Ponguleti Srinivas Reddy | ఖమ్మం జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయా ? బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగలబోతుందా ? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాబోయే ఎన్నికల కురుక్షేత్రానికి శ్రీనన్న సిద్ధంగా ఉన్నాడంటూ పొంగులేటి వ్యాఖ్యానించారు. ప్రజల అభిమానాన్ని, దీవెనలను అందుకున్న వాడే నాయకుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఖమ్మం ప్రజలు ఏం కోరుకుంటున్నారో రాబోయే రోజుల్లో అదే జరుగుతుందంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టే ఆయన పార్టీ మారబోతున్నట్లు సంకేతాలు ఇచ్చాడని అభిప్రాయ పడుతున్నారు.
ఇటీవల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం భద్రతను తగ్గించింది. బీఆర్ఎస్కు ఆయన దూరం జరుగుతున్నాడని అభిప్రాయానికి వచ్చిన తర్వాతే భద్రత తగ్గించారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఆయన వ్యాఖ్యలు పార్టీ మారడం ఖాయమన్న సంకేతాలిచ్చినట్లేనని అంటున్నారు. నాలుగున్నర ఏళ్లలో ఏ పదవి లేకపోయినా జనం నుంచి అపూర్వ స్పందన వస్తుందంటూ పొంగులేటి ఇటీవలే వ్యాఖ్యలు చేశారు. అంటే బీఆర్ఎస్లో పదువులు ఇవ్వలేదన్న అసంతృప్తిని ఈ విధంగా వ్యక్తం చేశారని అనుకుంటున్నారు. ఇప్పటికే పొంగులేటి తన అనుచరులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. బీజేపీలో చేరబోతున్నట్లు సంకేతాలు ఇచ్చేశారు. రాష్ట్ర బీజేజీ నేతలు కూడా పొంగులేటి రాకను స్వాగతిస్తున్నారు. పొంగులేటి కోసం కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా రంగంలోకి దిగాడని సమాచారం.
ఈనెల 18 న తెలంగాణ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఖమ్మంలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. జాతీయ స్థాయి నాయకులను ఈ సభకు ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడదే రోజున పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. తద్వారా కేసీఆర్కు షాక్ ఇవ్వాలన్న ఆలోచనలో బీజేపీ అధిష్ఠానం ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమిత్ షా రంగంలోకి దిగారని సమాచారం. ఈనెల 18న ఢిల్లీలో ప్రధాని మోదీ, అమిత్ షాతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది.
ఈ భేటీ అనంతరం ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసే యోచనలో పొంగులేటి ఉన్నట్లు తెలుస్తోంది. అందుకు సిద్ధంగా ఉండాలంటూ ఇప్పటికే అనుచరులకు సంకేతాలిచ్చాడని సమాచారం. ఈనెల 10 నుంచి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పొంగులేటి అనుచరులు విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పొంగులేటితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఖమ్మం జిల్లాలో గట్టి దెబ్బ పడుతుందని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు కూడా గత కొంత కాలంగా బీఆర్ఎస్లో యాక్టీవ్గా లేరు. పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.
Follow Us : Google News, Facebook, Twitter