Harish Rao | కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. కరోనా పట్ల ఆందోళన అవసరం లేదంటూనే తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. మాస్కులు ధరించడంతో పాటు వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని సూచించారు. ప్రతిఒక్కరూ బూస్టర్ డోసు వేసుకోవాలన్నారు.
చైనా సహా పలు దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా కరోనా సన్నద్ధతపై అధికారులతో హరీశ్రావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అంతకుముందు వివిధ రాష్ట్రాల్లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 వ్యాప్తి, ప్రభావం గురించి అధికారులు మంత్రికి వివరించారు.
కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హరీశ్ రావు విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాప్తి రాష్ట్రంలో పెద్దగా లేనప్పటికీ మందులు, ఆక్సీజన్, వెంటిలేటర్లు, ఐసీయూ బెడ్లు, తగినంత వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. కరోనా పాజిటీవ్ వచ్చిన శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం గాంధీకి పంపాలని సూచించారు.
Read More Articles |