Andhra Pradesh | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గుంటూరు, కందుకూరు టీడీపీ సభలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లోని రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలను ప్రభుత్వం నిషేధించింది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. మున్సిపల్, పంచాయతీ రహదారులు, రోడ్డు మార్జిన్ల వద్ద 30 పోలీసు యాక్ట్ నిబంధనలను అమలు చేయనున్నారు. ర్యాలీలు, సభలకు అనుమతించేది లేదని, కచ్చితంగా నిబంధనలు అమలయ్యేలా చూడాలని ఆదేశాల్లో హోంశాఖ పేర్కొంది. అయితే అత్యంత అరుదైన సందర్భాల్లో జిల్లా ఎస్పీలు, పోలీసు కమిషనర్లు షరతులతో అనుమతి ఇవ్వొచ్చని మినహాయింపు ఇచ్చింది.
ఈ మేరకు హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయతీరాజ్ రహదారులు పూర్తిగా ప్రజల రాకపోకలు, సరుకు రవాణా కోసమే ఉపయోగించాలని స్పష్టం చేసింది. రోడ్డుకు దూరంగా ప్రజలకు ఇబ్బందిలేని విధంగా సభలు, రోడ్ షోలు నిర్వహించేందుకు ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంపిక చేయాలని అధికారులకు హోంశాఖ సూచించింది. ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే సభలు, ర్యాలీలు జరిగేలా చూడాలని స్పష్టం చేసింది.
మరోవైపు రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధం విధించడాన్ని టీడీపీ, బీజేపీ వ్యతిరేకిస్తున్నాయి. ఏపీలో నియంత పాలన కొనసాగుతుందని టీడీపీ నేతలు విమర్శించారు. టీడీపీకి వచ్చే ఆదరణ చూసి ఓర్వలేక నిషేధం విధించారంటూ విమర్శించారు. సభలు, ధర్నాలు, ర్యాలీలు చేపట్టకుండా నిషేధించడమంటే ప్రజల హక్కులను కాలరాయడమేనని టీడీపీ నేతలు అన్నారు. మరోవైపు ప్రజల భద్రత కోసమే రోడ్లపై సభలు, ర్యాలీలపై నిషేధం విధించినట్లు ప్రభుత్వం పేర్కొంది.