిస్థితి విషమించి చనిపోయాడని కన్నీళ్లు పెట్టుకుంది. చిన్న కొడుకు వేణుమాధవ్ మరణించడానికి నెల రోజుల ముందే పెద్ద కొడుకు కూడా మరణించాడని తెలిపింది. స్వల్ప వ్యవధిలోనే ఇద్దరు కొడుకుల మరణాలు చూసి చాలా కుంగిపోయానని చెప్పుకుంటూ బాధపడింది.
సినిమాల్లో అలా అవకాశం వచ్చింది
యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణుమాధవ్ గురించి సావిత్రమ్మ చాలా విషయాలు పంచుకుంది. తన ముగ్గురు కొడుకుల్లో వేణుమాధవ్ చిన్నవాడని తెలిపింది. చిన్నతనం నుంచి చాలా చురుగ్గా ఉండేవాడని పేర్కొంది. మిమిక్రీ బాగా చేసేవాడని.. అలా ఒకసారి ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు చూసిన ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి తనకు అవకాశం ఇచ్చారని తెలిపింది. అలా వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని వేణుమాధవ్ నటుడిగా ఎదిగాడని చెప్పింది.
అదే నేను చేసిన తప్పు
తను అలా నటుడిగా బిజీ కావడంతో మిగిలిన ఇద్దరు కొడుకులను తనకు అసిస్టెంట్స్గా పెట్టానని సావిత్రమ్మ తెలిపింది. అలా ఎందుకు పెట్టానా అని ఇప్పుడు బాధపడుతున్నా. నా జీవితంలో చేసిన పెద్ద తప్పు అదేనని బాధపడింది. ఎందుకంటే తన నిర్ణయం వల్ల వేణుమాధవ్ ఒక్కడే ఎదిగాడని.. మిగిలిన ఇద్దరు పిల్లలు ఎదగలేదని కన్నీళ్లు పెట్టుకుంది. ఒకవేళ వేణుమాధవ్ బతికి ఉంటే వాళ్లను చూసుకునేవాడేమో అని తెలిపింది.
వేణుమాధవ్ ఆస్తుల విలువ రూ.20 కోట్లు
సినిమాల్లోకి వచ్చి వేణుమాధవ్ బాగానే సంపాదించాడని సావిత్రమ్మ తెలిపింది. ఏడు ఎనిమిది ఫ్లాట్లు కొనుగోలు చేశాడని పేర్కొంది. వేణు ఆస్తుల విలువ రూ.20కోట్ల పైనే ఉంటుందని వెల్లడించింది. వేణు మాధవ్కు ఇద్దరు కొడుకులు అని.. వాళ్లు సొంత ఇంట్లోనే ఉంటున్నారని చెప్పుకొచ్చింది. ఇద్దరు కొడుకులను పోగొట్టుకున్న తను మాత్రం మిగిలిన కొడుకు దగ్గర.. అద్దె ఇంట్లోనే ఉంటున్నానని బాధపడింది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Nayanthara | నన్ను కూడా కమిట్మెంట్ అడిగారు.. సంచలన విషయం బయటపెట్టిన నయనతార
Jabardasth | జబర్దస్త్ నుంచి సింగర్ మనో ఎందుకు తప్పుకున్నాడు? కారణమేంటి?
Ileana | ఆస్పత్రి బెడ్పై ఇలియానా.. ఆహారం కూడా తీసుకోలేని స్థితిలో ఉన్నానంటూ పోస్టు
Tarakaratna | విషమంగానే నందమూరి తారకరత్న ఆరోగ్యం.. హెల్త్ బులిటెన్ విడుదల