Narendra Modi | కాంగ్రెస్ పాలనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడిన ప్రధాని.. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము తన ప్రసంగంతో దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపారని, కోట్లాది మంది భారతీయులకు మార్గదర్శనం చేశారని అన్నారు. రాష్ట్రపతి పీఠంపై ముర్ము కూర్చోవడం ఆదివాసీ సమాజానికి దక్కిన గొప్ప గౌరవమన్న మోదీ.. మహిళలందరికీ స్ఫూర్తిగా నిలిచారన్నారు. అలాంటి రాష్ట్రపతిని అవమానించేలా కొందరు నేతలు మాట్లాడారంటూ రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ చెప్పారు. మనసులోని ద్వేషాన్ని వారి మాటల్లో బయటపెట్టారని అన్నారు. బీజేపీ హయాంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, దాని వల్ల కొందరు బాధపడుతున్నారని ప్రతిపక్షాలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
కశ్మీరూ టూ కన్యాకుమారి వరకు 2004 నుంచి 2014 మధ్య ఉగ్రవాదులు చెలరేగిపోయారని మోదీ అన్నారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన కామన్వెల్త్ కుంభకోణంతో దేశం పరువు పోయిందన్నారు. కాంగ్రెస్ ప్రతి అవకాశాన్ని సంక్షోభంగా మార్చసిందని.. ఫలితంగా విలువైన దశాబ్ద కాలాన్ని కోల్పోయామని అన్నారు. భారత దేశంలో 70 ఏళ్లలో 70 విమానాశ్రయాలు నిర్మిస్తే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 9 ఏళ్లలో 70 విమానాశ్రయాలను నిర్మించిందని చెప్పారు. రోడ్డు, జల మార్గాలను కూడా అభివృద్ధి చేస్తున్నామని లోక్సభలో చెప్పారు. గతంలో రైల్వే అంటే ప్రమాదాలే గుర్తొచ్చేవని, ఇప్పుడు వందే భారత్ రైళ్లను చూసి ప్రజలు గర్వపడుతున్నారని చెప్పారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్ల కాలంలో విపక్ష నేతలంతా ఆరోపణలకే పరిమితమయ్యారని మోదీ అన్నారు. ఎన్నికల సంఘం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సైన్యంపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము నిర్మాణాత్మక విమర్శలను స్వాగతిస్తామని ప్రతిపక్షాలకు చురకలంటించారు. విపక్షనేతలంతా దేశం కోసం కాకుండా ఈడీ వల్లే ఒక్కటవుతున్నారని ఎద్దేవా చేశారు. ఈడీ వల్లే ప్రతిపక్షాలకు ఏకమయ్యే అవకాశం వచ్చిందని విమర్శించారు.
గతంలో తమ సమస్యల పరిష్కరించాలని ఇతరులపై భారత్ ఆధారపడేదని, కానీ పరిస్థితి మారిందన్నారు. ఇప్పుడు భారత దేశమే ఇతరుల సమస్యలను పరిష్కరించే స్థాయికి చేరుకుందన్నారు. భారత్ ఇప్పుడు జీ20 దేశాలకు నాయకత్వం వహిస్తోందని, ఇప్పుడది కొందరికి కంటగింపుగా మారిందంటూ మోదీ మండిపడ్డారు. దేశ ప్రగతిని కొందరు అంగీకరించడం లేదని, తాను మాత్రం గర్వపడుతున్నానంటూ వ్యాఖ్యానించారు. తన జీవితాన్ని దేశం కోసమే అంకితం చేశానని, ప్రజలకు తనపై విశ్వాసం ఉందని చెప్పారు. అది ప్రతిపక్షాలకు అర్థంకాదని, అందదని చెప్పారు. తాను 25 కోట్ల కుటుంబాల సభ్యుడినని చెప్పిన మోదీ.. కొందరు ఒకే కుటుంబానికి సేవ చేశారని విమర్శించారు. తాను మాత్రం 25 కోట్ల కుటుంబాలకు సేవ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
పెదవి విరిచిన రాహుల్ గాంధీ..
లోక్సభలో ప్రధాని మోదీ చేసిన ప్రసంగంపై రాహుల్ గాంధీ పెదవి విరిచారు. గౌతమ్ అదానీపై దర్యాప్తునకు చర్యలు ప్రారంభించకుండా మోదీ ఆయనను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ప్రధాని ప్రసంగం సంతృప్తినివ్వలేదన్న రాహుల్గాంధీ.. మోదీకి చిత్తశుద్ధి ఉంటే అదానీ కుంభకోణాల వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
China Vs America | చైనాకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ వార్నింగ్.. మా జోలికి వస్తే ఊరుకోమంటూ హెచ్చరిక!
Ponguleti | దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయ్.. పొంగులేటికి తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ సవాలు