Home Latest News India Vs Sri Lanka | శ్రీలంకతో నిర్ణయాత్మక పోరు.. మూడో T20లో భారత్‌ గొప్ప...

India Vs Sri Lanka | శ్రీలంకతో నిర్ణయాత్మక పోరు.. మూడో T20లో భారత్‌ గొప్ప ప్రదర్శన చేస్తుందా.. టీమిండియా బలాలు, బలహీనతలేంటి?

Image Source : Indian Cricket Team facebook

India Vs Sri Lanka | రాజ్‌కోట్‌: భారత పర్యటనకు ముందు శ్రీలంకతో పోలిస్తే టీమ్‌ ఇండియానే ఫేవరేట్‌. దూకుడైన ఆటగాళ్లు, జట్టంతా యువరక్తం, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య, అర్ష్‌దీప్‌ సింగ్‌ గొప్ప ఫామ్‌లో ఉండడం, దానికి తోడు సొంత మైదానాల్లో ఆడుతుండడం ఇలా ఎలా చూసినా భారత్‌ మెరుగైన ప్రదర్శన చేస్తుందనిపించింది. తీరా చూస్తే తొలి మ్యాచ్‌లో భారత్‌ చావు తప్పి కన్నులొట్ట పోయినట్లుగా చివరి బంతికి గెలిచింది. ఇక రెండో మ్యాచ్‌లో తొలుత బౌలింగ్‌లో విఫలమైన భారత్‌.. బ్యాటింగ్‌లో టాప్‌ ఆర్డర్‌ ఘోర వైఫల్య ప్రదర్శనతో 16 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 57 పరుగులకే టాప్‌ ఆర్డర్‌ను కోల్పోయి ఘోర పరాజయం చవిచూస్తుందని భావించినప్పటికీ సూర్యకుమార్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌ దూకుడు ఆటతో విజయతీరాలవైపు వెళ్లి బోల్తా పడింది. శ్రీలంకతో పోల్చి చూస్తే ఏరకంగా టీమ్‌ఇండియా ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. మూడు మ్యాచ్ల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఈ రోజు రాజ్‌కోట్‌ వేదికగా జరిగే మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే వారు కప్పు గెలుస్తారు. రాత్రి 7 గంటల నుంచి మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో భారత్‌ బలాలు, బలహీనతలపై ఓ లుక్కేద్దాం..!

సీనియర్లు లేని వేళ.


సీనియర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, భువనేశ్వర్‌, బుమ్రా, జడేజాలు లేని జట్టును బీసీసీఐ ప్రకటించింది. తొలిసారి హార్దిక్‌ పాండ్యకు పూర్తిస్థాయి నాయకత్వం అప్పగించింది. జట్టంతా యువ రక్తమే. అయినప్పటికీ హార్దిక్‌ అండగా సూర్యకుమార్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ ఇటీవల సూపర్‌ ఫామ్‌లో ఉండడంతో జట్టుపై భారీ ఆశలు నెలకొన్నాయి. అయితే తొలి మ్యాచ్‌ ఫలితంతో జట్టుపై నీలినీడలు కమ్ముకున్నాయి. తొలుత బ్యాటింగ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌, శుబ్‌మన్ గిల్‌, సంజు శాంసన్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఇషాన్‌ కిషన్‌, దీపక్‌ హుడా, హార్దిక్‌, అక్షర్‌ పటేల్‌ రాణించినప్పటికీ భారీ స్కోర్‌ చేయలేకపోయారు. ఇక బౌలింగ్‌ విషయానికొస్తే మరీ నాసిరకంగా ప్రదర్శన సాగింది. అక్షర్‌ పటేల్‌, హర్షల్‌ పటేల్‌, యజువేంద్ర చాహల్‌ ధారళంగా పరుగులు ఇచ్చారు. కొత్త కుర్రాడు శివమ్‌ మావి నాలుగు వికెట్ల తీయడమే ఈ మ్యాచ్‌లో చెప్పుకోదగింది.

బౌలర్లు పుంజుకునేనా?


ఇక రెండో మ్యాచ్‌లో భారత్‌ ప్రదర్శన ఘోరంగా సాగింది. భారీగా పరుగులు ఇచ్చిన హర్షల్‌ పటేల్‌ స్థానంలో అర్ష్‌దీప్‌ సింగ్‌ అత్యంత చెత్త ప్రదర్శన చేశాడు. రెండో ఓవర్‌ వేసిన అతడు వరుసగా మూడు నోబాల్స్‌తో పాటు 19 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో మరోసారి అర్ష్‌దీప్‌నకు బంతిని ఇచ్చేందుకు సందేహించిన కెప్టెన్‌ 19 ఓవర్‌కు గానీ బంతిని ఇవ్వలేదు. అప్పటికే ఆత్మవిశ్వాసం కోల్పోయిన అర్ష్‌దీప్‌ ఆ ఓవర్‌లోనూ రెండు నోబాల్స్‌ వేయడమే కాకుండా 18 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇక తొలి మ్యాచ్‌లో ఉత్తమ ప్రదర్శన చేసిన యువ ఆటగాడు శివమ్‌ మావి రెండో మ్యాచ్‌లో తేలిపోయాడు. నాలుగు ఓవర్లలో ఏకంగా 53 పరుగులు ఇచ్చుకున్నాడు. మరో యువ ఆటగాడు ఉమ్రాన్‌ మాలిక్‌ 3 వికెట్లు తీసినప్పటికీ ధారాళంగా పరుగులు ఇచ్చాడు. నాలుగు ఓవర్లలో 48 పరుగులు సమర్పించుకున్నాడు. సంచలన ప్రదర్శనలకు మారు పేరుగా ఉన్న స్పిన్నర్‌ యజువేంద్ర చాహల్‌ రెండు మ్యాచ్‌ల్లోనూ నిరాశపరిచాడు. దీంతో భారత్‌ బౌలింగ్‌పై ఒకింత ఆందోళనగానే ఉంది. ఈ మ్యాచ్‌లో బౌలర్లు పుంజుకుంటేనే భారత్‌ గెలుపు అవకాశాలు మెరుగవుతాయి. ఈ మ్యాచ్‌లో అక్షర్‌ పటేల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ బ్యాటింగ్‌ ప్రదర్శనే సానుకూలంశం. మరోసారి వీరి నుంచి భారీ ప్రదర్శనను అభిమానులు ఆశిస్తున్నారు.

ఓపెనింగ్‌ జోడీకి ఏమైంది?


ఇక భారత్‌ను తీవ్రంగా వేదిస్తున్న మరో సమస్య ఓపెనింగ్‌. రెండు మ్యాచ్‌ల్లోనూ ఓపెనింగ్‌ జోడీ ఇషాన్‌-శుబ్‌మన్‌ భాగస్వామ్యం 27, 12 పరుగులుగా ఉంది. ఇటీవల జట్టులోకి వచ్చిన శుబ్‌మన్‌ గిల్‌ రెండు మ్యాచ్‌ల్లోనూ సింగిల్‌ డిజిట్‌కు పరిమితమయ్యాడు. దీంతో మూడో మ్యాచ్‌లో ఆడడం సందేహంగా మారింది. ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్య, దీపక్‌ హుడా తొలి రెండు మ్యాచుల్లో ఫర్వాలేదనిపించినప్పటికీ రెండో మ్యాచ్‌లో విఫలమయ్యారు. కొత్తగా వచ్చిన రాహుల్‌ త్రిపాఠి సైతం అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ అక్షర్‌ పటేల్‌ ఇటు బంతితోనూ, బ్యాటింగ్‌లో సైతం మెరుపు ప్రదర్శనలు చేశాడు. ఇక భారీ ఆశలు పెటుకున్న సూర్యకుమార్‌ యాదవ్‌ రెండో మ్యాచ్‌తో ఫామ్‌లోకి రావడం కొంత సానుకూలాంశం. ఇక భవిషత్య్‌ కెప్టెన్‌ భావిస్తున్న హార్దిక్‌ పాండ్య నుంచి అభిమానులు భారీ ఇన్నింగ్స్‌ను ఆశిస్తున్నారు.

జట్టులో పలువురి మార్పు?


ఇక తొలి రెండు మ్యాచ్‌ల్లాగే నిర్ణయాత్మక పోరులో భారత్‌ ప్రదర్శన ఇలాగే ఉంటే కప్పు కోల్పోయినట్లే. దానికి తోడు వన్డే సిరీస్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. రాజ్‌కోట్‌ మైదానం బ్యాటింగ్‌ పిచ్‌ కావడంతో ఇరు జట్ల బ్యాటర్లు చెలరేగే అవకాశం ఉంది. గతంలో నాలుగు సార్లు ఇక్కడ టీ20 మ్యాచ్‌లు జరగగా తొలుత బ్యాటింగ్‌ చేసిన జట్టు రెండు సార్లు, తొలుత బౌలింగ్‌ చేసిన జట్టు రెండు సార్లు విజయం సాధించాయి. ఇక మూడో మ్యాచ్‌లో భారత్‌ పలు మార్పులతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. అర్ష్‌దీప్‌, హర్షల్‌ పటేల్‌లో ఒకరికే అవకాశం లభించవచ్చు. ఇక స్పిన్నర్‌ యజువేంద్ర చాహల్‌ స్థానంలో స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ను తీసుకునే అవకాశం ఉంది. దీంతో లోయర్‌ ఆర్డర్‌ సైతం బలోపేతమవుతుంది. ఇక ఓపెనింగ్‌లో విఫలమవుతున్న శుబ్‌మన్‌ స్థానంలో రుతురాజ్‌ గైక్వాడ్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

ఇక శ్రీలంక విషయానికోస్తే ఇటీవల ఆసియా కప్‌ నుంచి మంచి ప్రదర్శనలు చేస్తున్న ఆ జట్టులో పలువురు ఆటగాళ్లు కీలకంగా మారారు. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్‌ శనక ఉత్తమమైన ఫామ్‌లో ఉన్నాడు. తొలి మ్యాచ్‌లో 45 పరుగులు చేసిన దసున్‌ శనక, రెండో మ్యాచ్‌లో అర్ధసెంచరీతో పాటు 2 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మెండిస్‌, అసలంక, రజిత సైతం మంచి ప్రదర్శన చేశారు.

Follow Us : FacebookTwitter

Read More Articles:

Viral News | నాకు కేన్సర్ అని అమ్మానాన్నలకు చెప్పొద్దు ప్లీజ్.. డాక్టర్‌ను వేడుకున్న ఆరేళ్ల బాలుడు.. కన్నీరు పెట్టిస్తున్న వైద్యుడి ట్వీట్!

Ayodhya Ram Mandir | అయోధ్య రామ మందిరంలోకి భక్తులను ఎప్పుడు అనుమతిస్తారు ? ఆలయ విశేషాలేంటి.. శిల్పులు ఎవరు ?

Telangana Tourist Places | తెలంగాణలోని ఈ ఆలయంలో 700 ఏళ్లుగా వెలుగుతున్న అఖండజ్యోతి.. గంభీరావుపేటలోనే

Peddagattu lingamanthula jathara | తెలంగాణలో జరిగే రెండో అతిపెద్ద జాతర ఇదే.. పెద్దగట్టు జాతర ప్రత్యేకత ఏంటి ? ఎలా వెళ్లాలి ?

Chitragupta Temple | హైదరాబాద్‌లో మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో చిత్రగుప్తుడి ఆలయం.. ఎక్కడ ఉందో తెలుసా?

Swap village | ఆరు నెలలకు ఒకసారి దేశం మారే దీవి.. ఈ వింత మీకు తెలుసా !!


Exit mobile version