Minister KTR | టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తొలిసారిగా స్పందించారు. ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. ఏడు భాషల్లో ఒకేసారి పరీక్షలు నిర్వహించిన ఘనత గల టీఎస్పీఎస్సీకి ఇద్దరు వ్యక్తుల వల్ల చెడ్డ పేరు వచ్చిందని అన్నారు. గత ఎనిమిదేండ్లలో 155 నోటిఫికేషన్లతో 37వేల ఉద్యోగాలు భర్తీ చేశామని.. ఆ నియామకాల్లో ఒక్కదానిపై కూడా అవినీతి ఆరోపణలు రాలేదని గుర్తు చేశారు. ఇప్పుడే ఇలా ఎందుకు జరిగిందో అందరూ లోతుగా ఆలోచించాలని సూచించారు. ఇది కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే చేసిన తప్పు అని.. దీన్ని మొత్తం వ్యవస్థకు ఆపాదించడం సరికాదని సూచించారు. ఈ లీకేజీ వెనుక ఎంతమంది ఉన్నా సరే వదిలే ప్రసక్తే లేదని.. వారందరినీ కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కొత్త సంస్కరణలు తీసుకొస్తామని చెప్పారు.
ఫీజు కట్టక్కర్లేదు
పరీక్ష రద్దయితే అభ్యర్తులు అనుభవించే బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని మంత్రి కేటీఆర్ అన్నారు. ఒక పరీక్షపై అనుమానం వచ్చినప్పుడు వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. ఇది అభ్యర్థులకు కూడా మచ్చగా ఉంటుందని, అందుకే పరీక్షలను రద్దు చేశామని తెలిపారు. ఈ విషయాన్ని పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని కోరారు. రద్దైన పరీక్షలను వీలైనంత తొందరగా నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షలు రద్దయినందుకు అభ్యర్థులు ఆందోళన చెందవద్దని.. వాళ్లందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. పరీక్ష రద్దు అభ్యర్థుల తప్పు కాదని.. మళ్లీ పరీక్ష రాసేందుకు ఉద్యోగార్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారందరూ మళ్లీ పరీక్ష రాయొచ్చని తెలిపారు. అభ్యర్థులపై ఆర్థిక భారం పడొద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. స్టడీ మెటీరియల్ అంతా కూడా ఆన్లైన్లో ఉచితంగా అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సర్కిల్స్ను 24 గంటలు అందుబాటులో ఉండటంతో పాటు ఉచిత భోజన వసతి కల్పిస్తామని భరోసా ఇచ్చారు. బయట జరుగుతున్న ప్రచారంపై నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
బీజేపీపైనే అనుమానాలు
పేపర్ లీకేజీపై ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతను రెచ్చగొట్టే విధంగా కొందరు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.రాజకీయ నిరుద్యోగులు, బేహారీలు చేసే వ్యాఖ్యలు పట్టించుకోవద్దని యువతకు సూచించారు. పేపర్ లీకేజీ వెనుక రాజకీయ కుట్ర కుణం ఉందని.. బీజీపీపై తమకు అనుమానం ఉందని తెలిపారు. నోటిఫకేషన్లపై బండి సంజయ్ ఆరోపణలు చేయటంలో కుట్ర కోణం ఉందని పేర్కొన్నారు. ఆరు ఏడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని.. ఎవరు ఏంటో ప్రజలే తేలుస్తారని అన్నారు. అసలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న వారికి ఐటీ మంత్రి ఏం పనిచేస్తాడో తెలుసా? అని ప్రశ్నించారు. అది తెలిస్తే ఇలాంటి డిమాండ్లు చేయారని అన్నారు. ఇప్పటివరకు గుజరాత్లో 8 పేపర్లు లీక్ అయ్యాయి.. అక్కడ ఐటీ శాఖ మంత్రిని బర్తరఫ్ చేశారా? అని నిలదీశారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Allu Arjun | అల్లు అర్జున్ ట్విట్టర్లో నన్ను బ్లాక్ చేశాడు.. వైరల్గా మారిన వరుడు హీరోయిన్ ట్వీట్
Viral News | డంప్ యార్డులో అగ్ని ప్రమాదం.. రూ.100 కోట్ల ఫైన్ వేసిన ఎన్జీటీ
Naveen Murder Case | నవీన్ మర్డర్ కేసులో కీలక మలుపు.. జైలు నుంచి నిహారిక విడుదల