Minister KTR | ప్రగతి భవన్ను పేల్చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో దుమారం రేపుతున్నాయి. తాజాగా ఈ అంశంపై అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. ప్రగతి భవన్ ను పేల్చివేయాలని రేవంత్ రెడ్డి అన్న మాటలు చాలా దుర్మార్గమని మండిపడ్డారు. ఇదేనా కాంగ్రెస్ పార్టీ విధానం.. రాష్ట్ర అధ్యక్షులు ఇలా అనొచ్చా అంటూ ఫైర్ అయ్యారు. మీ పార్టీ అధ్యక్షుడుకి మీకు శృతి ఉందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రగతి భవన్లో ఎవరు ఉంటారనే విచక్షణ కూడా మీకు లేదా? అంటూ రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటే వారే అక్కడ ఉంటారని పేర్కొన్నారు. ఎప్పుడూ ఇది తేసేయాలి.. అది పేల్చేయాలని అనడం తప్ప ఇంకేమైనా మంచి మాట్లాడతారా అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ దుర్మార్గంగా మాట్లాడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతి భవన్ను బద్దలు కొడతా అని అనొచ్చా అంటూ ప్రశ్నించారు. పేల్చేయండి అనొచ్చా అని మండిపడ్డారు. ఇదేనా కాంగ్రెస్ విధానం అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ధరణి రద్దు చేస్తానని అక్కడ పీసీసీ చీఫ్ చెప్తారు. ఇక్కడేమో అలా అనలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు చెప్తారంటూ తీవ్రంగా మండిపడ్డారు. శ్రీధర్ బాబు మంచోడే… కానీ సహవాస దోషం ఏమో అని ఎద్దేవా చేశారు. శ్రీధర్ అన్న, భట్టి అన్న మంచోల్లు అంటూ మంత్రి మాట్లాడిన మాటలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఆర్టీఐతో దందాలు చేస్తున్న రేవంత్ రెడ్డి : కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ నేతలు బయట అరాచకంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల పార్టీ అధ్యక్షుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ను.. రైట్ టు ఇన్కమ్ యాక్ట్ గా మార్చుకున్నారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఆర్టీఐ పేరు మీద అడ్డగోలుగా దందాలు చేస్తారని ఆరోపించారు. హైదరాబాద్ రంగారెడ్డి భూముల పైన వాళ్ల పార్టీ అధ్యక్షుడు ఒక దఫ్తర్ నడుపుతున్నారని మంత్రి తీవ్రంగా ఆరోపణలు గుప్పించారు. ఇక కేంద్ర మంత్రి పై కేటీఆర్ విరుచుకుపడ్డారు.
శ్రీధర్బాబు, కేటీఆర్ మధ్య మాటల యుద్ధం
బడ్జెట్ సమావేశాల్లో మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మధ్య పెద్ద మాటల యుద్ధమే నడిచింది. ధరణి పోర్టల్ విషయంలో వీరిద్దరి మధ్య కాసేపు వాదన నడిచింది. కాంగ్రెస్ సభ్యుడైన దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ రైతుల పాలిట శాపంగా మారుతోందని అన్నారు. కొందరి ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, రైతులు గందరగోళంలో ఉన్నారని అన్నారు. ధరణి పోర్టల్ ను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని తేల్చి చెప్పారు. ఆ వెంటనే శ్రీధర్ బాబు వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ధరణి పోర్టల్ విషయంలో కాంగ్రెస్ పార్టీ సమస్యలను ఎత్తి చూపాలని చెప్పారు. అందులో లోపాలు ఉంటే సరి చేస్తామని చెప్పారు. అంతేకానీ.. ధరణి పోర్టల్ మొత్తాన్ని తొలగించబోమని తేల్చి చెప్పారు. ధరణి పోర్టల్ వల్ల రైతులు సంతోషంగా ఉన్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. గత ఆరేళ్లలో 30 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయితే, ఈ ఏడాదిన్నర కాలంలోనే 23 లక్షల 92 వేల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయని చెప్పారు. అన్ని సవ్యంగా జరిగితే ఎవరూ మాట్లాడరని, ఎక్కడో ఒక చిన్న లోపం జరిగితే భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారని అన్నారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
TSRTC | పెళ్లిళ్ల సీజన్లో టీఎస్ ఆర్టీసీ అదిరిపోయే ఆఫర్!
Ponguleti | దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయ్.. పొంగులేటికి తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ సవాలు