IND vs AUS | టైమ్ 2 న్యూస్, అహ్మదాబాద్: ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ ) ఫైనల్కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత్ పోరాడుతోంది. నిర్జీవమైన పిచ్పై భారత బ్యాటర్లు సమిష్టిగా సత్తాచాటడంతో ఆఖరి టెస్టులో భారత్ మంచి స్కోరు దిశగా సాగుతోంది. ప్రతిష్ఠాత్మక ‘బోర్డర్-గవాస్కర్’ సిరీస్లో భాగంగా జరుగుతున్న నాలుగో టెస్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా 3 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ (235 బంతుల్లో 128; 12 ఫోర్లు, ఒక సిక్సర్) సెంచరీతో కదంతొక్కగా.. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (128 బంతుల్లో 59 బ్యాటింగ్; 5 ఫోర్లు), చతేశ్వర్ పుజారా (121 బంతుల్లో 42), కెప్టెన్ రోహిత్ శర్మ (35) రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో లియాన్, కునేమన్, మార్ఫి తలా ఒక వికెట్ పడగొట్టారు. చేతిలో ఏడు వికెట్లు ఉన్న భారత్.. ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 191 పరుగులు వెనుకబడి ఉంది. కోహ్లీతో పాటు స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (16) క్రీజులో ఉన్నాడు. మూడో రోజు సెషన్కు ఒకటి చొప్పున రోహిత్ సేన మూడు వికెట్లు కోల్పోగా.. ఆసీస్ స్పిన్ త్రయం ఒక్కో వికెట్ ఖాతాలో వేసుకుంది.
గిల్ జిగేల్..
ఓవర్నైట్ స్కోరు 36/0తో శనివారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా సాధికారికంగా ఆడింది. ఆస్ట్రేలియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ గిల్ పరుగుల వరద పారిస్తే.. ఉన్నంతసేపు ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన రోహిత్ శర్మ కునేమన్ బౌలింగ్లో ఔటయ్యాడు. దీతో 74 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడగా.. చతేశ్వర్ పుజారా రాకతో ఇన్నింగ్స్ తిరిగి గాడినపడింది. ఒక ఎండ్లో గిల్ కంగారూ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూంటే.. మరోవైపు ఆసీస్ ప్లేయర్లను పుజారా విసిగించాడు. ఈ క్రమంలో గిల్ 90 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. రెండో వికెట్కు 113 పరుగులు జోడించిన అనంతరం పుజారా మార్ఫి బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. అప్పటికే గిల్ సెంచరీ పూర్తి చేసుకోగా.. అతడికి విరాట్ కోహ్లీ జతవడంతో టీమ్ఇండియాకు తిరుగులేకుండా పోయింది. ఈ ఇద్దరే ఆట ముగించేలా కనిపించినా.. చివరకు లియాన్ బౌలింగ్లో గిల్ ఔటయ్యాడు. పిచ్ నుంచి చక్కటి సహకారం లభిస్తున్న చోట సీనియర్ బ్యాటర్లు కూడా ఇబ్బంది పడుతున్నా.. గిల్ మాత్రం తన క్లాస్ కొనసాగించాడు. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ను తప్పించి జట్టులో స్థానం దక్కించుకున్న గిల్ గత మ్యాచ్లో పెద్దగా ప్రభావం చూపకపోయినా.. అహ్మదాబాద్లో సూపర్ ఇన్నింగ్స్తో అలరించాడు. చివర్లో బంతి కాస్త టర్న్ అవుతుండటంతో కోహ్లీ, జడేజా మరో వికెట్ పడకుండా రోజు ముగించారు. మొత్తంగా తొలి ఇన్నింగ్స్లో ఇప్పటి వరకు 99 ఓవర్లు ఆడిన భారత్ 289 పరుగులు చేసింది
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Telangana Cabinet | సొంత స్థలం ఉన్న వాళ్లకు రూ.3లక్షల సాయం.. కొత్త పథకం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Telangana Cabinet | రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే..
Influenza | కాన్పూర్లో విపరీతంగా పెరుగుతున్న ఇన్ ఫ్లూ ఎంజా కేసులు.. ఎమర్జెన్సీ వార్డులు ఫుల్!