Teachers Transfers | రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ ద్వారా టీచర్లకు తమ సొంత ప్రాంతాలకు ట్రాన్స్ఫర్స్ పెట్టుకుంటున్నారు. ఇలా అందరూ తమకు నచ్చిన ప్రాంతానికి వెళ్లిపోతే మారుమూల ప్రాంతాల్లోని పల్లె బడుల్లో టీచర్లు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తమవుతోంది. దీనిపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. టీచర్ల బదిలీలతో పాఠశాలలు ఖాళీ అయ్యే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఒకవేళ పాఠశాలల్లో పూర్తిస్థాయి ఉపాధ్యాయులు ట్రాన్స్ఫర్ అయి.. కొత్త టీచర్లు రాని పరిస్థితుల్లో బదిలీ అయిన టీచర్లను రిలీవ్ చేయమని తెలిపారు. కొత్త టీచర్లు వచ్చేదాకా వాళ్లు అక్కడే విధుల్లో కొనసాగాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉపాధ్యాయుల బదిలీలపై శాసన మండలిలో విపక్షాలు పలు అంశాలను లేవనెత్తాయి. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సైతం దీనిపై జోక్యం చేసుకున్నారు. జీవో నంబర్ 317లో భాగంగా చాలామంది టీచర్లకు పల్లె బడుల్లో పోస్టింగ్లు ఇచ్చారని గుర్తు చేశారు. తాజా బదిలీల కారణంగా ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఏర్పడే ప్రమాదం ఉందని ప్రస్తావించారు. దీనిపై స్పందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. రాష్ట్రంలో ఎక్కడా కూడా టీచర్ లేని పాఠశాలలు ఉండకూడదనే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
Follow Us : Google News, Facebook, Twitter