Viral News | అతను ఓ న్యాయవాది. అమాయకులకు శిక్షపడకుండా చూడాల్సిన బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్నాడు. కానీ చెప్పుడుమాటలు విని భార్యపై అనుమానం పెంచుకున్నాడు. పరాయి మగాళ్లతో సంబంధం పెట్టుకుంటుందేమోనని ఆమె పట్ల కర్కశంగా ప్రవర్తించాడు. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా చీకటి గదిలో బంధించి దుర్మార్గంగా వ్యవహరించాడు. అలా ఒకటి రెండు నెలలు కాదు.. ఏకంగా 11 ఏళ్ల పాటు నరకం చూపించాడు. తమ అమ్మాయి ఏదని అడిగిన తల్లిదండ్రులను బెదరగొట్టాడు. ఇంటికి వచ్చిన పోలీసులను కూడా తనకు తెలిసిన చట్టాలతో అదరగొట్టాడు. చివరకు పాపం పండటంతో పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. ఈ దుర్మార్గపు ఘటన ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తి జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాకు చెందిన సాయి సుప్రియకు విజయనగరం పట్టణం కంటోన్మెంట్ బాలాజీ మార్కెట్ సమీపంలో ఉంటున్న గోదావరి మధుసూదన్తో 2008లో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు పుట్టేదాకా వీరి కాపురం హాయిగా సాగిపోయింది. కానీ ఆ తర్వాతే అంతా మారిపోయింది. తన తల్లి ఉమామహేశ్వరి, తమ్ముడు చెప్పిన మాటలు విని భార్యపై మధుసూదన్ అనుమానం పెంచుకున్నాడు. తాను బయటకు వెళ్తే సుప్రియ ఎవరితో సన్నిహితంగా మెలుగుతుందోనని ఎప్పుడూ అదే ఆలోచించేవాడు. ఇలా రోజురోజుకీ ఆ అనుమానం ఎక్కువ కావడంతో శాడిస్టులా మారిపోయాడు. దీంతో సుప్రియను ఇంట్లో నుంచి బయటకు రాకుండా నిర్బంధించాడు.
ఆమెకు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా చేశాడు. ఇంట్లో చాకిరీ చేయడం.. పని అయిపోగానే వెళ్లి చీకటి గదిలోనే ఉండేలా హుకుం జారీ చేశాడు. రోజూ ఇంట్లో పనిచేసి ఆ రూంలోకి వెళ్లి ఉండాలి. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టడం కాదు కదా.. కనీసం కిటికీలో నుంచి కూడా బయటకు చూడకుండా ఉంచాడు. మధుసూదన్ ఎంత శాడిస్టుగా మారాడంటే.. సుప్రియను తన తల్లిదండ్రులు కూడా కలవనిచ్చేవాడు కాదు. సుప్రియ తల్లిదండ్రులు వచ్చి అడిగినా కూడా ఏదో ఒకటి చెప్పి పంపించేవాడు. గట్టిగా మాట్లాడితే తనకు తెలిసిన చట్టాలతో రివర్స్లో బెదిరించేవాడు. అలా దాదాపు 11 ఏళ్ల పాటు నరకం చూపించాడు. 11 ఏళ్లుగా తన కూతుర్ని చూపించకపోవడంతో సుప్రియ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందాడు. తన కూతురు గురించి ఎలాగైనా తెలుసుకోవాలని జిల్లా ఎస్పీని కలిశారు. జరిగిన విషయం చెప్పి సాయం చేయాలని కోరారు.
పోలీసులు కూడా సానుకూలంగా స్పందించి ఫిబ్రవరి 28న మధుసూదన్ ఇంటికి వచ్చారు. సుప్రియను చూపించాలని అడిగారు. కానీ వాళ్లను కూడా మధుసూదన్ అదరగొట్టాడు. మా ఇంటిని తనిఖీ చేసే అధికారం మీకు లేదు. కోర్టు ఆదేశాలు ఉన్నాయా అంటూ పోలీసులనే బెదిరించాడు. చట్టాలు మాట్లాడి బయటకు పంపించేశాడు. దీంతో సుప్రియ తల్లిదండ్రులను తీసుకుని పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సెర్చ్ వారెంట్ తీసుకుని మధుసూదన్ ఇంటికి వచ్చారు. పక్కా కోర్టు ఆదేశాలతో పోలీసులు రావడంతో చేసేదేమీ లేక మధుసూదన్ సుప్రియను చూపించాడు. 11 ఏళ్ల పాటు చీకటి గదిలో దుర్బర జీవితం అనుభవించడంతో సుప్రియ బక్కచిక్కి పోయింది. మొహంలో జీవం పోయి పీలగా తయారైంది. బంగారు బొమ్మలా ఉండే తన కూతురు అలా కట్టెపుల్లలా మారడంతో సుప్రియ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. తన కూతురికి నరకం చూపించిన మధుసూదన్ను కఠినంగా శిక్షించాలని పోలీసులను వేడుకున్నారు. ఈ వార్త ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Sunil | సునీల్ ఇంక హీరోగా పనికిరాడా.. విలన్ గా సెటిల్ అయిపోతాడా..?