Home Latest News Marriage | కట్నం సరిపోలేదని పెళ్లి ఆపేసిన వధువు.. న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్‌ మెట్లెక్కిన...

Marriage | కట్నం సరిపోలేదని పెళ్లి ఆపేసిన వధువు.. న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్‌ మెట్లెక్కిన వరుడు.. ఘట్‌కేసర్‌లో వింత ఘటన

Image by freepic.diller on Freepik

Marriage | కాసేపట్లో పెళ్లి.. మూడు ముళ్ల బంధంతో రెండు మనసులు, రెండు కుటుంబాలు ఒక్కటి కావాల్సిన శుభ సమయం. ఇంకో గంట అయితే అమ్మాయి మెడలో అబ్బాయి మూడు ముళ్లు వేస్తాడనగా కట్నం సరిపోలేదని పేచీ! నాకు ఈ కట్నం సరిపోదు.. అడిగినంత ఇస్తేనే పెళ్లి పీటలు ఎక్కుతా.. లేదంటే మీరెవరో.. నేనెవరో అంటూ డిమాండ్! ముహూర్తానికి గంట ముందు ఇలా మాట్లాడితే ఎలా అని కాళ్ల వేళ్లా పడ్డా వినిపించుకోలేదు. అదే మొండిపట్టుదలతో ఉండటం చేసేదేమీ లేక పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అదనపు కట్నం డిమాండ్ చేసింది వరుడు కాదు.. వధువు ! బలైంది పెళ్లి కొడుకు!! హైదరాబాద్ శివారులోని ఘట్‌కేసర్‌లో ఈ వింత ఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌కు చెందిన ఓ యువకుడికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటకు చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. అమ్మాయి లక్షణంగా, చూడముచ్చటగా ఉండటంతో రూ.2లక్షలు కట్నం ఇచ్చేందుకు అబ్బాయి తరఫు బంధువులు అంగీకరించారు. దీంతో గురువారం ( మార్చి 9న) ఇద్దరికీ పెళ్లి చేయాలని ఇరు కుటుంబ పెద్దలు నిర్ణయించారు. పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఘట్‌కేసర్‌లోని ఓ ఫంక్షన్ హాలు కూడా బుక్ చేశారు.

ముహూర్తం సమయం రావడంతో వరుడు కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులంతా ఫంక్షన్ హాలుకు చేరుకున్నారు. గురువారం 7:21 గంటలకు ముహూర్తం కాగా.. సాయంత్రం 6:21 అవుతున్నా అమ్మాయి వాళ్లు మాత్రం ఫంక్షన్ హాలుకు చేరుకోలేదు. కనీసం వాళ్ల నుంచి ఎలాంటి కబురు కూడా లేదు. దీంతో ఏమైందో ఏమోనని వరుడి బంధువులు ఆరాతీయగా.. వధువు అలిగిందని అవతలి నుంచి సమాధానమిచ్చింది. ముందుగా ఒప్పుకున్న రూ.2లక్షల కట్నం సరిపోదని.. ఇంకా అదనపు కట్నం ఇస్తేనే కల్యాణ మండపానికి వస్తానని డిమాండ్ చేసింది. లేదంటే ఈ పెళ్లి అక్కర్లేదని తెగేసి చెప్పింది. దీంతో వరుడి కుటుంబసభ్యులు ఒక్కసారిగా షాకయ్యారు. ముందుగా అనుకున్నంత డబ్బు ఇచ్చాం కదా.. మళ్లీ అదనపు కట్నం అడగడమేంటని ప్రశ్నించారు. ముహూర్తం ముందు గొడవలు ఎందుకని బతిమిలాడారు. కానీ పెళ్లి కూతురు, ఆమె కుటుంబసభ్యులు వినిపించుకోలేదు. దీంతో వరుడి కుటుంబసభ్యులు వెళ్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో వధువు, ఆమె కుటుంబసభ్యులను స్టేషన్‌కు పిలిపించుకుని రాజీ చేసే ప్రయత్నం చేశారు. కానీ వధువు వినిపించుకోకపోవడంతో చివరకు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. ఆఖరకు అమ్మాయికి పెళ్లికి ముందు ఇచ్చిన రూ.2లక్షలను కూడా వదులుకుని అబ్బాయి వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

IND vs AUS | ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో క్రికెట్‌ మ్యాచ్‌.. భారత్‌, ఆస్ట్రేలియా నాలుగో టెస్టు ప్రత్యేక అతిథులుగా మోదీ, ఆంటోని ఆల్బనీస్‌

Telangana Cabinet | సొంత స్థలం ఉన్న వాళ్లకు రూ.3లక్షల సాయం.. కొత్త పథకం ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

Telangana Cabinet | రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే..

Influenza | కాన్పూర్‌లో విపరీతంగా పెరుగుతున్న ఇన్ ఫ్లూ ఎంజా కేసులు.. ఎమర్జెన్సీ వార్డులు ఫుల్‌!

Traffic Challan | ప్రాణాలు తీసిన ట్రాఫిక్‌ చలాన్లు.. కట్టలేను సారు అన్నా వినలేదు.. హైదరాబాద్‌లో దారుణం!

Exit mobile version