Komatireddy Venkat Reddy | హాత్ సే హాత్ జోడో యాత్రలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పాదయాత్రలో ఆయన ప్రగతి భవన్ను కూల్చేయాలంటూ ఆయన పిలుపునివ్వడాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తాజాగా సొంత పార్టీ నేతనే టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. రేవంత్ రెడ్డి అలా అనకుండా ఉంటే బాగుండేదని నల్గొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అభిప్రాయపడ్డారు.
ప్రగతి భవన్ను రేవంత్ రెడ్డి కేవలం కేసీఆర్ ఆస్తిగా చూస్తున్నట్టు ఉన్నారు.. అది ప్రజల సొత్తు అని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. ప్రగతి భవన్ను ప్రజా దర్బర్గానో.. ఆస్పత్రిగానో వాడుకోవాలని అంటే బాగుండేదని అన్నారు. ఈ సందర్బంగా తాను చేయబోయే పాదయాత్ర గురించి కూడా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వివరించారు. సమయం తక్కువగా ఉన్నందున బస్సు లేదా బైక్ యాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల్లో పాదయాత్ర చేపడతానని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది ఈ పాదయాత్రలో ప్రజలకు వివరిస్తానని తెలిపారు.
ఇటీవల ములుగులో పర్యటించిన రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. దొరల కాలంలో గడీలను గ్రానైట్లు పెట్టి పేల్చేసినట్టు.. ప్రస్తుతం గడీని తలపిస్తోన్న ప్రగతి భవన్ను కూడా నక్సల్స్ బాంబులు పెట్టి పేల్చేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలపై తెలంగాణలో పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఈ వ్యాఖ్యలు చేసినందుకు గానూ.. రేవంత్ రెడ్డిపై ఫిర్యాదులు కూడా నమోదవుతున్నాయి. కాగా.. రేవంత్ రెడ్డి వ్యవహారాన్ని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముందు నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఆయన టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన రోజు నుంచి పార్టీ వ్యవహారాల్లో అంటీముట్టనట్టుగా ఉంటున్న కోమటిరెడ్డి.. బహిరంగంగానే ఆయన అభిప్రాయాలను అనేకసార్లు వెల్లిబుచ్చారు. ఇప్పుడు మరోసారి రేవంత్ వ్యాఖ్యలను బహిరంగంగానే కోమటి రెడ్డి వ్యతిరేకించడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఆయన రేవంత్ తో భేటీ కావడం .. యాత్రలో పాల్గొంటానని చెప్పడం కూడా ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది కూడా.
Follow Us : Google News, Facebook, Twitter