Numaish 2023 | కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు హైదరాబాద్ వాసులకు మొదట గుర్తొచ్చేది నుమాయిష్. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జనవరి ఒకటో తేదీన ప్రారంభమై ఫిబ్రవరి 15 వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అని కూడా దీనికి పేరు. ఇక దీని చరిత్ర కూడా పెద్దదే. నిజాం హయాంలోనే ఈ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నుమాయిష్ను 1938 ఏప్రిల్ 6వ తేదీన పబ్లిక్గార్డెన్స్లో ప్రారంభించారు. అప్పట్లో దీని ఏర్పాటుకు అయిన ఖర్చు రూ.2.5 లక్షలు. దాదాపు 100 స్టాళ్లు ఏర్పాటు చేశారు. కానీ కేవలం పది రోజులే నడిచింది.
ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ గ్రూప్ ఆలోచనే..
నుమాయిష్కు అంకురార్పణ చేసింది ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ గ్రూప్. హైదరాబాద్లో తయారయ్యే ఉత్పత్తులకు ప్రచారం కల్పించేందుకు వీలుగా ఒక ప్రదర్శన ఏర్పాటు చేయాలని మీర్ అక్బర్ అలీఖాన్, నవాబ్ అహ్మద్ అలీ ఖాన్, మెహెది నవాజ్ జంగ్ లాంటి ప్రముఖులు అనుకున్నారు. వారి ఆలోచనకు అనుగుణంగానే నుమాయిష్ 1938లో ఏర్పాటైంది. దీని పూర్తి పేరు నుమాయిష్ మస్నూవత్ ఇ ముల్కీ.. అనగా స్థానిక ఉత్పత్తుల ప్రదర్శన శాల అని అర్థం.
పబ్లిక్ గార్డెన్స్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్కు..
కాలక్రమేణా నుమాయిష్కు ఆదరణ పెరిగిపోవడంతో పబ్లిక్ గార్డెన్ స్థలం సరిపోదని నిజాం నవాబ్కు దీవాన్గా పనిచేసిన సర్ మీర్జా మహమ్మద్ ఇస్మాయిల్ భావించారు. నుమాయిష్ను ముఖరంజాహి రోడ్డులోని 23 ఎకరాల స్థలంలోకి మార్పించారు. ఇప్పుడు నుమాయిష్ ఉన్నది అక్కడే. దీన్నే ఇప్పుడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్గా పిలుస్తున్నారు.
తొలిసారి బ్రేక్ పడింది అప్పుడే..
1947-48లో నుమాయిష్ను నిర్వహించలేకపోయారు. భారత దేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం జరిగింది అప్పుడే. ఆ నాటి పరిస్థితుల నేపథ్యంలో ఎగ్జిబిషన్ నిర్వహించలేదు. అయితే 1949లో ఆనాటి గవర్నర్ జనరల్ సీ రాజగోపాలాచారి నుమాయిష్ను ప్రారంభించారు. అప్పుడు నుమాయిష్ పేరు తీసేసి ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అని పేరు పెట్టారు. కానీ అందరూ నుమాయిష్ పేరుతోనే పిలిచేవారు. దాంతో అదే పేరు మళ్లీ పెట్టారు.
82nd numaish..
ఇప్పుడు నిర్వహించేది 82వ నుమాయిష్. గత ఏడాది కరోనా ప్రభావంతో పూర్తి స్థాయిలో కొనసాగించలేకపోయారు నిర్వాహకులు. 2021లో కూడా కరోనా వల్ల నుమాయిష్ రద్దైంది. మొదటి ఎగ్జిబిషన్ 100 స్టాళ్లతో ప్రారంభం కాగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల ఉత్పత్తులకు వేదికగా నుమాయిష్ నిలుస్తోంది. దాదాపు 2600 స్టాళ్లను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. వీటిలో తినుబండారాల నుంచి అన్ని రకాల దుకాణాలు ఉంటాయి.
నుమాయిష్ ఆధ్వర్యంలో 19 విద్యాసంస్థలు
హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ అనేది కంపెనీ యాక్ట్ కింద రిజిస్టర్ అయిన లాభాపేక్ష లేని సంస్థ. ప్రస్తుతం తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు దీనికి అధ్యక్షుడిగా ఉన్నారు. ప్రతిసారి మంత్రి లేదా స్పీకర్ దీనికి అధ్యక్షుడిగా ఉంటారు. దీని ఆధ్వర్యంలో 19 విద్యాసంస్థలు కూడా ఉన్నాయి. నుమాయిష్ వల్ల 30 వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతోంది. దీని వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి లభిస్తోంది. ఏటా 25 లక్షల మంది నుమాయిష్ను సందర్శిస్తారు. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శనల్లో ఒకటిగా నిలుస్తోంది.
ఏమేం ఉంటాయి ?
నుమాయిష్లో జమ్ముకశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలోని ప్రముఖ కంపెనీలు, స్థానిక సంస్థల ఉత్ప్తులు, హ్యాండీక్రాఫ్ట్స్, చేనేత వస్త్రాలు, ఎలక్ట్రికల్ పరికరాలు, తినుబండారాలు సహా అన్ని రకాలు స్టాళ్లను ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఇరాన్ కార్పెట్లు, టర్కీ దుప్పట్లు, బంగ్లాదేశ్ వస్త్రాలు కూడా నుమాయిష్లో లభిస్తాయి. చిన్న పిల్లలకు వినోదానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఉంటాయి. జాయింట్ వీల్స్, చిల్డ్డ్రన్ ట్ట్రైన్ లాంటివి ఇక్కడికి వచ్చే పిల్లలను ఆకర్షిస్తుంటాయి.
నుమాయిష్ టైమింగ్స్ ఇవే ?
జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నుమాయిష్ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. మద్యాహ్నం 3.30 నుంచి రాత్రి 10.30 వరకు తెరిచి ఉంటుంది. ఎంట్రీ ఫీజు పెద్దవారికి రూ.40. ఐదేళ్లలోపు పిల్లలకు ఉచిత ప్రవేశం. నుమాయిష్ కోసం హైదరాబాద్ నలుమూలల నుంచి ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసింది. నుమాయిష్ ఎగ్జిబిషన్ కోసం మెట్రో రైలు టైమింగ్స్ కూడా మార్చారు. మెట్రో సర్వీసుల సమయాన్ని రాత్రి 12 గంటల వరకు పొడిగించారు. మియాపూర్-ఎల్బీనగర్, నాగోల్-రాయదుర్గం కారిడార్లలో ఈ వెసులుబాటు ఉంటుందని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
Read More Articles:
Kajal Aggarwal | అమ్మో.. రీఎంట్రీలో కూడా కాజల్ అగర్వాల్ అంత డిమాండ్ చేస్తుందా?
Aadi Saikumar | వరుస ఫ్లాప్స్ వచ్చినా కూడా ఆదికి వరుస ఆఫర్లు ఎలా వస్తున్నాయి?