KCR on Etela Rajender | అసెంబ్లీలో బడ్జెట్పై చర్చల అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడిన తెలంగాణ సీఎం కేసీఆర్ తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిగ్ మారిపోయింది. ఇప్పటివరకు నిప్పూఉప్పుగా ఉన్న ఈటలపై ఒక్కసారిగా కేసీఆర్కు ప్రేమ పుట్టుకురావడానికి కారణాలేంటి.. దాని వెనుక ఏమైనా రాజకీయ కారణాలు ఉన్నాయా అన్న ఆలోచనలు మొదలయ్యాయి.
ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీకి దూరమైనప్పటి నుంచి అసెంబ్లీలో సీఎం కేసీఆర్ నోటి వెంట ఆయన పేరు ఒక్కసారి కూడా రాలేదు. కానీ ఇప్పుడు బడ్జెట్ సమావేశాల చివరి రోజు.. కేసీఆర్ నోటి వెంట 2 గంటల్లో దాదాపు 15 సార్లు ఈటల పేరు ప్రస్తావనకు వచ్చింది. మిత్రుడు ఈటల అంటూ మాట్లాడారు. మంచి ప్రశ్నలను లేవనెత్తారంటూ కేసీఆర్ ప్రశంసించారు. ఈటల లేవనెత్తిన ప్రశ్నలపైనా సానుకూలంగా స్పందించారు. ఇప్పుడిదే రాజకీయంగా సంచలనంగా మారింది. రకరకాల ఊహాగానాలకు తెరతీసింది. ఈటల తిరిగి బీఆర్ఎస్లోకి చేరుతారంటూ సోషల్ మీడియాలో హోరెత్తిపోతోంది.
ఇంతకీ అసెంబ్లీలో ఏం జరిగిందంటే.. ద్రవ్య వినిమయ బిల్లుపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడారు. రెండు గంటల్లో 15 సార్లు ఈటల రాజేందర్ పేరును కేసీఆర్ ప్రస్తావించడం.. మిత్రుడు ఈటల అంటూ సరికొత్తగా పిలవడంతోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెనుక నుంచి ఘర్ వాపసీ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ నేపథ్యంలోనే ఈటల బీఆర్ఎస్లోకి నిజంగానే వచ్చేస్తున్నారా అన్న అనుమానాలు మొదలయ్యాయి.
విశ్వవిద్యాలయాల్లో డైట్ చార్జీలు పెంచాలని, ధరణిలో కబ్జా కాలం తీసేయడంతో సమస్యలు తలెత్తుతున్నాయని, స్కాలర్షిప్లు, నీటిపారుదల రంగంపైనా, చెక్ డ్యాంలకు సంబంధించిన సమస్యలు, ఉద్యోగుల జీతభత్యాల విడుదల, మహిళలకు వడ్డీలేని రుణాలు సహా చాలా విషయాలను బడ్జెట్ సమావేశాల్లో ఈటల రాజేందర్ ప్రస్తావించారు. వీటిపైన సానుకూలంగా స్పందించిన కేసీఆర్.. సమస్యలను పరిష్కరించాలని మంత్రి హరీశ్రావును ఆదేశించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినంత మాత్రానా బేషజాలకు పోవద్దని, అవసరమైతే ఈటలను పిలిచి మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని హరీశ్రావుకు సూచించారు.
క్లారిటీ ఇచ్చిన ఈటల రాజేందర్..
అసెంబ్లీలో తనను ఉద్దేశిస్తూ మాట్లాడిన కేసీఆర్ వ్యాఖ్యలపై ఈటల రాజేందర్ స్పందించారు. సీఎం కేసీఆర్ తనను డ్యామేజీ చేయాలనుకున్నారని, అనుకున్నట్లుగానే డ్యామేజీ చేశారంటూ ఈటల వ్యాఖ్యానించారు. కేసీఆర్ అబద్ధాన్ని ఇటూ చెప్పగలరు.. అటూ చెప్పగలరంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ తనపై చేసిన డ్యామేజీని కడుక్కోవాలంటే కచ్చితంగా నెలల సమయం పడుతుందంటూ పేర్కొన్నారు.
టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు సైనికుడిగా పనిచేశానని, బీజేపీలో కూడా సైనికుడిగా పనిచేస్తానని ఈ సందర్భంగా ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. లాయాలిటీకి మారుపేరుగా ఉంటానన్న ఈటల.. కేసీఆర్ తన పేరు చెప్పగానే పొంగిపోయే వ్యక్తిని కాదు అన్నారు. తనపై చేసిన దాడిని మరచిపోయే ప్రసక్తే లేదని ఈటల అన్నారు. తాను పార్టీ మారలేదని, వాళ్లే తనను గెంటేశారంటూ గుర్తు చేసిన ఈటల.. గెంటేసిన వాళ్లు పిలిచినా మళ్లీ ఆ పార్టీలోకి వెళ్లేది లేదంటూ క్లారిటీ ఇచ్చారు. నా చరిత్ర తెలిసిన వారు ఎవరూ నా గురించి తక్కువ అంచనా వేయరు అంటూ చెప్పుకొచ్చారు. తాను నిమిషానికి ఓ మాట మాట్లాడే వ్యక్తిని కానని, రోజుకో పార్టీ మారే వ్యక్తిని అస్సలు కానంటూ తేల్చి చెప్పారు. నాకంటూ ఒక ఒరవడి, నాకంటూ ఒక చరిత్ర.. నాకంటూ ఒక కమిట్ మెంట్ ఉందని ఈటల స్పష్టం చేశారు.
కాగా కేసీఆర్ కంటే ముందు అసెంబ్లీలో మాట్లాడిన ఈటల.. కేసీఆర్పై పొగడ్తలు కురిపించారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా పనిచేశారని, సాదకాబాధకాలు ఆయనకు తెలుసని అన్నారు. అంత అనుభవం ఉన్న రాజకీయ నాయకులు లేరంటూ కేసీఆర్ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఏదేమైనా రాష్ట్రానికి కేసీఆర్ మంచే చేస్తారు అంటూ ఈటల వ్యాఖ్యానించడం కొసమెరుపు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Minister KTR | మెట్రో టికెట్ ధరలు ఇష్టం వచ్చినట్టు పెంచితే ఊరుకోం.. అసెంబ్లీ సాక్షిగా మంత్రి కేటీఆర్ హెచ్చరిక
KA Paul | సక్సెస్.. కేసీఆర్ బర్త్ డే నాడు సెక్రటేరియట్ ప్రారంభం కాకుండా ఆపేశా.. కేఏ పాల్
Telangana Secretariat | తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా