Basara | సరస్వతీ దేవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రెంజర్ల రాజేశ్పై చర్యలు తీసుకోవాలంటూ అమ్మవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆలయ అర్చలకులతో పాటు భక్తులు, స్థానికులు నిరసనలకు దిగారు. బాసర బంద్కు పిలుపునిచ్చారు. వీరికి వ్యాపారులు కూడా సహకరిస్తూ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
రాజేశ్పై పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేస్తూ బాసరలో స్థానికులు, వ్యాపారులు, అర్చకులు రాస్తారోకోకు దిగారు. రాజేశ్ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. దీంతో బాసరలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చేదాక ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. రాజేశ్పై చర్యలు తీసుకోవాలని బాసర అమ్మవారి ఆలయ అర్చకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల అయ్యప్ప స్వామిపై బైరి నరేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సమయంలో రెంజర్ల రాజేశ్ ఆయన పక్కనే ఉన్నారు.
నరేష్ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన సందర్భంలోనూ రాజేశ్ ఆయనకు మద్దతు ప్రకటించి మరింత ఆజ్యం పోశారు. ఈ క్రమంలోనే రాజేశ్పై చర్యలు తీసుకోవాలని అయ్యప్ప స్వాములు రెంజర్ల రాజేశ్ ఇంటిని ముట్టడించారు. పోలీసులు జోక్యం చేసుకుని క్షమాపణలు చెప్పించడంతో ఆందోళన విరమించారు. తాజాగా సరస్వతి అమ్మవారిపై రాజేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో బాసర బంద్కు పిలుపునిచ్చారు.