Adipurush | జై శ్రీరాం.. ఈ మాట ఎక్కడ వినబడినా… రామాయణం ఎక్కడ పారాయణం చేసినా అక్కడ హనుమంతుడు అక్కడికి వస్తాడు. తన గుండెల్లో ఉన్న రాముడిని తలచుకుంటూ పులకించిపోతాడు. ఇదే విషయాన్ని తాజాగా ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ కూడా చెప్పాడు. రామకథతో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమాను చూసేందుకు కూడా అంజనీపుత్రుడు వస్తాడని.. ఆయన కోసం ప్రతి థియేటర్లో ఒక సీటు వదిలేయాలని రిక్వెస్ట్ చేశాడు. అప్పట్నుంచి ఈ విషయం ట్రెండింగ్లోనే ఉంది. మొదట్లో హనుమంతుడి పక్క సీటుకు డబుల్ రేట్ అంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఏమో అసలు హనుమంతుడి సీటు ఎలా ఉంటుంది? దాన్ని ఎలా అలంకరిస్తారనే ఉత్కంఠ అందరిలోనూ ఉండిపోయింది. ఈ ఉత్కంఠకు తెరపడింది. ఆదిపురుష్ సినిమా విడుదలైంది.
ఆదిపురుష్ సినిమా చూసేందుకు ప్రీమియర్ షోల నుంచే ప్రేక్షకులు ఎగబడ్డారు. రామకథను చూసేందుకు వచ్చిన ఆడియన్స్ థియేటర్లను మినీ సైజ్ ఆలయాలల మార్చేశారు. ముఖ్యంగా హనుమంతుడి సీటును మరింత ప్రత్యేకంగా అలంకరించారు. ఆ సీటుపై కాషాయ వస్త్రం కప్పేశారు. కొన్ని చోట్ల హనుమంతుడి విగ్రహాన్ని ఉంచారు. పూల మాలలు వేసి ప్రత్యేక పూజలు కూడా చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఇదిలా ఉంటే ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలో వచ్చిన ఆదిపురుష్ సినిమాకు ప్రీమియర్ షో నుంచే అదిరిపోయే టాక్ వస్తోంది. బాహుబలి తర్వాత సరైన హిట్ లేక సతమతమవుతున్న ప్రభాస్.. ఆదిపురుష్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.