Home Latest News KKR vs PBKS | మళ్లీ మెరిసిన రింకూ సింగ్‌.. చివరి బంతికి బౌండ్రీ.. పంజాబ్‌పై...

KKR vs PBKS | మళ్లీ మెరిసిన రింకూ సింగ్‌.. చివరి బంతికి బౌండ్రీ.. పంజాబ్‌పై కోల్‌కతా థ్రిల్లింగ్‌ విక్టరీ

KKR vs PBKS | టైమ్‌ 2 న్యూస్‌, కోల్‌కతా: బౌలర్ల క్రమశిక్షణకు బ్యాటర్ల సహకారం తోడవడంతో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఐదో విజయం నమోదు చేసుకుంది. వరుణ్‌ చక్రవర్తి, హర్షిత్‌ రాణా ధాటికి పంజాబ్‌ ఓ మాదిరి స్కోరుకే పరిమితం కాగా.. నితీశ్‌ రాణా, జాసన్‌ రాయ్‌, రస్సెల్‌ ధాటిగా ఆడటంతో కోల్‌కతా జయకేతనం ఎగరవేసింది. చివరి బంతికి బౌండ్రీ బాదిన రింకూ సింగ్‌ మరోసారి హీరో అయ్యాడు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 16వ సీజన్‌లో ఐదో విజయం నమోదు చేసుకుంది. సోమవారం జరిగిన పోరులో కోలకతా 5 వికెట్ల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌ను చిత్తుచేసింది.

మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కెప్టెన్‌ శిఖర్‌ ధవన్‌ (47 బంతుల్లో 57; 9 ఫోర్లు, ఒక సిక్సర్‌) అర్ధశతకంతో రాణించాడు. షారుక్‌ ఖాన్‌ (8 బంతుల్లో 21 నాటౌట్‌; 3 ఫోర్లు, ఒక సిక్సర్‌), జితేశ్‌ శర్మ (21; 2 సిక్సర్లు), హర్‌ప్రీత్‌ బ్రార్‌ (17 నాటౌట్‌; 2 ఫోర్లు, ఒక సిక్సర్‌) విలువైన పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి 3, హర్షిత్‌ రాణా రెండు వికెట్లు పడగొట్టాడు.

రాయ్‌, రస్సెల్‌, రాణా తలా కొన్ని..

అనంతరం లక్ష్యఛేదనలో కోల్‌కతా సరిగ్గా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. కెప్టెన్‌ నితీశ్‌ రాణా (38 బంతుల్లో 51; 6 ఫోర్లు, ఒక సిక్సర్‌) హాఫ్‌సెంచరీ సాధించగా.. జాసెన్‌ రాయ్‌ (38; 8 ఫోర్లు), రస్సెల్‌ (23 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రింకూ సింగ్‌ (10 బంతుల్లో 21; 2 ఫోర్లు, ఒక సిక్సర్‌) ఆకట్టుకున్నారు. పంజాబ్‌ బౌలర్లలో రాహుల్‌ చాహర్‌ 2 వికెట్లు పడగొట్టాడు. సీజన్‌లో భాగంగా మంగళవారం జరుగనున్న పోరులో ముంబైతో బెంగళూరు తలపడనుంది.

మలుపు తిప్పిన 19వ ఓవర్‌..

కోల్‌కతా విజయానికి 12 బంతుల్లో 26 పరుగులు అవసరమైన దశలో డేంజర్‌ మ్యాన్‌ రస్సెల్‌ విశ్వరూపం చూపాడు. ఐపీఎల్లోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కిన ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌ బౌలింగ్‌ను రస్సెల్‌ ఊచకోత కోశాడు. రెండో బంతిని మిడ్‌ వికెట్‌ మీదుగా భారీ సిక్సర్‌ బాదిన రస్సెల్‌.. ఆ తర్వాతి బంతిని అదే రేంజ్‌లో ప్రేక్షకుల్లో పడేశాడు. దీంతో ఈడెన్‌ గార్డెన్స్‌ మోత మోగిపోగా.. ఐదో బంతిని రస్సెల్‌ బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ పై నుంచి సిక్సర్‌ బాదాడు. దీంతో లక్ష్యం 6 బంతుల్లో 6 పరుగులకు చేరగా.. చివరి ఓవర్‌ వేసిన అర్ష్‌దీప్‌ తీవ్రంగా ప్రయత్నించినా.. పంజాబ్‌ను పోటీలో నిలుపలేకపోయాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన దశలో రింకూ బౌండ్రీతో మ్యాచ్‌ను ముగించాడు.

Follow Us : FacebookTwitter

Read More Articles |

GT vs LSG | అన్నదమ్ముల సవాల్‌లో తమ్ముడిదే పైచేయి.. లక్నోపై గుజరాత్‌ గ్రాండ్‌ విక్టరీ

SRH vs RR | సన్‌రైజర్స్‌ సంచలన విజయం.. 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన హైదరాబాద్‌

Exit mobile version