Hyderabad Fire Accdient | హైదరాబాద్లో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. అబిడ్స్ పరిధిలోని బొగ్గులకుంటలోని ఓ మెకానిక్ షెడ్డులో శనివారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అక్కడే కారులో పడుకున్న వాచ్మెన్ సజీవదహనమయ్యాడు.
మస్కిటో కాయిల్ వల్లే అగ్నిప్రమాదం?
హైదరాబాద్లోని కార్వాన్కు చెందిన సంతోశ్.. అబిడ్స్లోని ఓ చెప్పుల దుకాణంలో పనిచేస్తున్నాడు. అక్కడ డ్యూటీ అయిపోగానే బొగ్గులకుంటలోని కామినేని ఆస్పత్రిని ఆనుకుని ఉన్న వినాయక మెకానిక్ షెడ్డులో నైట్ వాచ్మెన్గా అదనపు డ్యూటీ చేస్తున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం కూడా చెప్పుల దుకాణంలో పని ముగించుకుని సంతోశ్ గ్యారేజికి వచ్చాడు. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడి నిద్రపోయాడు. గ్యారేజిలో దోమలు ఎక్కువగా ఉండటంతో అందులోనే ఉన్న ఒక బెంజ్ కారులో నిద్రపోయాడు. ఒక మస్కిటో కాయిల్ను ముట్టించుకుని పడుకున్నాడు. అయితే మస్కిటో కాయిల్ నిప్పు రవ్వలు బెంజ్ కారులోని కార్పెట్పై పడటంతో చిన్నగా మంటలు చెలరేగాయి. ఆ మంటలు కారుతో పాటు గ్యారేజికి అంటుకున్నాయి. ఆ సమయంలో బెంజ్ కారు లాక్ అవ్వడంతో బయటకు రాలేని పరిస్థితుల్లో సంతోశ్ అందులోనే సజీవదహనమయ్యాడు.
పూర్తిగా కాలిపోయిన మృతదేహం
తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గ్యారేజి నుంచి మంటలు రావడం గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి వచ్చిన అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు మంటలను ఆర్పారు. కానీ అప్పటికే ఐదు కార్లు దగ్ధమయ్యాయి. అసలు ప్రమాదం ఎలా జరిగిందని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గమనిస్తున్న సమయంలో పూర్తిగా కాలిపోయిన మృతదేహం కనిపించింది. ఆ తర్వాత చనిపోయింది నైట్ వాచ్మెన్ సంతోశ్గా గుర్తించి అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది నిజంగా ప్రమాదమా? లేదా ఎవరైనా హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Chiranjeevi vs Mohan babu | చిరంజీవితో గొడవలపై తొలిసారి నోరు విప్పిన మోహన్ బాబు
Allu Arjun | అల్లు అర్జున్ ట్విట్టర్లో నన్ను బ్లాక్ చేశాడు.. వైరల్గా మారిన వరుడు హీరోయిన్ ట్వీట్