Mystery Deaths | తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో అంతుచిక్కని వ్యాధి కలకలం సృష్టించింది. గంగాధరలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నెలన్నర వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు. నలుగురు జ్వరం, వాంతులతోనే ఆస్పత్రిలోనే చేరారు. ఒకరు మరణించిన తర్వాత మరొకరిలో లక్షణాలు బయటపడ్డాయి. ఆస్పత్రిలో చేరిన కొద్ది రోజులకే నలుగురూ మరణించారు. వీరి మరణాలకు కారణమేందనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలానికి చెందిన వేముల శ్రీకాంత్, మమత దంపతులకు ఇద్దరు సంతానం. 20 నెలల వయసున్న వీరి కుమారుడు అద్వైత్ వాంతులు, విరేచనాలు, జ్వరంతో నవంబరులో ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ నవంబరు 16న మృతి చెందాడు. ఆ బాధలోంచి తేరుకోకముందే ఐదేళ్ల పాప అమూల్య కూడా అవే లక్షణాలతో ఆస్పత్రిలో చేరింది. కుమారుడు మరణించడం.. కూతురు కూడా అవే లక్షణాలతో ఆస్పత్రిలో చేరడంతో బతికించుకునేందుకు శ్రీకాంత్ దాదాపు 15 లక్షలు ఖర్చు చేశాడు. కానీ ఫలితం దక్కలేదు. నవంబరు 29న పాప మరణించింది. దీంతో తల్లిదండ్రులిద్దరూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వాళ్లను ఓదార్చడం ఎవరితరం కాలేదు.
ఇంతలోనే శ్రీకాంత్ భార్య మమత కూడా జ్వరం, వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురైంది. దీంతో వెంటనే ఆమెను హైదరాబాద్లోని కార్పొరేట్ ఆస్పత్రికి తరలించాడు. ఆమెను బతికించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. డబ్బులు లేకపోవడంతో దాతలు స్పందించాలని సోషల్ మీడియా వేదికగా వేడుకున్నాడు. దీంతో పలువురు సాయమందించారు. లక్షలు ఖర్చవుతున్నా వెనక్కితగ్గకుండా ఆమెను బతికించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. లక్షలు ఖర్చు పెట్టాడు. కానీ డిసెంబర్ 18న భార్య మమత కూడా మృతి చెందింది. దీంతో ఒక్కసారిగా శ్రీకాంత్ కుంగిపోయాడు.
నెలక్రితం వరకు కళ్లముందు సంతోషంగా ఉన్న పిల్లలు, భార్య అంతుచిక్కని వ్యాధితో మరణించడంతో శ్రీకాంత్ను ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఒకే నెలలో ముగ్గురు మృతి చెందడంతో జిల్లా వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. శ్రీకాంత్ సహా.. మిగతా కుటుంబసభ్యుల రక్త నమూనాలను సేకరించారు. పరీక్షలన్నీ నార్మల్గానే వచ్చాయి. తాజాగా శ్రీకాంత్ కూడా అవే లక్షణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ( డిసెంబరు 30 ) న ప్రాణాలు కోల్పోయాడు. ఒకే కుటుంబంలో ముగ్గురి మృతికి కారణం తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే శ్రీకాంత్ కూడా మరణించడం ఇప్పుడు మిస్టరీగా మారిపోయింది. 45 రోజుల్లో ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందడంతో గంగాధరలో విషాదం నెలకొంది. వీరి మరణాలకు కారణం తెలుసుకునేందకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు వైద్యాధికారులు ముందుగానే అప్రమత్తమై పిల్లల మారణాలకు కారణాలు తెలుసుకుని ఉంటే తల్లిదండ్రులైనా బతికేవారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read More Articles |
Viral | అక్కడ గాలిపటాలు ఎగిరేసినా బట్టలు బయట ఎండేసినా నేరమే.. అలా చేస్తే జైల్లో ఉండాల్సిందేనట!
Tirumala | ఆరు నెలల పాటు శ్రీవారి దర్శనం నిలిపివేస్తున్నారా? క్లారిటీ ఇచ్చిన టీటీడీ