Dil Raju | ఇప్పుడు నా హవా నడుస్తోంది.. నేను ఎంత చెప్తే అంత అనుకుంటే.. ఏదో ఓ రోజు బొక్క బోర్లా పడక తప్పదు. నీ స్వార్థం కోసం నువ్వు ఒకర్ని ఇప్పుడు నష్టపరిస్తే.. ఆ కర్మ ఫలితం ఏదో రోజు నిన్నే చుట్టుకుంటుంది. ప్రముఖ టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పరిస్థితి చూస్తే ఇప్పుడు ఇది అక్షరాల సత్యమని అనిపించకమానదు. గతంలో తన స్వార్థం కోసం ఆయన చేసిన వ్యాఖ్యలు, పెట్టిన నిబంధనలే ఇప్పుడు ఆయన్ను చిక్కుల్లో పడేశాయి.
ఎగ్జిబిటర్గా కెరీర్ను మొదలుపెట్టిన దిల్ రాజు అంచెలంచెలుగా ఎదుగుతూ నిర్మాతగా మారాడు. ఇప్పుడు టాలీవుడ్లోనే టాప్ ప్రొడ్యూసర్ అయ్యాడు. వందల కోట్లు పెట్టి స్టార్ హీరోలతో సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు. అంతేకాదండోయ్.. నైజాం ఏరియాలోని థియేటర్లను శాసించేస్థాయికి ఎదిగాడు. నైజాం ఏరియాలో థియేటర్లను తన గుప్పిట్లో ఉంచుకున్న దిల్రాజు.. తన సినిమా ఏదైనా వస్తుందంటే చాలా వరకు హాల్స్ను బ్లాక్ చేసుకుంటాడు. వేరే ఈ సినిమాకు కూడా పెద్దగా థియేటర్లు ఇవ్వడని బయట టాక్. దీన్ని కవర్ చేసుకోవడానికి రకరకాల కారణాలను చూపిస్తుంటాడు. 2019 సంక్రాంతికి దిల్ రాజు బ్యానర్లో వచ్చిన ఎఫ్ 2 సినిమా విడుదలైంది. అదే సమయంలో రజినీకాంత్ నటించిన పేట సినిమా కూడా వచ్చింది. కానీ పేట సినిమాకు థియేటర్లు ఇచ్చేందుకు దిల్ రాజు ఒప్పుకోలేదు. అదేంటని అడిగితే.. తెలుగు సినిమాలే ఫస్ట్ ప్రియారిటీ.. ఆ తర్వాతే డబ్బింగ్ సినిమాలు అంటూ చెప్పుకొచ్చాడు.
థియేటర్ల సంగతి పక్కన పెడితే మొన్నటికి మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలను పరిష్కారించాలని అన్ని సినిమాల షూటింగ్లను నిలిపివేశారు. అలాంటి సమయంలో కూడా తమిళ స్టార్ హీరో, తలపతి విజయ్తో దిల్ రాజు తెరకెక్కిస్తున్న ద్విభాషా చిత్రం వారసుడు సినిమా షూటింగ్ చేశారు. అప్పుడు అందరికీ ఒక న్యాయం.. మీకో న్యాయమా అని అందరూ అడిగితే.. ఇది తెలుగు సినిమా కాదు.. తమిళ హీరో నటిస్తున్న తమిళ సినిమా అని చెప్పి అప్పటికప్పుడు తప్పించుకున్నాడు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి సహా అందరూ ఇది తమిళ సినిమానే అని కన్ఫార్మ్ చేశారు. అప్పుడు తన స్వార్థం కోసం చేసిన ఈ వ్యాఖ్యలే దిల్ రాజును ఇరకాటంలో పడేశాయి. వారసుడు సినిమాను వాయిదా వేసుకునేలా చేశాయి.
వారసుడు సినిమాను ప్రకటించినప్పుడే దీన్ని 2023 సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రకటించాడు దిల్ రాజు. అన్నట్టుగానే ఈ సినిమాను జనవరి 11నగ్రాండ్గా రిలీజ్ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేశాడు. ఇందుకోసం నైజాం ఏరియాలో భారీగా థియేటర్లు కేటాయించాలని అనుకున్నాడు. కానీ దిల్ రాజుకు తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ( TFPC ) షాకిచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతికి తెలుగు సినిమాలకే ప్రాధాన్యం ఇవ్వాలని అప్పట్లో దిల్ రాజు అన్న మాటలనే గుర్తు చేసింది. అసలే ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ వీరసింహరెడ్డి చిత్రాలు బరిలో ఉన్నాయి. రెండు భారీ తెలుగు చిత్రాలు లైన్లో ఉండగా.. తమిళ డబ్బింగ్ చిత్రమైన వారసుడు సినిమాకు ఎక్కువ థియేటర్లు ఎలా కేటాయిస్తారని చాలామంది నిర్మాతలు ప్రశ్నించారు. ముందు స్ట్రెయిట్ సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలని.. థియేటర్లు మిగిలితేనే డబ్బింగ్ సినిమాలకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయినా సరే చిరు, బాలయ్య సినిమాల కంటే ముందే తన వారసుడు సినిమాను రిలీజ్ చేసి థియేటర్లను బ్లాక్ చేయాలని అనుకున్నాడు.
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో తన సినిమాను వేసుకుని.. మల్టీప్లెక్స్ల్లో రెండో స్క్రీన్ను చిరంజీవి లేదా బాలయ్య సినిమాకు కేటాయించాలని దిల్ రాజు అనుకున్నట్టు ప్రచారం కూడా జరిగింది. దీనిపై మైత్రీ మూవీ మేకర్స్తో పాటు మిగిలిన నిర్మాతలు అబ్జక్షన్ తెలిపారు. దిల్ రాజు నిర్ణయంపై మెగా ఫ్యాన్స్, నందమూరి అభిమానులు కూడా సీరియస్ అయ్యారు. అయినా చివరి దాకా దిల్ రాజు పట్టువిడవలేదు. ఎలాగైనా అనుకున్న టైమ్కి తన సినిమాను రిలీజ్ చేయాలని భారీగానే ప్లాన్ చేశాడు. కానీ చివరకు టాలీవుడ్ నిర్మాతల ఒత్తిడికి దిల్ రాజు తలొగ్గక తప్పలేదు. సినిమా రిలీజ్కు రెండు రోజుల ముందు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే విషయాన్ని తాజాగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. ఈ సందర్భంగా తన అసహనాన్ని కనిపించకుండా బాగానే ట్రై చేశాడు. కానీ తన మాటల్లో ఇంటెన్షన్ అందరికీ అర్థమైపోయింది. అందరూ తన మీద పడి ఏడుస్తున్నారని.. అందుకే ఇండస్ట్రీ పెద్దల సూచనతో రెండు రోజులు ఆలస్యంగా సినిమాను విడుదల చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. ఇలా దిల్ రాజు వెనక్కి తగ్గడంతో ఆయనపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లు పడక తప్పదు అని కౌంటర్లు వేస్తున్నారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Vaarasudu | వెనక్కి తగ్గిన దిల్ రాజు.. వారసుడు సినిమా రిలీజ్ వాయిదా
Sreemukhi | మరీ ఇంత ఘోరమా.. పెళ్లి వార్తలపై స్పందించిన బుల్లితెర యాంకర్ శ్రీముఖి
Saipallavi | సాయిపల్లవి సినిమాలు మానేస్తుందా? క్లారిటీ ఇచ్చిన నేచురల్ బ్యూటీ