YSRCP | సొంత పార్టీ అధిష్ఠానంపై గత కొంతకాలంగా దిక్కార స్వరం వినిపిస్తున్న మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా.. ఎమ్మెల్యే ఎందుకు అయ్యానా అని బాధపడుతున్నా అంటూ వ్యాఖ్యానించారు. పది మంది రౌడీలను వెంటేసుకుని తిరగడం చేతకాక పాత తరం నాయకుడిగానే మిగిలిపోయానంటూ బాధపడ్డారు. మైలవరం మండలంలో సొసైటీ భవన శంకుస్థాపనలో పాల్గొన్న ఆయన తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు.
గత 55 ఏళ్లుగా తమ కుటుంబం రాజకీయాల్లోనే ఉందని, తాను కూడా పుట్టినప్పటి నుంచి రాజకీయాల్లోనే ఉన్నానని అన్నారు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు రాజకీయాలు పూర్తిగా మారిపోయాయంటూ వ్యాఖ్యానించారు. నలుగురు రౌడీలను వెంటేసుకుని తిరిగే రాజకీయాలు చేయలేకపోతున్నానని అన్నారు. రౌడీల్లా, పోరంబోకుల్లా ప్రవర్తిస్తేనే ఇప్పుడున్న రాజకీయాల్లో నిలబడగలమన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో పెద్దరికం పనికిరాదని, అందుకే తాను పాత తరం నాయకుడిగా మిగిలిపోయనంటూ బాధపడ్డారు.
సామాన్యులకు కూడా కొన్నిసార్లు సాయం చేయలేకపోతున్నానని వ్యాఖ్యానించారు. ఒక్కోసారి అసలు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా అనిపిస్తుందన్నారు. ఎమ్మెల్యేగా ఎందుకు అయ్యానా అని బాధపడుతున్నానని అన్నారు. గత మూడున్నర ఏళ్లలో తానెక్కడా అక్రమ కేసులు పెట్టించలేదని, ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు బనాయించడం తనకు చేతకాదు అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసుల విషయంలో తమ పార్టీ నాయకులకు తనపై అసంతృప్తి ఉండొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వైసీపీలో జరుగుతున్న పరిణామాలతో కలత చెంది గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిలిపివేశారు.
ప్రమాదవశాత్తు ఘటన జరిగితే రాజకీయ కక్ష సాధింపులా?
ఇటీవలే గుంటూరు టీడీపీ అధినేత చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు ఎన్ఆర్ఐ ఉయ్యూరు శ్రీనివాస్ కారణమంటూ వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. పోలీసులు కూడా ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ శ్రీనివాస్ను అరెస్టు చేశారు. దీనిపై వసంత కృష్ణ ప్రసాద్ స్పందించారు. ఉయ్యూరు శ్రీనివాస్కు మద్దతుగా నిలిచారు. శ్రీనివాస్ మంచి వ్యక్తి అని.. ఇలా ఇష్టానుసారం వ్యవహరిస్తే సేవ చేయాలనుకున్న ఎన్ఆర్ఐలు వెనకడుగు వేస్తారని అన్నారు. శ్రీనివాస్ మంచి మనసున్న వ్యక్తి అని.. తనకు స్నేహితుడని, జీవితంలో కష్టపడి పైకి వచ్చాడని అన్నారు. ఇలా సేవా కార్యక్రమాలు చేసిన వాళ్లను వేధిస్తే భవిష్యత్తులో సేవ చేసేందుకు కూడా ఎవరూ ముందుకు రారు అంటూ వ్యాఖ్యానించారు. ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనపై రాజకీయం చేసి కక్ష సాధింపులకు పాల్పడటం సరికాదని విమర్శించారు. వసంత కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యలు వైసీపీలో ఒక్కసారిగా కలకలం సృష్టించాయి.
Follow Us : Google News, Facebook, Twitter
Read More: