Telangana Congress | తెలంగాణ కాంగ్రెస్లో కొత్తగా ఏర్పాటైన కమిటీలు చిచ్చురేపాయి. తీవ్రస్థాయిలో తిరుగుబాటు స్వరం మొదలైంది. అసలైన కాంగ్రెస్ నేతలం మేమేనంటూ సీనియర్లు స్వరం పెంచేశారు. పార్టీలో వలస నేతల పెత్తనాలు ఎక్కువయ్యాయంటూ మాటల తూటాలు పేల్చారు. పరోక్షంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ( Revanth Reddy )పై విమర్శల దాడికి దిగారు. వలస వచ్చిన నేతలను కమిటీల్లో నింపేస్తున్నారని, అసలైన కాంగ్రెస్ నేతలకు అన్యాయం చేస్తున్నారని వాపోయారు. కమిటీల్లో సరైన సీనియర్ నేతలకు ప్రాధాన్యమే లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీని బతికించుకునే బాధ్యత కూడా మాదేనంటూ సీరియస్ అయ్యారు. ఈసారి ఢిల్లీ వెళ్లి అటో ఇటో తేల్చుకుంటామనేదాక పరిస్థితి వచ్చేసింది. దీంతో కాంగ్రెస్లో అసంతృప్తి ఎటు వెళ్లి ఎవరి కొంప ముంచేస్తాయో అని టీ కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ( Bhatti vikramarka ) నివాసంలో శనివారంనాడు టీ కాంగ్రెస్ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Uttam kumar reddy ), మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, మధుయాష్కీ, జగ్గారెడ్డి, కోదండరెడ్డి, మహేశ్వర్ రెడ్డి, ప్రమ్సాగర్ సహా పలువురు సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని రక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీల్లో చాలా అన్యాయం జరిగిందని చాలా నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. వారి అభిప్రాయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళతామన్నారు. సేవ్ కాంగ్రెస్ కార్యక్రమం పేరుతో ముందుకు సాగాలని సీనియర్ నాయకులంతా తన దృష్టికి తీసుకొచ్చారని భట్టి అన్నారు. కొందరు బలమైన నేతలు కావాలనే పార్టీకి నష్టం చేకూర్చేలా ప్రవర్తిస్తున్నారని అన్నారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం వచ్చిందంటూ పరోక్షంగా రేవంత్ రెడ్డిపై నిరసన స్వరం వినిపించారు. తమ పంచాయతీ అంతా ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు వలస వచ్చిన వాళ్లకు మధ్యేనంటూ బాంబు పేల్చారు.
మేం చేయలేని పని రేవంత్ చేస్తారా?
మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పార్టీ అని అన్నారు. సేవ్ కాంగ్రెస్ నినాదంతో ముందుకెళతామని స్పష్టం చేశారు. సీనియర్లను అవమానించడానికే కొత్త కమీటీలన్న ఆయన.. కమిటీల్లో 108 మంది ఉంటే.. సగానికి పైగా టీడీపీ నుంచి వచ్చినవాళ్లే ఉన్నారని అన్నారు. సోషల్మీడియాలో సీనియర్లపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అధిష్టానానికి అవగాహన లేకుండానే కొందరు చెబితే కమిటీలు ఏర్పాటు చేశారంటూ విమర్శించారు. పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్లో ఉన్నవాళ్లు చేయలేని పని రేవంత్ చేస్తారా అంటూ ఉత్తమ్ ప్రశ్నించారు. అసలైన కాంగ్రెస్ను కాపాడుకుంటామని, అదే మా లక్ష్యమంటూ ప్రకటించారు. కావాలని సోషల్ మీడియాలో బురద జల్లుతున్నారని, సీఎల్పీ నేతను అవమానిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఉత్తమ్ ధ్వజమెత్తారు.
రేవంత్ సీటుకు ఎసరు?
సీనియర్లను విస్మరించి టీడీపీ నుంచి వచ్చిన వాళ్లకు ప్రాధాన్యం ఇవ్వడం ఏంటని జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఇదే విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళతామన్నారు. టీడీపీ నుంచి వలస వచ్చిన వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చి సీనియర్లను కోవర్డులుగా ముద్ర వేస్తున్నారని విమర్శించారు. వలస వచ్చిన వాళ్ల నుంచి కాంగ్రెస్ను సేవ్ చేయాలని తాము ప్రయత్నిస్తున్నట్లు సీనియర్లంతా ఉమ్మడి ప్రకటన చేశారు. కాంగ్రెస్ను హస్తగతం చేసుకోవాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ వెళ్లి అధిష్ఠానంతో తేల్చుకుంటామన్నారు. మరోవైపు భట్టి విక్రమార్కకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ చేశారు. తన మద్దతు మీకే ఉంటుందని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే రేవంత్ రెడ్డి సీటుకు సీనియర్లంతా కలిసి ఎసరు పెట్టినట్లేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read More Articles |
Harish Rao | బీజేపీ సర్కారు అవార్డులు రద్దు చేసినా చేస్తది.. బీజేపీ తీరుపై హరీశ్ రావు సెటైర్
Bandi Sanjay | తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై బండి సంజయ్ కామెంట్స్.. సిద్ధంగా ఉండాలంటూ నేతలకు సూచన