Roja Vs Nagababu | ఇద్దరు జబర్ధస్త్ మాజీ జడ్జిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు జబర్ధస్త్ షోను మించి పంచ్లు వేసుకుంటున్నారు. పర్యాటక శాఖ మంత్రి అంటే నువ్వు పర్యటనలు చేయడం కాదు.. పర్యాటక శాఖను ఎలా అభివృద్ధి చేయాలో చూడాలి అంటూ రోజాపై నాగబాబు మాటల తూటాలు పేల్చారు. దీనికి రోజా కూడా నాగబాబుకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మీ జనసేన పార్టీ వాళ్లను సంకరజాతి, అలగా జనం అని హీనంగా మాట్లాడినప్పుడు లేవని నోరు.. ఇప్పుడెందుకు లేస్తుందో పైవాడికే తెలియాలి అంటూ నాగబాబును ఉద్దేశించి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓడిపోయిన మీరే అన్ని మాటలు అంటే.. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేను ఎంత అనాలి అంటూ నాగబాబుపై మండిపడ్డారు.
రోజా నోటికి.. మున్సిపాలిటీ కుప్పతొట్టికి తేడా లేదు
మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబుపై ఏపీ మంత్రి రోజా మూడు రోజుల క్రితం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సొంత జిల్లాకు కూడా ఏం చేయాలేకపోయారు కాబట్టే ముగ్గురూ సొంత జిల్లాలో పోటీ చేసి ఓడిపోయారని రోజా ఎద్దేవా చేశారు. దీనిపై నాగబాబు రియాక్టయ్యారు. నువ్వు ఇన్ని రోజులు మా అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి నోటికొచ్చినట్లు వాగినా.. నేను రియాక్ట్ కాకపోవడానికి కారణం ఉందంటూ నాగబాబు సెటైర్లు వేశారు. ” నీ నోటికి మున్సిపాలిటీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదు.. చూస్తా చూస్తా మున్సిపాలిటీ కుప్పతొట్టిని గెలకరు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని పర్యాటక శాఖను ఎలా అభివృద్ధి చేయాలో చూడు” అంటూ నాగబాబు వీడియో విడుదల చేశారు.
పర్యాటక మంత్రి నువ్వు పర్యటనలు చేయడం కాదు
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మీద కొన్ని వేలమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా బతుకున్నారని నాగబాబు గుర్తు చేశారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చాక వారి జీవితాలు మట్టికొట్టుకుపోతున్నాయంటూ రోజాను ఉద్దేశించి విమర్శించారు. నువ్విలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వారి పరిస్థితి మరింత దిగజారిపోతుందంటూ మండిపడ్డారు. ముందు ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా నీ బాధ్యతలు నువ్వు తెలుసుకుంటే మంచిదంటూ రోజాకు హితవు పలికారు. పర్యాటక శాఖ మంత్రి అంటే నువ్వు పర్యటనలు చేయడం కాదు.. పర్యాటక శాఖను ఎలా అభివృద్ధి చేయాలో చూడాలి అంటూ రోజాపై మాటల తూటాలు పేల్చారు నాగబాబు. అంతేకాదు.. భారత దేశ పర్యాటక శాఖ ర్యాంకింగ్స్లో ఉన్న టాప్ 20 స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ 18 వ స్థానంలో ఉందంటూ రోజాను ఉద్దేశించి మాట్లాడారు. మొదటి మూడు స్థానాల్లో కేరళ, అస్సాం, గుజరాత్లు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ” నువ్వు ఇలాగే నీ బాధ్యతను మర్చిపోయి నోటికొచ్చినట్లు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అతి త్వరలోనే అంటే.. నువ్వు పదవి నుంచి దిగిపోయేలోగా 20 వ స్థానానికి దిగజారే అవకాశం ఉంది” అంటూ రోజాను ఉద్దేశించి మాట్లాడారు.
రోజా రియాక్షన్ ఇది..
తాజాగా ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా దీనిపై మరోసారి నాగబాబుకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఏదైనా విమర్శ చేసేప్పుడు విషయం ఉంటే చేయాలి తప్ప నోటికి ఎంత వస్తే అంత ఫేక్ వార్తలతో దుప్ష్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు. పర్యాటక రంగంలో ఏపీ దేశంలోనే మూడో స్థానంలో ఉందని గుర్తు చేశారు. రాజకీయాల్లో ఉన్న నాగబాబుకు ఆ విషయం కూడా తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
చిరంజీవి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఏం చేశారని రాజకీయంగా ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు కాబట్టి అలా మాట్లాడను అంటూ రోజా వ్యాఖ్యానించారు. గతంలో టీడీపీ, జనసేన మాట్లాడుకున్న మాటల్నే గుర్తు చేస్తే.. నాగబాబుకు ఎందుకు అంత పౌరుషం వచ్చిందో అర్థం కావడం లేదన్నారు. వ్యక్తిగతంగా నాకు ఎవరిమీద శత్రుత్వం లేదంటూనే.. పార్టీ పరంగా, సిద్ధాంత పరంగా వ్యాఖ్యలుంటాయని రోజా అన్నారు. ఈ విషయం నాగబాబు అర్థం చేసకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ” నన్ను అంత మాట అన్నందుకు మిమ్మల్ని కూడా కూడా ఓ మాట అనొచ్చు. కానీ నా సంస్కారం అడ్డొచ్చింది. అంతే. చివరగా ఒక్క మాట.. ఆనాడు మీ పార్టీ వాళ్లను సంకరజాతి, అలగా జనం అని అంత హీనంగా మాట్లాడినప్పుడు లేవని నోరు ఇప్పుడెందుకు లేస్తుందో పైవాడికే తెలియాలి. ఓడిపోయిన మీరే అన్ని మాటలు అంటే.. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేను ఎంత అనాలి. రాజకీయ విమర్శలు తప్ప వ్యక్తిగత విమర్శలు చేయడం నాకిష్టం లేక మిమ్మల్ని ఆ మాట అనలేక వదిలేస్తున్నా. ముందు మహిళను ఎలా గౌరవించాలో తెలుసోండి” అంటూ నాగబాబుపై తీవ్రస్థాయిలో రోజా మండిపడ్డారు.
Read More Articles:
Temples | ఆలయాల్లోని గుండాల్లో,నదుల్లో నాణేలను ఎందుకు వేస్తారో తెలుసా? ఇలా వేయడం మంచిదేనా..?
Telangana Tourist Places | తెలంగాణలోని ఈ ఆలయంలో 700 ఏళ్లుగా వెలుగుతున్న అఖండజ్యోతి.. గంభీరావుపేటలోనే