Gadwal Vijayalaxmi | టైం2న్యూస్, వికారాబాద్: హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఆమె సోదరుడు కే. వెంకటేశ్వరరావు, సోదరి కవితారావు భూ వివాదంలో ఇరుక్కున్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మిర్జాపూర్ గ్రామంలో పదెకరాల భూమి విషయంలో 2007 నుంచి గొడవలు ఉన్నాయి. ఇప్పుడా భూమిలో విజయలక్ష్మి కంచె వేస్తుండగా కొందరు రైతులు అడ్డుకున్నారు. ఇదే భూమి విషయంలో 2007లో వెంకటేశ్వర రావు ఇంట్లో ప్రశాంత్ రెడ్డి అనే రియల్టర్ హత్య జరిగింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా, కే. కేశవరావు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో జరిగిన ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది.
అసలు వివాదమేంటి?
మిర్జాపూర్లోని సర్వే నంబర్ 20లో వెంకటేశ్వరరావు 2007లో పదెకరాల భూమి కొనుగోలు చేశారు. ఆ భూమిలో రెండు ఎకరాలు గద్వాల విజయలక్ష్మి, మరో మూడు ఎకరాలు చెల్లెలు కవిత పేరిట పట్టా చేశారు. ఐదెకరాలు వెంకటేశ్వరరావు పేరిటే ఉంది. ఇదే సర్వే నంబర్లో ఆ గ్రామానికి చెందిన కనింటి మల్లేశ్కు 30 గుంటలు, పీ. నర్సింహారెడ్డికి 13 గుంటలు, వడ్డె రవి పేరిట 10 గుంటల భూమి ఉంది. అయితే బుధవారం విజయలక్ష్మి, వెంకటేశ్వరరావు, కవితారావు ఆ భూమిలో కంచె వేసేందుకు ప్రయత్నిస్తుండగా ఆ ముగ్గురు రైతులు అడ్డుకున్నారు. మా భూమి ఎక్కడుందో చూపించిన తర్వాత కంచె వేసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి గొడవ పెద్దది కాకుండా నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ముగ్గురు రైతులు తమ సమస్యను పరిష్కరించాలంటూ మీడియా దృష్టికి తీసుకొచ్చారు.
రైతులు ఏమంటున్నారు?
కే. కేశవరావు కుమారుడు వెంకటేశ్వరరావు 10 ఎకరాల భూమిని 2005లో కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. చివరికి 2007లో 10 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి వెంకటేశ్వరరావు తమను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ భూమి విషయంలోనే ప్రశాంత్ రెడ్డి అనే రియల్టర్ హత్య కూడా జరిగిందని వివరించారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ ఈ భూమి విషయంలో స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు. కాగా, రైతులను తాను బెదిరించలేదని, రెవెన్యూ అధికారులు సర్వే చేసి హద్దులు నిర్ణయించిన తర్వాతే కంచె వేసుకుంటున్నట్లు వెంకటేశ్వరరావు తెలిపారు.
Read More Articles |
Avatar2 Collections | 11 రోజులకే అన్ని వేల కోట్లా.. కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తున్న అవతార్ 2..
Donkey farm | గాడిదపాలతో లక్షల సంపాదన.. తెలంగాణ యువకుడి వినూత్న ఆలోచన
Vasthu shastra | భోజనం చేసేటప్పుడు ఏ దిక్కున కూర్చుంటే మంచిది.. తినడానికి కూడా వాస్తు ఉంటుందా?